ఈ వ్యాఖ్యలు రౌడీలను పురిగొల్పడమే!

ABN , First Publish Date - 2021-02-26T07:58:35+05:30 IST

జగన్‌రెడ్డి అభిమానులు చంద్రబాబును ఏదైనా చేస్తే తమ బాధ్యత కాదని ముఖ్యమంత్రి సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడడం హింసకు దిగాలని రౌడీలను పురిగొల్పడమేనని టీడీపీ విమర్శించింది...

ఈ వ్యాఖ్యలు రౌడీలను పురిగొల్పడమే!

  • సజ్జల వ్యాఖ్యలపై డీజీపీ కేసు పెడతారా?
  • ప్రతిపక్షంలో జగన్‌ వ్యాఖ్యలు గుర్తులేవా?
  • బాబు ఎప్పుడూ రెచ్చగొట్టలేదు: టీడీపీ

అమరావతి, ఫిబ్రవరి 25 (ఆంధ్రజ్యోతి): జగన్‌రెడ్డి అభిమానులు చంద్రబాబును ఏదైనా చేస్తే తమ బాధ్యత కాదని ముఖ్యమంత్రి సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడడం హింసకు దిగాలని రౌడీలను పురిగొల్పడమేనని టీడీపీ విమర్శించింది. సజ్జల వ్యాఖ్యలపై డీజీపీ కేసు పెడతారా అని ప్రశ్నించింది. చంద్రబాబు భాషపై సజ్జల విమర్శలు చేయడం దెయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉందని టీడీఎల్పీ ఉప నేత నిమ్మల రామానాయుడు గురువారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ‘ప్రతిపక్షంలో ఉండగా జగన్‌ వాడిన భాష వైసీపీ నేతలకు గుర్తు లేదా? నడి రోడ్డుమీద కాల్చి చంపాలని... చెప్పుతో కొట్టాలని జగన్‌ నోటికి వచ్చినట్లు మాట్లాడిన మాటలు సభ్యతతో కూడినవేనా? చంద్రబాబుకు ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. కానీ  ఆయన ఎప్పుడూ ఇలాంటి రెచ్చగొట్టే పిలుపులు ఇవ్వలేదు. రెచ్చగొట్టలేదు. జగన్‌ రెండేళ్లు పాదయాత్ర చేస్తే ఏ హానీ జరగకుండా పూర్తి రక్షణ కల్పించారు. జగన్‌రెడ్డి ఆలోచనలన్నీ హింస, అవినీతితో నిండి ఉంటాయని సజ్జల మరోసారి నిరూపించారు’ అని విమర్శించారు.


Updated Date - 2021-02-26T07:58:35+05:30 IST