తప్పుడు వివరాలతో నిధుల గండం
ABN , First Publish Date - 2022-05-16T08:22:35+05:30 IST
తప్పుడు వివరాలతో నిధుల గండం
ఆయుష్మాన్ భారత్ నిధులపై ట్రస్ట్ నిర్లక్ష్యం!
రూ.160 కోట్లు నిలిపేసిన ఎన్హెచ్ఏ
రూ.380 కోట్లలో రూ.220 కోట్లే విడుదల
నిధుల కోసం 4 నెలలుగా ప్రయత్నాలు
ఆరోగ్యశ్రీ వైద్య సేవలపై తీవ్ర ప్రభావం
(అమరావతి-ఆంధ్రజ్యోతి)
రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ పరిధిలోకి వచ్చే బీపీఎల్ కుటుంబాల్లో 30 శాతం మంది ఆయుష్మాన్ భారత్ పథకం పరిధిలోకి వస్తారు. ఆరోగ్యశ్రీ ట్రస్ట్ ఆయుష్మాన్ భారత్ పరిధిలో శస్త్ర చికిత్సలు చేయించుకున్న వారి వివరాలు ఎప్పటికప్పుడు కేంద్రానికి పంపిస్తే.. దానికి అనుగుణంగా కేంద్ర ప్రభుత్వం నిధులు విడుదల చేస్తుంది. ఏడాదిలో అత్యధికంగా రూ.380 కోట్ల నుంచి రూ.400 కోట్లు విడుదల చేస్తుంది. అయితే కేంద్ర ప్రభుత్వం నుంచి ఆయుష్మాన్ భారత్ నిధులను కూడా రాష్ట్ర ప్రభుత్వం సక్రమంగా తెచ్చుకోలేకపోతోంది. 2021- 22లో కేవలం రూ.220 కోట్లు మాత్రమే ఆయుష్మాన్ భారత్ కింద ఆరోగ్యశ్రీ ట్రస్ట్ తెప్పించుకోగలిగింది. కేంద్ర మరో రూ.160 కోట్లు నిధులు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నా ఆరోగ్యశ్రీ ట్రస్ట్ నిర్లక్ష్యం కారణంగా ఈ నిధులు మొత్తం బ్లాక్ అయ్యాయి. నిబంధనల ప్రకారం ఆరోగ్యశ్రీ ట్రస్ట్ ఆయుష్మాన్ భారత్ కింద ఎంత మంది రోగులకు వైద్య సేవలు అందించాం? ఏయే శస్త్ర చికిత్సలు చేయించుకున్నారు? ఆ శస్త్ర చికిత్సల మొత్తం వ్యయం ఎంత? అన్న వివరాలు ఆరోగ్యశ్రీ ట్రస్ట్లోని ఆర్థిక విభాగం సృష్టమైన వివరాలు కేంద్రానికి పంపించాలి. ఆ వివరాలను నేషనల్ హెల్త్ ఏజెన్సీ (ఎన్హెచ్ఎ) పరిశీలించి... ఆ మేరకు నిధులు విడుదల చేస్తుంది. ఈ ఏడాది ఆరోగ్యశ్రీ ట్రస్ట్లోని ఆర్థిక విభాగం కేంద్రానికి పంపించిన వివరాలు సక్రమంగా లేవు. దీంతో ఎన్హెచ్ఏ నిధులు విడుదలను ఆపేసింది.. ఈ తప్పిదాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఆలస్యంగా గుర్తించింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆరోగ్యశ్రీ ట్రస్ట్ అధికారులను మందలించి వెంటనే సరైన వివరాలు కేంద్రానికి పంపించాలని ఆదేశించారు. దీంతో ఆరోగ్యశ్రీ ట్రస్ట్ ఆరోగ్యశ్రీ ట్రస్ట్ సీఈవో స్వయంగా ఢిల్లీకి వెళ్లి జరిగిన తప్పును వివరిస్తూ.. కొత్త రిపోర్టును సమర్పించారు. అప్పటికే నిధులు విడుదల చేసేందుకు సమయం ముగిసిపోవడంతో ఎన్హెచ్ఏ అధికారులు తాము మరోసారి పరిశీలించిన తర్వాత నిర్ణయం తీసుకుంటామని ట్రస్ట్ అధికారులను వెనక్కి పంపించారు.