ఆషాఢ జాతర వచ్చేస్తోంది...

ABN , First Publish Date - 2022-06-24T06:25:00+05:30 IST

ఆషాఢ జాతర వచ్చేస్తోంది...

ఆషాఢ జాతర వచ్చేస్తోంది...

లోకంలోని సమస్త జీవరాశి మనుగడకు ఆధారం ప్రకృతి. ఆ ప్రకృతిని పరాశక్తిగా సంభావించి ఆరాధించడం భారతీయ సంప్రదాయం. వైపరీత్యాలను 

నిలువరించడం కోసం ప్రకృతి మాతను ప్రసన్నం చేసుకోవడానికి పూర్వులు నిర్దేశించినవే ఉత్సవాలు,

 జాతరలు. అలాంటి మహా వేడుకే తెలంగాణ ప్రాంతంలో నిర్వహించే బోనాలు.


30నుంచి బోనాలు వేడుకలు

షాఢమాసంలో తొలి ఆదివారం బోనాల ఉత్సవాలు మొదలై... నెలరోజులపాటు సాగుతాయి. వర్షాకాలంలో వ్యాధుల నుంచి, విపత్తుల నుంచి తమను కాపాడాలని గ్రామదేవతలను వేడుకుంటూ... అమ్మకు బోనం సమర్పించడమే ఈ ఉత్సవాల్లోని ప్రధానాంశం. శతాబ్దాలుగా తెలంగాణ ప్రాంతంలో ఈ వేడుకలు జరుగుతున్నట్టు చరిత్ర చెబుతోంది. పల్లె మధ్యలో బొడ్రాయిని ప్రతిష్ఠించి, దానికి పసుపు కుంకుమలు అద్ది, పూజలు చేసి, తమ ఇళ్ళలో చేసిన వంటలను నివేదించడం అనాది సంస్కృతి. అలా నివేదించిన భోజనమే బోనం. 


కాకతీయ సామ్రాజ్యంలో పాలకులు కాకతిని తమ కులదైవంగా ఆరాధించేవారనీ, రాజ్యంలో అందరూ ఆరోగ్యంగా, సుఖ సంతోషాలతో జీవించేలా అనుగ్రహించాలని ఆ తల్లిని కోరుకుంటూ... ఆషాఢ మాసంలో ఉత్సవాలు నిర్వహించేవారనీ తెలుస్తోంది. కాగా, 1908లో మూసీ నదికి వరదలు వచ్చి.. ప్లేగు లాంటి అంటువ్యాధులు వ్యాపించాయి. ప్రాణనష్టం జరిగింది. గోల్కొండలో వెలసిన జగదాంబికకు పూజలు చేస్తే పరిస్థితి చక్కబడుతుందని మంత్రి కిషన్‌ ప్రసాద్‌ సూచన మేరకు... నాటి గోల్కొండ ప్రభువు మీర్‌ మహబూబ్‌ ఆలీఖాన్‌ .. అమ్మవారికి పూజలు జరిపించి, బోనాల సమర్పణ చేయించాడు. తదనంతరం ప్రశాంతత నెలకొంది. నాటి నుంచి ఆషాఢ మాసంలో తొలి గురువారం లేదా ఆదివారం గోల్కొండ కోటలోని జగదంబిక     ఆలయంలో తొలి బోనాల సమర్పణ ఆనవాయితీగా వస్తోంది. తదనంతరం ఆది, గురు వారాల్లో తెలంగాణ ప్రాంతమంతా గ్రామదేవతలకు బోనాలు సమర్పించి, ఉత్సవాలు నిర్వహిస్తారు. హైదరాబాద్‌-సికింద్రాబాద్‌ జంట నగరాల్లో బోనాలు సంబరాలు అత్యంత వైభవంగా జరుగుతాయి. 


ఇదీ వేడుక...

