ఆరోగ్యశ్రీ.. ఇక అంతేనా?
ABN , First Publish Date - 2022-05-16T08:19:39+05:30 IST
ఆరోగ్యశ్రీ.. ఇక అంతేనా?
బిల్లులందక చికిత్సలు చేయని నెట్వర్క్ ఆస్పత్రులు
రూ.600 కోట్ల బిల్లులు పెండింగ్
CFMSలో అప్లోడ్కు మరో రూ.80 కోట్లు రెడీ
వైద్యం ఖర్చు లక్ష దాటినా ఆరోగ్యశ్రీ పరిధిలోకి రానివైనం
గ్రీన్ చానెల్ బిల్లులకు ప్రభుత్వం రెడ్ సిగ్నల్
(అమరావతి, ఆంధ్రజ్యోతి)
తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే రూ.వెయ్యి ఖర్చు దాటిన ఏ వైద్య చికిత్స అయినా ఆరోగ్యశ్రీ పరిధిలోకి తీసుకొచ్చేస్తామని ప్రగల్భాలు పలికారు. ఆరోగ్యశ్రీకి తొలి ప్రాధాన్యం ఇస్తామన్నారు.. మానసపుత్రికగా చూసుకుంటామన్నారు. ఇలా మాటలు కోట దాటించారు... చేతలు మాత్రం గడప దాటడం లేదు. ప్రభుత్వ ప్రతిష్టాత్మకమైన కార్యక్రమం అని చెబుతూనే... ఆరోగ్యశ్రీ ఆయువు తీసేశారు. అటకెక్కించేశారు. రాష్ట్రంలో ఇలాంటి దౌర్భాగ్య పరిస్థితులకు ప్రభుత్వ విధానాలే కారణమని వైద్య నిపుణులు చెబుతున్నారు.
బిల్లులు చెల్లించకపోతే వైద్యం ఎలా?
ప్రస్తుతం రాష్ట్రంలో 874 ప్రయివేటు ఆస్పత్రులు ఆరోగ్యశ్రీ నెట్వర్క్లో వైద్య సేవలు అందిస్తున్నాయి. వీటికి ప్రభుత్వం రూ.520 కోట్ల బకాయిలు పడింది. ఈ ఆస్పత్రులకు నాలుగు నెలల నుంచి ఆరోగ్యశ్రీ ట్రస్ట్, రాష్ట్ర ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా చెల్లించలేదు. ఇవి కాకుండా మరో రూ.80 కోట్ల బిల్లులు సీఎ్ఫఎంఎ్సలోకి అప్లోడ్ కావాల్సి ఉంది. దాదాపు రూ.600 కోట్ల బిల్లులు పెండింగ్లో ఉన్నాయి. ఒక్కో ఆస్పత్రికి రూ.కోటి నుంచి రూ.3 కోట్ల వరకూ ప్రభుత్వం బకాయిలు పండింది. ఈ నిధులు ఎప్పుడు చెల్లిస్తారు? అసలు ఇప్పుడు ఇచ్చే పరిస్థితి ఉందా? అంటే ఆరోగ్యశ్రీ ట్రస్ట్ వద్ద సమాధానం లేదు. దీంతో ఆరోగ్యశ్రీ పరిధిలో ఉన్న నెట్వర్క్ ఆసుపత్రులు మొత్తం చేతులెత్తేశాయి. వైద్యం ఖర్చు రూ.1000 కాదు.. లక్ష దాటినా ఆరోగ్యశ్రీలో చేర్చుకోవడం లేదు. ఆస్పత్రులకు బిల్లులు చెల్లించకపోవడం వల్లే ఈ దుస్థితి దాపురించింది.
ప్యాకేజీలపై సమీక్ష ఏదీ?
