మండలి డిప్యూటీ చైర్పర్సన్గా జకియా ఖానమ్ బాధ్యతల స్వీకారం
ABN , First Publish Date - 2021-11-27T08:55:38+05:30 IST
శాసనమండలి డిప్యూటీ చైర్పర్సన్గా జకియా ఖానమ్ ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు చైర్మన్ మోషేన్రాజు శుక్రవారం సభలో ప్రకటించారు...
అమరావతి, నవంబరు 26(ఆంధ్రజ్యోతి): శాసనమండలి డిప్యూటీ చైర్పర్సన్గా జకియా ఖానమ్ ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు చైర్మన్ మోషేన్రాజు శుక్రవారం సభలో ప్రకటించారు. ఆ వెంటనే ఆమె బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా సీఎం జగన్, చైర్మన్ మోషేన్ రాజు, మండలి సభ్యులు.. ఆమెను అభినందించారు. అనంతరం, సీఎం మాట్లాడుతూ.. ‘‘ఈ రోజు ‘అధ్యక్షా’ అని సంబోధించే స్థానంలో నా అక్క జకియా ఖానమ్ అమ్మ కూర్చోవడం చాలా సంతోషంగా ఉంది. సాధారణ కుటుంబంలో గృహిణిగా ఉన్న జకియా ఖానమ్ చట్టసభల్లో అడుగుపెట్టడమే కాకుండా డిప్యూటీ చైర్ పర్సన్గా ఆ స్థానంలో కూర్చున్నారు. ఇది నిజంగా మైనారిటీ అక్కచెల్లెమ్మలందరికీ ఒక సంకేతం, ఒక సందేశం. మహిళలు అన్ని రకాలుగా పైకి రావాలి’’ అని అన్నారు. అనంతరం డిప్యూటీ చైర్ పర్సన్ జకియా ఖానమ్ మాట్లాడుతూ.. సీఎం జగన్కు కృతజ్ఞతలు తెలిపారు. పదవికి న్యాయంచేసి సీఎం అడుగుజాడల్లో నడుచుకుంటానని తెలిపారు. పీడీఎఫ్ సభ్యుడు విఠపు బాలసుబ్రహ్మణ్యం, బీజేపీ ఎమ్మెల్సీ మాధవ్, కత్తి నరసింహారెడ్డి, యండపల్లి శ్రీనివాసులురెడ్డి, లక్ష్మణరావులు జకియా ఖానమ్కు శుభాకాంక్షలు తెలిపారు.