గందరగోళం
ABN , First Publish Date - 2022-04-04T14:30:32+05:30 IST
గందరగోళం
-జిల్లాల విభజనతో ఉపాధ్యాయుల ఉక్కిరిబిక్కిరి
-స్థానికత, సర్వీసు లెక్కింపుపై అస్పష్టత
-విద్యాశాఖలో సంస్కరణలతో ఇప్పటికే అనేక సమస్యలు
-జిల్లాల పునర్విభజనతో మరిన్ని ఉత్పన్నమయ్యే ప్రమాదం
అనంతపురం: జిల్లాల విభజనతో విద్యాశాఖలోని అధికారులు, ఉపాధ్యాయులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఇప్పటికే విద్యాశాఖలో సంస్కరణల అమలుతో ఎన్నో సమస్యలు ఉత్పన్నమయ్యాయి. తాజాగా జిల్లాల పునర్విభజనతో ఆ వర్గాల్లో గందరగోళం నెలకొంది. వేలాదిమంది ఉపాధ్యాయులు పాత జిల్లానా... కొత్త జిల్లానా..? బదిలీలు వస్తాయా..? వస్తే... సర్వీసు లెక్కింపు ఎలా చేస్తారు...?, స్థానికత ఎలా తీసుకుంటారు.. అంటూ సతమతం అవతున్నారు. సర్వీస్ మ్యాటర్స్పై ప్రభుత్వం నుంచి స్పష్టత రాకపోవడంతో అయోమయంలో పడ్డారు. ఇప్పటికే సంస్కరణలు అంటూ ప్రభుత్వం రెండున్నరేళ్లుగా 3, 4, 5 తరగతుల విలీనం, సీబీఎ్సఈ స్కూళ్లు, ఇంగ్లీష్ మీడియం అంటూ అనేక సమస్యలను ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వకుండా ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటూ... మౌఖికంగా ఆదేశాలిస్తూ... ముందుకెళ్తుండటంతో... అన్నివర్గాల అధికారులు, టీచర్లలోనూ గందరగోళం నెలకొంది. దీనికితోడు ఇప్పుడు జిల్లాల పునర్విభజనలో టీచర్ల పరిస్థితిపై స్పష్టత ఇవ్వకపోవడంతో ఆయావర్గాలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నాయి.
తాత్కాలికంగా స్కూళ్ల లెక్కలు ఇలా...పాఠశాల విద్యాశాఖ కమిషనర్ (సీఎస్ఈ) నుంచి కోరిన మేరకు ఉమ్మడి అనంతపురం జిల్లాలోని స్కూళ్లను తాత్కాలికంగా రెండుగా విభజించి... ఆ వివరాలను సీఎ్సఈకి జిల్లా విద్యాశాఖాధికారులు పంపారు. ఆ మేరకు అనంతపురం జిల్లాలో 34 మండలాల పరిధిలో 2,646 స్కూళ్లను గుర్తించారు. శ్రీ సత్యసాయి జిల్లాలో 29 మండలాల పరిధిలో 2,396 స్కూళ్లను గుర్తించారు. సీఎ్సఈ ప్రాథమికంగా అన్ని జిల్లాల నుంచి స్కూళ్ల వివరాలను తీసుకున్నారు కానీ.. ఫైనల్గా అధికారిక ద్రువీకరణ చేయలేదు.సమస్యల కుంపటిజిల్లాల విభజన నేపథ్యంలో టీచర్ల సర్వీసుపై స్పష్టత రాకపోవడంతో.. ఉపాధ్యాయ వర్గాలు మండిపడుతున్నాయి. స్థానికత ఎలా తీసుకుంటారన్న దానిపై క్లారిటీ ఇవ్వడం లేదు. దీనిపై స్పష్టత ఇవ్వకుంటే.. బదిలీలు, ఉద్యోగోన్నతుల సమయంలో అనేక సమస్యలు ఉత్పన్నమయ్యే ప్రమాదం ఉంది. ప్రస్తుతం డీఈఓ కార్యాలయం, సమగ్రశిక్ష ప్రాజెక్టులో పలువురు టీచర్లు ఫారిన్సర్వీసు ద్వారా పనిచేస్తున్నారు. ఇప్పుడు ఉన్నఫలంగా వారిని అనంతపురం నుంచి సత్యసాయి జిల్లాకు బదిలీ చేస్తే.. అక్కడ పనిచేసిన కాలాన్ని ఎలా లెక్కిస్తారన్న దానిపై కూడా క్లారిటీ లేదు. దీంతో ప్రాజెక్టు నుంచి, డీఈఓ ఆఫీస్ నుంచి తమను వెంటనే స్కూళ్లకు పంపాలంటూ.. కొందరు ఉన్నతాధికారులను కలసి మొరపెట్టుకున్నారు. ఇలా చేస్తే అయినా... కొంతలో కొంత వరకూ అయినా... వచ్చే ప్రమాదం నుంచి, ఇప్పుడున్న టెన్షన్ నుంచి బయట పడవచ్చు అంటూ పలు పోస్టుల్లో ఉన్న టీచర్లు.. ఉన్నతాధికారుల వద్దకు క్యూ కడుతున్నారు. ఏ నిర్ణయం తీసుకుంటే ఎక్కడ ఏ సమస్య వస్తుందో... అంటూ ఉన్నతాధికారులు సైతం వేచిచూద్దామన్న ధోరణితో ఉండటంతో ఉపాధ్యాయ వర్గాల్లో టెన్షన్ రేపుతోంది.