కొట్టి చంపేశారు!
ABN , First Publish Date - 2022-05-23T08:22:25+05:30 IST
కొట్టి చంపేశారు!
ఎమ్మెల్సీ మాజీ డ్రైవర్ సుబ్రహ్మణ్యానిది హత్యే!
తీవ్రంగా కొట్టి గొంతుపై కాలేసి తొక్కారు
దాంతో ఊపిరాడక గుండె ఆగి మృతి
కొన్ని అంతర్గత అవయవాలకూ గాయాలు
పోస్టుమార్టంలో వైద్యుల నిర్ధారణ
రోడ్డు ప్రమాదం జరిగిందనడం కట్టుకథే
సీసీ ఫుటేజ్లు పరిశీలించిన పోలీసులు
కదలికలపై మరిన్ని వివరాలు వెలుగులోకి
తొలుత అపస్మారక స్థితిలో ఉన్న డ్రైవర్ను
ఆస్పత్రి వద్దకు తెచ్చిన ఉదయభాస్కర్!
పరీక్షించి చనిపోయినట్లు చెప్పిన వైద్యులు
వెంటనే శవాన్ని తీసుకెళ్లిపోయిన ఎమ్మెల్సీ
పోలీసుల అదుపులోనే ఉదయభాస్కర్?
నేడు మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచే చాన్స్
వైసీపీ పెద్దలతో ఎమ్మెల్సీ మంతనాలు!
బెయిల్ కోసం గుట్టుగా ప్రయత్నాలు
(కాకినాడ-ఆంధ్రజ్యోతి)
వైసీపీ ఎమ్మెల్సీ అనంత ఉదయభాస్కర్ మాజీ డ్రైవర్ది ముమ్మాటికీ హత్యేనని నిర్ధారణ అయింది. రోడ్డు ప్రమాదమంటూ ఎమ్మెల్సీ చెప్పిందంతా కట్టుకథేనని తేలిపోయింది. పోస్టుమార్టంలో నివ్వెరపరిచే వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. తీవ్రంగా కొట్టడంతోపాటు గొంతుమీద కాలేసి తొక్కడంతో ఊపిరాడక గుండె ఆగిపోయి సుబ్రహ్మణ్యం చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారు. విపరీతంగా కొట్టడంతో శరీరంలోని కొన్ని అంతర్గత అవయవాలు కూడా తీవ్రంగా దెబ్బతిన్నట్లు గుర్తించారు. కాకినాడ జీజీహెచ్ ఫోరెన్సిక్ నిపుణులు పోస్టుమార్టం ప్రాథమిక నివేదికను ఆదివారం మధ్యాహ్నం పోలీసులకు అందించారు. మంగళగిరిలోని రాష్ట్ర ఫోరెన్సిక్ ల్యాబ్కు కొన్ని శాంపిల్స్ను సోమవారం పంపనున్నారు. వాటి ఫలితాలొచ్చాక పూర్తిస్థాయి నివేదిక సమర్పిస్తారు. ఇంకోవైపు.. ఎమ్మెల్సీ ఉదయభాస్కర్ ప్రస్తుతం పోలీసుల అదుపులోనే ఉన్నట్లు సమాచారం. కానీ అరెస్టు చూపకుండా తాత్సారం చేయడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆదివారం కోర్టు సెలవు కావడంతో సోమవారం మేజిస్ట్రేట్ ముందు ప్రవేశపెట్టి.. రాజమహేంద్రవరం సెంట్రల్ జైలుకు తరలించే అవకాశం ఉన్నట్లు తెలిసింది. మరోవైపు.. వైసీపీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు జిల్లా ఎస్పీని ఆదివారం కలిసినట్లు సమాచారం. అలాగే ఉదయభాస్కర్ కూడా వైసీపీ పెద్దలతో మంతనాలు జరిపారని.. బెయిల్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారని ప్రచారం జరుగుతోంది.
అంత్యక్రియలు పూర్తి..
