కేసీఆర్‌.. సీఎంవా? గూండావా?

ABN , First Publish Date - 2022-01-26T08:34:42+05:30 IST

‘ఎంపీ అర్వింద్‌ తన నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాల పరిశీలనకు వెళితే టీఆర్‌ఎస్‌ గూండాలు, పోలీసులు కలిసి దాడి చేశారు..

కేసీఆర్‌.. సీఎంవా? గూండావా?

  • అర్వింద్‌ ఏమైనా నీ ఫాంహౌ్‌సకు వచ్చాడా
  • కష్టపడే ఐఏఎస్‌, ఐపీఎ్‌సలు లూప్‌లైన్‌లోనా
  • నిరుద్యోగి సాగర్‌ది ప్రభుత్వ హత్యే: సంజయ్‌

నల్లగొండ/పెంట్లవెల్లి, జనవరి 25 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): ‘ఎంపీ అర్వింద్‌ తన నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాల పరిశీలనకు వెళితే టీఆర్‌ఎస్‌ గూండాలు, పోలీసులు కలిసి దాడి చేశారు.. కేసీఆర్‌ నువ్వు సీఎంవా? గూండా పని చేస్తున్నావా? అర్వింద్‌ ఏమైనా నీ ఫామ్‌ హౌస్‌కు వచ్చాడా..? ప్రగతి భవన్‌కు వచ్చాడా..?’ అంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ విరుచుకుపడ్డారు. టీఆర్‌ఎ్‌సకు కౌంట్‌డౌన్‌ మొదలైందని గ్రహించిన సీఎం కేసీఆర్‌ ఒత్తిడిలోకి వెళ్లి, రాష్ట్రంలో హింసను ప్రేరేపిస్తున్నారని ఆరోపించారు. మంగళవారం ఆయన నల్లగొండలోని పలువురు సీనియర్‌ నాయకులను పరామర్శించారు. ఎంపీ అర్వింద్‌కు ఫోన్‌ చేసి దాడి జరిగిన తీరుపై ఆరా తీశారు. అనంతరం పార్టీ కార్యాలయంలో సంజయ్‌ మీడియాతో మాట్లాడారు. టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు తాగొచ్చి సీసాలు, కర్రలతో ఎంపీపై దాడికి దిగారని, యువమోర్చా కార్యకర్త విజయ్‌పై కత్తులతో దాడి చేసి హత్యాయత్నం చేశారని మండిపడ్డారు. డీజీపీకి తెలిసే రాష్ట్రంలో బీజేపీ శ్రేణులపై దాడులు జరుగుతున్నాయని ఆరోపించారు. దాడి విషయాన్ని తమ కేంద్ర నాయకత్వానికి, లోక్‌సభ స్పీకర్‌కు ఫిర్యాదు చేశామని వెల్లడించారు. ఉద్యోగ విరమణ చేసిన ఐఏఎస్‌ అధికారులను సీఎం తన దగ్గర పెట్టుకుని చాకిరీ చేయించుకుంటున్నారని, కష్టపడి పనిచేసే సమర్థులైన అధికారులను లూప్‌లైన్‌లో ఉంచారని పేర్కొన్నారు. బీజేపీ నాయకులను సతాయించే ఐఏఎస్‌, ఐపీఎ్‌సలకు ఎమ్మెల్సీ, మంత్రి పదవి, ఎంపీ టికెట్‌ ఇస్తానని సీఎం ఆశ చూపుతున్నారని విమర్శించారు. ఉద్యోగ నోటిఫికేషన్లు రాకపోవడంతో ఆత్మహత్య చేసుకున్న ఖమ్మం జిల్లాకు చెందిన నిరుద్యోగి ముత్యాల సాగర్‌ది ప్రభుత్వ హత్యేనని విమర్శించారు. 317 జీవోను సవరించాలనే డిమాండ్‌తో వేలాది మందితో వర్చువల్‌ ర్యాలీలు నిర్వహిస్తామని, ఈ కార్యక్రమాలకు కేంద్ర మంత్రి అమిత్‌ షా, పార్టీ జాతీయ అధ్యక్షుడు నడ్డా హాజరవుతారని సంజయ్‌ వెల్లడించారు.

 

హరీశ్‌ కాన్వాయ్‌ని అడ్డుకున్న బీజేపీ

నాగర్‌కర్నూలు జిల్లా కొల్లాపూర్‌ మండలం రామాపురం గ్రామ సమీపంలో ఏర్పాటు చేసిన 50 పడకల ప్రసూతి ఆస్పత్రి ప్రారంభానికి వస్తున్న వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావును పెంట్లవెల్లిలో బీజేపీ నాయకులు అడ్డుకుని, రోడ్డుపై నిరసన తెలిపారు. ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలు ఏ ఒక్కటీ నెరవేర్చలేదని మండిపడ్డారు.

Updated Date - 2022-01-26T08:34:42+05:30 IST