మరోవైపు గతంలో ఆరోగ్యశ్రీ ద్వారా కేవలం 1054 రకాల శస్త్ర చికిత్సలు చేసేవారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వాటి సంఖ్యను సుమారు 2490కి పెంచారు. అయితే అందుకు అనుగుణంగా ప్యాకేజీలు పెంచలేదు. నిబంధనల ప్రకారం ఆరోగ్యశ్రీ ప్యాకేజీల విషయంలో ఎప్పటికప్పుడు సమీక్ష చేయాలి. సీపీఐ నామ్స్ ప్రకారం ప్యాకేజీలు పెంచాల్సిన అవసరం ఉంది. కానీ కొత్త ప్రభుత్వం ఇప్పటికూ ఆరోగ్యశ్రీ శస్త్ర చికిత్సల ప్యాకేజీల విషయంపై దృష్టిపెట్ట లేదు. ప్యాకేజీలు పెరగకపోవడంతో నెట్వర్క్ ఆసుపత్రులు 2490 శస్త్ర చికిత్సలు చేయడానికి ముందుకు రావడం లేదు. వారికి ఆదాయం వచ్చే శస్త్ర చికిత్సలు మాత్రమే చేస్తున్నారు. మిగిలిన శస్త్ర చికిత్సలు ఆరోగ్యశ్రీ పరిధిలోకి రావని రోగులను బయటకు పంపిస్తున్నారు. దీంతో అర్హత ఉండీ.. రాష్ట్రంలో 40 శాతం మంది రోగులు తమ జేబులోని డబ్బులు ఖర్చు పెట్టుకుని శస్త్ర చికిత్సలు చేయించుకుంటున్నారు.
ఆ నిధులే అండ..
ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆస్పత్రులకు రాష్ట్ర ప్రభుత్వం ఏ రోజు కూడా సక్రమంగా నిధులు విడుదల చేసిన దాఖలాలు లేవు. ఇలాంటి పరిస్థితుల్లో ఆయుష్మాన్ భారత్ నిధులే ఆరోగ్యశ్రీ ట్రస్ట్కు పెద్ద అండగా నిలుస్తున్నాయి. నెట్వర్క్ ఆస్పత్రులకు రూ.200 కోట్ల పైన బకాయిలు పడితే వెంటనే ట్రస్ట్ అధికారులు ఆయుష్మాన్ భారత్ నిధులను కూడా నెట్వర్క్ ఆస్పత్రులకు చెల్లిస్తున్నారు. గత నాలుగు నెలల నుంచి ఆరోగ్యశ్రీకి రాష్ట్ర ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా ఇవ్వడం లేదు. ఆరోగ్యశ్రీ ట్రస్ట్ అధికారుల తప్పిదం వల్ల ఆయుష్మాన్ భారత్ నిధులు కూడా నిలిచిపోయ్యాయి. పేమెంట్ జరగడం లేదు. దీంతో నెట్వర్క్ ఆస్పత్రులు గగ్గోలు పెడుతున్నాయి.
పేదలకు కార్పొరేట్ వైద్యం ఇక మిథ్యే
వైద్యం విషయంలో ఆరోగ్యశ్రీ ట్రస్ట్ కూడా నెట్వర్క్ ఆసుపత్రులకు గట్టిగా చెప్పలేకపోతోంది. దీంతో నెట్వర్క్ ఆసుపత్రుల యాజమాన్యాలు ఆరోగ్యశ్రీ ద్వారా వైద్యం చేయలేమని బహిరంగంగానే చెబుతున్నాయి. డబ్బులు కట్టే స్తోమత ఉంటే ఆస్పత్రిలో చేరండి.. లేదంటే వెళ్లిపోండి అంటూ సృష్టంగా చెప్పేస్తున్నారు. దీంతో పేద రోగులకు కార్పొరేట్ వైద్యం దూరం కావడంతో పాటు ప్రభుత్వాసుపత్రే దిక్కుగా మారుతోంది. నెట్వర్క్ ఆస్పత్రులు ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చినా ఫలితం లేకుండాపోతోంది. ఆరోగ్యశ్రీ ట్రస్ట్ ఈ స్థాయిలో బకాయిలు పడిన దాఖలాలు లేవు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు ఆరోగ్యశ్రీ బిల్లుల చెల్లింపు కోసం గ్రీన్చానెల్ ఏర్పాట్లు చేశామని ప్రకటనలు చేశారు. కానీ ఒక్క రోజు కూడా గ్రీన్ చానెల్ చెల్లింపులు చేసిన దాఖాలాలు లేవు. రెండున్నరేళ్ల నుంచి ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆస్పత్రుల బిల్లుల విషయంలో ప్రభుత్వం ఇదే తరహా నిర్లక్ష్యం వహిస్తోంది. కోట్ల రూపాయిల బిల్లులు బకాయిలు పెట్టడంతో ఆరోగ్యశ్రీలో రోగులను చేర్చుకుని శస్త్ర చికిత్సలు చేయడానికి నెట్వర్క్ ఆస్పత్రులు మొగ్గు చూపడం లేదు. అంతిమంగా పేద ప్రజలు కార్పొరేట్ వైద్యానికి దూరమవుతున్నారు.