నా ఆదేశాలు పాటించేలా ఈవోను ఆదేశించండి
ABN , First Publish Date - 2021-07-25T07:39:37+05:30 IST
పాలకమండలి సమావేశం ఏర్పాటు కోసం మాన్సాస్ ట్రస్ట్ ఎగ్జిక్యూటీవ్ ఆఫీసర్ (ఈవో) గత నెల 9న జారీ చేసిన ప్రొసీడింగ్స్ను సవాల్ చేస్తూ కేంద్ర మాజీ మంత్రి, మాన్సాస్ ట్రస్ట్ చైర్మన్ అశోక్ గజపతిరాజు హైకోర్టులో పిటిషన్
పాలకవర్గం ఏర్పాటు జీవో అమలు ఆపండి.. ‘మన్సాస్’పై హైకోర్టును ఆశ్రయించిన అశోక్
విచారణ నుంచి వైదొలిగిన జస్టిస్ రఘునందనరావు సీజే ఏకే గోస్వామి ముందుకు ఫైలు
అమరావతి, జూలై 24 (ఆంధ్రజ్యోతి): పాలకమండలి సమావేశం ఏర్పాటు కోసం మాన్సాస్ ట్రస్ట్ ఎగ్జిక్యూటీవ్ ఆఫీసర్ (ఈవో) గత నెల 9న జారీ చేసిన ప్రొసీడింగ్స్ను సవాల్ చేస్తూ కేంద్ర మాజీ మంత్రి, మాన్సాస్ ట్రస్ట్ చైర్మన్ అశోక్ గజపతిరాజు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. పాలకవర్గాన్ని ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది మార్చి 3న జారీ చేసిన జీవో 75 అమలును నిలుపుదల చేయాలని కోరారు. తమ ఆదేశాలను అనుసరించేలా ఈవోను ఆదేశించాలని కోరారు. దేవాదాయ శాఖ ముఖ్యకార్యదర్శి, కమిషనర్, మాన్సాస్ ట్రస్ట్ ఈవో డి. వెంకటేశ్వరావును వ్యాజ్యంలో ప్రతివాదులుగా చేర్చారు. అశోక్ గజపతిరాజు దాఖలు చేసిన వ్యాజ్యం శనివారం హైకోర్టులో విచారణకు వచ్చింది. ఈ సందర్భంగా న్యాయమూర్తి జస్టిస్ ఆర్.రఘునందనరావు విచారణ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. ఈ వ్యాజ్యం విచారణ నిమిత్తం ఏ బెంచ్ ముందు ఉంచాలనే విషయంపై నిర్ణయం కోసం ఫైలును హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అరూప్కుమార్ గోస్వామి ముందు ఉంచాలని రిజిస్ట్రార్ను ఆదేశించారు.