టీడీపీ కార్యకర్తపై ఎంపీటీసీ దాడి
ABN , First Publish Date - 2022-05-23T08:30:24+05:30 IST
టీడీపీ కార్యకర్తపై ఎంపీటీసీ దాడి
సహకరించిన వలంటీర్
దగదర్తి, మే 22: పాతకక్షలతో టీడీపీ కార్యకర్తపై వైసీపీ ఎంపీటీసీ దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. ఎంపీటీసీకి వలంటీర్ కూడా సహకరించారు. నెల్లూరు జిల్లా దగదర్తి మండలం దురిమెర్లలో జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. శనివారం రాత్రి తురిమెర్లలో జరిగిన ఓ పెళ్లికి టీడీపీ కార్యకర్త తక్కెడ చిన్న అభయ హాజరయ్యారు. ఈ క్రమంలో పాతకక్షలు మనసులో పెట్టుకుని ఎంపీటీసీ సభ్యుడు ప్రసాదు అతడిపై దాడి చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేసుకొన్నాడు. వలంటీర్ మనోహర్, కాకులూరి మధు అనే వ్యక్తితో కలిసి చీకట్లో ఒక్కడే ఉన్న సమయం చూసి రాడ్డుతో దాడికి పాల్పడ్డారు. దీంతో చిన్న అభయ తల, ఛాతి, మెడ భాగాల్లో తీవ్ర గాయాలయ్యాయి. గ్రామస్థులకు విషయం తెలియడంతో హుటాహుటిన అక్కడకు చేరుకుని అభయను నెల్లూరులోని జీజీహెచ్కు తరలించారు. ప్రస్తుతం అభయ పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఎస్ఐ సుమన్ బాధితుడి ఫిర్యాదు మేరకు కేసును దర్యాప్తు చేస్తున్నారు.