మనీలాండరింగ్ చట్టం కంపెనీ చట్టం పరిధిలోనిది
ABN , First Publish Date - 2021-12-04T08:39:16+05:30 IST
ప్రముఖ పారిశ్రామికవేత్తల నుంచి అక్రమంగా పెట్టుబడులు పెట్టించుకున్నారంటూ తన క్లయింట్ విజయసాయిరెడ్డిపై మనీలాండరింగ్ చట్టం కింద ఎన్ఫోర్స్మెంట్..
విజయసాయి కేసుకు వర్తించదు.. సీబీఐ కోర్టులో వాదనలు
హైదరాబాద్, డిసెంబరు 3 (ఆంధ్రజ్యోతి): ప్రముఖ పారిశ్రామికవేత్తల నుంచి అక్రమంగా పెట్టుబడులు పెట్టించుకున్నారంటూ తన క్లయింట్ విజయసాయిరెడ్డిపై మనీలాండరింగ్ చట్టం కింద ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కేసులు పెట్టిందని, అయితే ఆ కేసులో ఈ చట్టం వర్తించదని విజయసాయిరెడ్డి తరఫు సీనియర్ న్యాయవాది ఎస్ఎస్ ప్రసాద్ నివేదించారు. సీఎం జగన్ కంపెనీల్లో ముగ్గురు వ్యాపారుల పెట్టుబడులకు సంబంధించి సీబీఐ దాఖలు చేసిన చార్జిషీటు ఆధారంగా ఈడీ దాఖలు చేసిన అభియోగ పత్రం నుంచి తన పేరు తొలగించాలంటూ విజయసాయి దాఖలు చేసుకున్న డిశ్చార్జ్ పిటిషన్పై సీబీఐ ప్రత్యేక కోర్టు ప్రిన్స్పల్ జడ్జి బీఆర్ మధుసూదన్రావు శుక్రవారం విచారణ జరిపారు. మనీలాండరింగ్ నిరోధక చట్టానికి 2002లో కేంద్రం రూపకల్పన చేసిందని, అయితే అప్పుడు అందులో పెట్టుబడులకు సంబంధించిన అంశాలు పేర్కొనలేదని ప్రసాద్ తెలిపారు. 2009లో దానికి సవరణ చేసి ఐపీసీ నేరాలను చేర్చారని అన్నారు. జగన్ కంపెనీల్లోకి ప్రముఖ పారిశ్రామికవేత్తలు పెట్టిన పెట్టుబడులన్నీ 2008కి ముందే వచ్చాయని, అందుచేత పీఎంఎల్ఏ చట్టం కింద తన క్లయింట్పై కేసులు నమోదు చేయలేరని చెప్పారు.
2009కి ముందు జరిగిన ఘటనలకు సంబంధించి ఈడీ నమోదు చేసిన కేసులను ఢిల్లీ, తమిళనాడు, రాజస్థాన్ హైకోర్టులు గతంలో కొట్టివేశాయన్నారు. షేరు ధర ఎంతగా నిర్ణయించాలన్నది సంబంధిత కంపెనీ ఇష్టమని, కొనుగోలులో ఏవైనా నిబంధనల ఉల్లంఘనలు జరిగి ఉంటే కంపెనీ చట్టం కింద రిజిస్ర్టార్ ఆఫ్ కంపెనీస్ సంబంధిత ప్రత్యేక కోర్టులో ఫిర్యాదు చేయాలన్నారు. చట్టబద్ధంగా బ్యాంకు ఖాతాల్లో నగదు జమ చేసి షేర్లను కొనుగోలు ద్వారా జగన్ కంపెనీల్లో పారిశ్రామికవేత్తలు పెట్టుబడులు పెట్టారని.. మనీలాండరింగ్ జరిగిందనడం సరికాదని.. ఇందులో జోక్యం చేసుకునే అధికారం ఈడీకి లేదని చెప్పారు. తన క్లయింట్ తప్పు చేశారని రుజువైనా.. ఆర్వోసీ ఫిర్యాదు చేస్తేనే విచారణ చేపట్టాల్సి ఉంటుందని చట్టం చెబుతోందన్నారు. తదుపరి విచారణను కోర్టు ఈ నెల 10కి వాయిదా వేసింది. వీటితో పాటు జగతి పబ్లికేషన్స్కు సంబంధించిన ఇతర కేసులపై విచారణనూ న్యాయమూర్తి వేర్వేరు తేదీలకు వాయిదా వేశారు.