‘బోనం’ అంటే అమ్మవారికి నివేదించే భోజనం. అన్నం వండి, అందులో పాలు  లేదా పెరుగులో బెల్లం కలిపి... కొత్త కుండలో నింపుతారు. ఈ ఘటం చుట్టూ వేపాకులు కట్టి, మూత పెట్టి, ఆ మూత మీద దీపం వెలిగిస్తారు. ఘటాన్ని మహిళలు తలపై పెట్టుకొని, ఊరేగింపుగా తమ ప్రాంతంలోని ఆలయాలకు వెళతారు. ఆలయం చుట్టూ ప్రదక్షిణ చేసి, అమ్మవారికి బోనం నివేదిస్తారు. ఆ తరువాత ప్రసాదంగా దాన్ని స్వీకరిస్తారు. అమ్మవారికి బోనం సమరిం్పంచేటప్పుడు... వేప మండలను పసుపు నీటిలో ముంచి, సంప్రోక్షణ చేశాక... అమ్మవారికి సమర్పిస్తారు. దీన్ని ‘సాక (కొమ్మ... వేప మండ) పెట్టడం’ అంటారు. మహిళలు ఆదిపరాశక్తిని తమ ఇంటి ఆడపడుచుగా భావించి, ఆషాఢపట్టి మాదిరిగా... పుట్టింటికి స్వాగతించి, నెలరోజులపాటు బోనాల సంబరాలు చేసుకుంటారు. అమ్మవారికి కలశాలతో స్వాగతం పలుకుతూ ఊరేగింపు చేస్తారు. దీన్ని ‘ఘటోత్సవం’ అంటారు. ఇంటికి వచ్చిన ఆడపడుచుకు సారె ఇచ్చి సాగనంపడం సంప్రదాయం. దాన్ని అనుసరించి, ప్రతి ఇంటా అమ్మవారి కోసం వివిధ రకాల పిండివంటలు చేసి, వాటిని బండ్లలో వేసి, ఆలయానికి తీసుకువచ్చి, అమ్మవారికి నివేదిస్తారు. ఈ ఫలహారపు బండ్ల ఊరేగింపు ఎంతో వైభవంగా సాగుతుంది. ఈ జాతరలో పోతురాజుది ప్రధాన పాత్ర. పోతురాజును అమ్మవారి సోదరుడిగా భావిస్తారు. ఒళ్ళంతా పసుపు పూసుకొని, కాళ్ళకు గజ్జెలు, నుదుట పెద్ద కుంకుమ బొట్టు, కళ్ళకు కాటుక అలంకరించుకొని, చేతిలో కొరడాతో పోతురాజులు చేసే విన్యాసాలు చూడముచ్చటగా ఉంటాయి. సికింద్రాబాద్‌ ఉజ్జయిని మహాంకాళి బోనాల మరుసటి రోజు రంగం నిర్వహిస్తారు. పచ్చి కుండపై అవివావిహత అయిన మహిళ నిలబడి... అమ్మవారి వాక్కుగా... భవిష్యత్‌ వాణి వినిపిస్తుంది. ఆషాఢమాసం చివరివారం గోల్కొండలోనే జరిగే ఆషాఢ జాతర ముగుస్తుంది.

ఎ. సీతారామారావు


సంబరాల్లో ప్రధానంగా...

జూన్‌ 30 : గోల్కొండ బోనాలతో ఉత్సవాలు ప్రారంభం

జూలై 17 : సికింద్రాబాద్‌ ఉజ్జయిని మహాంకాళి బోనాలు

జూలై 18 : రంగం, భవిష్యవాణి

జూలై 24 : భాగ్యనగర్‌ (లాల్‌ దర్వాజా) బోనాలు

జూలై 25 : ఉమ్మడి దేవాలయాల ఘటాల ఊరేగింపు

జూలై 28: గోల్కొండ బోనాలతో ఉత్సవాల ముగింపు

Updated Date - 2022-06-24T06:25:00+05:30 IST