వైసీపీ, ఎన్డీఏలో చేరాలి
ABN , First Publish Date - 2021-10-18T07:23:23+05:30 IST
వైసీపీ, ఎన్డీఏలో చేరాలి
రాష్ట్రానికి మేలు జరుగుతుంది
పార్లమెంటులో జగన్ పార్టీ ఎంపీలు కేంద్రానికి అనుకూలంగా మాట్లాడుతున్నారు
కేంద్ర మంత్రి రాందాస్ అథావలే
విశాఖపట్నం, అక్టోబరు 17(ఆంధ్రజ్యోతి): ‘‘జగన్మోహన్రెడ్డి నేతృత్వంలోని వైసీపీ, కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏలో చేరాలి. అది జరిగితే రాష్ట్రానికి ఎంతో మేలు జరుగుతుంది. ఇరిగేషన్, జాతీయ రహదారుల ప్రాజెక్టులకు భారీగా నిధులు వస్తాయి’’ అని కేంద్ర మంత్రి రాందాస్ అథావలే అన్నారు. ఆదివారం విశాఖ పర్యటనకు వచ్చిన ఆయన విలేకరులతో మాట్లాడారు. లోక్సభ, రాజ్యసభ సమావేశాల్లో వివిధ అంశాలపై జరుగుతున్న చర్చల్లో వైసీపీ ఎంపీలు కేంద్రానికి అనుకూలంగా మాట్లాడుతూ, సహకారం అందిస్తున్నారని తెలిపారు. ‘‘వైఎస్ జగన్ నాకు మిత్రుడు. కేంద్రంలో చేరతానని చెబితే నేనే స్వయంగా ప్రధాని మోదీ, బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డాను కలసి మాట్లాడతా. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ వల్ల ఉద్యోగాల విషయంలో రిజర్వేషన్ వర్గాలకు నష్టం వాటిల్లుతుందన్న అభిప్రాయం నాకూ ఉంది. అయితే ప్రైవేటు రంగంలోనూ రిజర్వేషన్లను అమలు చేయాలని పార్లమెంటరీ కమిటీకి సిఫారసు చేశాం. ప్రభుత్వరంగ సంస్థల ప్రైవేటీకరణ అనేది పీవీ ప్రధానిగా వున్నప్పుడే ఆరంభమైంది’’ అని గుర్తుచేశారు. ఏపీలో మూడు రాజధానుల అంశం రాష్ట్రప్రభుత్వ పరిధిలోనిది పేర్కొన్నారు. ఏపీలో కులాలతో సంబంధం లేకుండా ప్రతి పేద కుటుంబానికి 5 ఎకరాల చొప్పున భూమి ఇవ్వాలని డిమాండ్ చేశారు. వార్షిక ఆదాయం రూ.8 లక్షలలోపు ఉన్న అగ్రవర్ణాలకు విద్య, ఉద్యోగాల్లో 10 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలన్నారు.