UK Visa: తొందరపడి విమాన టిక్కెట్లు బుక్ చేసుకోవద్దు.. భారతీయులకు బ్రిటన్ రాయబారి సూచన

ABN , First Publish Date - 2022-08-13T01:56:02+05:30 IST

వీసా రాకమునుపే విమాన టిక్కెట్లు బుక్ చేసుకోవద్దని బ్రిటన్ రాయబారి అలెక్స్ ఎల్లిక్స్ తాజాగా భారతీయులకు సూచించారు. వీసాల జారీలో తీవ్ర జాప్యం జరుగుతున్న నేపథ్యంలో ఆయన ట్విటర్‌లో వీడియో సందేశాన్ని షేర్ చేశారు.

UK Visa: తొందరపడి విమాన టిక్కెట్లు బుక్ చేసుకోవద్దు.. భారతీయులకు బ్రిటన్ రాయబారి సూచన

ఎన్నారై డెస్క్: వీసా(UK Visa) రాకమునుపే విమాన టిక్కెట్లు(Air tickets) బుక్ చేసుకోవద్దని బ్రిటన్ రాయబారి(High commissioner) అలెక్స్ ఎల్లిక్స్ తాజాగా భారతీయులకు సూచించారు. వీసాల జారీలో తీవ్ర జాప్యం జరుగుతున్న నేపథ్యంలో ఆయన ట్విటర్‌లో వీడియో సందేశాన్ని షేర్ చేశారు. ఈ అసాధారణ జాప్యంతో ఇబ్బందులు పడుతున్న వారికి క్షమాపణ కూడా చెప్పారు. అమెరికా, కెనడా, షెంజెన్ వీసాల జారీలో ప్రస్తుతం ఆలస్యం(Delay) చోటుచేసుకుంటున్న విషయం తెలిసిందే. మునుపెన్నడూ చూడని రీతిలో ఈ ఏడాది భారతీయులు బ్రిటన్‌కు వస్తారని తాము అంచనా వేస్తున్నట్టు అలెక్స్ చెప్పారు. వారందరికీ సకాలంలో వీసా అందేందుకు భారత్‌లోని హైకమిషన్ తను చేయవలసిందంతా చేస్తోందని అన్నారు. ‘‘వీసాల జారీలో జాప్యం గురించి మీ అందరికీ తెలిసిందే. ఇది మీ అందరికీ ఇబ్బందులు కలిగిస్తోంది. ఈ ఆలస్యంతో ఇబ్బంది పడ్డవారందరికీ క్షమాపణలు చెబుతున్నా’’ అని అలెక్స్ చెప్పారు. 


జాప్యానికి గల కారణాలను కూడా అలెక్స్ వివరించారు. ‘‘కరోనా తరువాత బ్రిటన్ వీసాలకు ఒక్కసారిగా డిమాండ్ పెరిగింది. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం కూడా వీసాల జారీలో ఆలస్యానికి కారణమవుతోంది. సమస్య పరిష్కారానికి మేము అదనపు వనరులు కేటాయించాం. అనేక మందికి శిక్షణ ఇస్తున్నాం. ప్రయారిటీ వీసా సర్వీసును అందుబాటులోనే ఉంచాం. అదే సమయంలో వీసా దరఖాస్తుదారులు సరైన డాక్యుమెంట్లు సమర్పించి సమస్య పరిష్కారానికి తమ వంతు తోడ్పాటునందించాలి’’ అని ఆయన వీడియోలో పేర్కొన్నారు. వీసా రాకమునుపే విమాన టిక్కెట్లు కొనుగోలు చేయద్దని కూడా సూచించారు. రాయబార కార్యాలయ మార్గదర్శకాలు తూచా తప్పకుండా పాటించాలని స్పష్టం చేశారు.  ప్రస్తుతం బ్రిటన్ వీసా పొందేందుకు సగటును రెండు నెలలు వేచి చూడాల్సి వస్తోందని ట్రావెల్ ఏజెంట్లు చెబుతున్నారు. అదనంగా రూ.23 వేలు చెల్లిస్తే మరింత వేగంగా వీసా వస్తుందని తెలిపారు. 





Updated Date - 2022-08-13T01:56:02+05:30 IST