విభజన హామీలపై పోరుబాట
ABN , First Publish Date - 2022-03-04T08:44:38+05:30 IST
విభజన హామీలపై పోరుబాట
అఖిలపక్ష రౌండ్టేబుల్ సమావేశంలో నిర్ణయం
‘ప్రత్యేక హోదా’ను సవాల్గా తీసుకోవాలి: చలసాని
విశాఖపట్నం, మార్చి 3(ఆంధ్రజ్యోతి): విభజన చట్టంలోని హామీల అమలుకు రాష్ట్రవ్యాప్తంగా పోరాటాన్ని ఉధృతం చేయాలని అఖిలపక్షాల రౌండ్టేబుల్ సమావేశం తీర్మానించింది. ప్రత్యేక హోదా, విభజన హామీల సాధన సమితి అధ్యక్షుడు చలసాని శ్రీనివాస్ ఆధ్వర్యంలో విశాఖపట్నంలోని ఓ హోటల్లో గురువారం రౌండ్టేబుల్ సమావేశం నిర్వహించారు. ప్రత్యేకహోదా సాధనను బీజేపీ మినహా అన్ని రాజకీయ పార్టీలు సవాల్గా తీసుకోవాలని వక్తలు అభిప్రాయపడ్డారు. విభజన హామీల అమలు కోసం ఈనెల 15న ఒంగోలులో, తర్వాత కడప, తిరుపతిల్లో రౌండ్టేబుల్ సమావేశాలు నిర్వహించి కార్యాచరణ ప్రకటించాలని నిర్ణయించారు. రైల్వేజోన్ ఏర్పాటును వేగవంతం చేయాలనే డిమాండ్తో ఈ నెల 21న డీఆర్ఎం కార్యాలయం ముందు ధర్నా నిర్వహించాలని నిర్ణయించారు. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం రైల్వే జోన్ ఇస్తామని చెప్పి, డివిజన్ ఎత్తేస్తామంటోందన్నారు. గిరిజన యూనివర్సిటీకి రూ.1,800 కోట్లు అవసరమైతే రూ.50 కోట్లు మాత్రమే కేటాయించిందన్నారు. వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి కేటాయించాల్సిన నిధులను నిలిపివేసిందని చెప్పారు. స్టీల్ప్లాంట్ను అమ్మేస్తాం...లేదంటే మూసేస్తామంటూ బెదిరిస్తున్న బీజేపీ దుకాణాన్ని మూయించేలా విశాఖ ప్రజలు పోరాడతారన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా ఐదేళ్లు కాదు...పదేళ్లు అని పార్లమెంటులో డిమాండ్ చేసిన వెంకయ్యనాయుడు హోదా ఇవ్వకపోతే ఉప రాష్ట్రపతి పదవిని వదులుకుంటానని చెప్పి, మాట నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ మాట్లాడుతూ రాజధాని అమరావతికి రూ.1,214 కోట్లు అవసరమైతే కేంద్రం రూ.లక్ష కేటాయించి ఏపీ ప్రజలను అవమానించిందన్నారు. పోలవరం ఎత్తు తగ్గిస్తే ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్టుకు అవకాశం ఉండదన్నారు. ప్రత్యేక హోదా సాధన సమితి అధ్యక్షుడు చలసాని శ్రీనివాస్ మాట్లాడుతూ ‘ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయమని ఎవరైనా అంటే వారి రాజకీయ అధ్యాయం ముగిసిపోవడం ఖాయమని హెచ్చరించారు. విభజన హామీలపై గొంతెత్తని వారంతా ద్రోహులుగా మిగిలిపోతారన్నారు. టీడీపీ నేత నజీర్ మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం రాష్ట్ర ప్రజలకు అన్ని విధాలుగా అన్యాయం చేస్తోందన్నారు. కాంగ్రెస్ నేత సోడదాసి సుధాకర్ మాట్లాడుతూ ప్రధానిగా ఎనిమిదేళ్లు పనిచేసిన తర్వాత మోదీ ఏపీకి అన్యాయం జరిగిందని పార్లమెంట్లో మాట్లాడటం ఆశ్చర్యంగా ఉందన్నారు. సమావేశంలో విశ్రాంత వీసీ జార్జ్ విక్టర్, లోక్సత్తా, ఆమ్ ఆద్మీ పార్టీల నాయకులు తదితరులు పాల్గొన్నారు.