ఎమ్మెల్సీ ఉదయభాస్కర్ను అరెస్టు చేస్తామని, హత్య కేసు నమోదు చేస్తామని పోలీసులు ప్రకటించిన దరిమిలా శనివారం అర్ధరాత్రి కుటుంబసభ్యులు శవపంచనామాకు అంగీకరించిన సంగతి తెలిసిందే. దీంతో ఒంటిగంట సమయంలో ఈ ప్రక్రియను వైద్యులు ప్రారంభించారు. శవపంచనామా మొత్తాన్ని వీడియోగ్రఫీ చేశారు. పోస్టుమార్టం ఆదివారం తెల్లవారుజామున 2.50 గంటలకు పూర్తయింది. పోలీసులు మూడు గంటలకు మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. భౌతిక కాయాన్ని సుబ్రహ్మణ్యం స్వగ్రామమైన పెదపూడి మండలం గొల్లల మామిడాడకు అంబులెన్సులో తరలించారు. అయితే కుటుంబసభ్యులు లేకుండానే పోలీసులు మృతదేహాన్ని తరలించడంతో నిరసన వ్యక్తమైంది. ఆదివారం ఉదయం 9.30 గంటలకు కుటుంబసభ్యులు అంత్యక్రియలు నిర్వహించారు. అంతకుముందు మృతుడి తల్లి కన్నీరుమున్నీరయ్యారు. ప్రభుత్వం తరఫున అన్ని విధాలా సాయం చేస్తామని శవపంచనామాకు అంగీకరింపజేసిన అధికారులు ఇంతవరకు తమకు ఏ సాయమూ ప్రకటించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఉదయభాస్కర్ను ఇంకా అరెస్టు చేయలేదని మండిపడ్డారు. సుబ్రహ్మణ్యం మరణంపై తొలుత పోలీసులు అనుమానాస్పద మృతి కేసుగా నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఇది హత్యేనని, ఎమ్మెల్సీని అరెస్టు చేయనిదే పోస్టుమార్టంకు అంగీకరించేది లేదని కుటుంబ సభ్యులు పట్టుబట్టడంతో.. హత్య కేసుగా మార్చుతామని శనివారం రాత్రి పది గంటలకు కాకినాడ ఎస్పీ రవీంద్రనాథ్బాబు ప్రకటించిన సంగతి తెలిసిందే.
చంపింది ఎక్కడ..?
సుబ్రహ్మణ్యాన్ని ఎలా చంపారు.. ఎందుకు చంపారు.. ఎక్కడ చంపారో తెలుసుకునేందుకు పోలీసులు ముమ్మర దర్యాప్తు ప్రారంభించారు. కాకినాడ బీచ్వద్ద చంపి ఉంటే అది ఎక్కడ అనేది ఆరా తీస్తున్నారు. దీనిపై ఉదయభాస్కర్తోపాటు హత్య జరిగిన సంఘటన స్థలంలో ఉన్న ఇద్దరిని ఇప్పటికే అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నట్లు తెలిసింది. మద్యం మత్తులో చంపారా.. లేదా పథకం ప్రకారమే అంతమొందించారా అనేది ఆరా తీస్తున్నారు.
సీసీటీవీ ఫుటేజ్ పరిశీలన..
సుబ్రహ్మణ్యం రోడ్డుప్రమాదానికి గురయ్యాడని, కాకినాడ అమృత ఆస్పత్రికి తరలించి కారులోనే ఉంచి వైద్యుడితో పరీక్ష చేయిస్తే చనిపోయాడని నిర్ధారించారని ఉదయభాస్కర్.. సుబ్రహ్మణ్యం కుటుంబ సభ్యులకు చెప్పిన నేపథ్యంలో.. పోలీసులు అక్కడ సీసీటీవీ ఫుటేజ్ను పరిశీలించారు. అందులో గురువారం అర్ధరాత్రి 1.30 గంటలకు ఎమ్మెల్సీ ఉదయభాస్కర్ కారులో ఆస్పత్రికి వచ్చినట్లు కనిపిస్తోంది. అప్పటికే వైద్యులతో ఫోన్లో మాట్లాడడంతో.. వాళ్లు బయటకు వచ్చి కారు వెనుక సీటులో అపస్మారక స్థితిలో పడి ఉన్న సుబ్రహ్మణ్యాన్ని ఏడు నిమిషాలపాటు పరీక్షించి.. చనిపోయినట్లు నిర్ధారించారు. దీంతో 1.40 గంటలకు సుబ్రహ్మణ్యాన్ని ఎమ్మెల్సీ కారులో తీసుకెళ్లిపోయినట్లు సీసీటీవీలో గుర్తించారు. నాగమల్లితోట జంక్షన్ వద్ద ప్రమాదం జరిగిందని ఉదయభాస్కర్ చెప్పడంతో అక్కడి సీసీ ఫుటేజీని కూడా పరిశీలించారు. కానీ ఆ రోజు అక్కడ రోడ్డు ప్రమాదమేదీ జరగలేదని సర్పవరం సీఐ తన దర్యాప్తులో తేల్చారు. దీనిని బట్టి ముందే హత్య చేసి రోడ్డు ప్రమాదమనే కట్టుకథ అల్లారని.. అది నిజమని చెప్పడానికి కావాలనే మృతదేహాన్ని అమృత ఆస్పత్రి వద్దకు తెచ్చినట్లు తెలుస్తోంది.
మీడియా ముందుకు వస్తానంటే..
వాస్తవానికి.. పరారీలో ఉన్న ఉదయభాస్కర్ శనివారం మధ్యాహ్నం రాజవొమ్మంగిలో విలేకరుల సమావేశంలో హత్య గురించి వివరించేందుకు నిర్ణయించుకున్నారని.. కానీ ఓ పోలీసు ఉన్నతాధికారి సూచనలతో రద్దు చేసుకున్నట్లు తెలిసింది. పోస్టుమార్టం పూర్తి కాకుండా వివరాలు వెల్లడిస్తే చిక్కులు ఎదురయ్యే ప్రమాదం ఉందని ఆయన ఎమ్మెల్సీని హెచ్చరించినట్లు సమాచారం.