జంతుబలి అమానుషం

ABN , First Publish Date - 2020-08-31T07:03:34+05:30 IST

జీవహింసను త్యజించవలసిన ఉత్తమ ధర్మంగా వ్యాస భగవానుడు సూచించాడు. మహా భాగవతంలోని సప్తమ స్కంధం.. పదిహేనవ అధ్యాయంలో నారద మహర్షి ధర్మరాజుకు బోధించిన విషయాల్లో ఈ విషయాన్ని ప్రవచించాడు...

జంతుబలి అమానుషం

  • నైతాదృశః పరోధర్మో నృణాం సద్ధర్మ మిచ్ఛతామ్‌!
  • వ్యాసో దండస్య భూతేషు మనో వాక్కాయజన్యయః!!

‘‘ఇతర ప్రాణుల విషయంలో మనోవాక్కాయకర్మల సాక్షిగా హింసను విడిచిపెట్టడమే అసలైన సద్ధర్మము. ఇంతటి పరమ ధర్మము మరొకటి లేదు’’ అన్న భాగవత సందేశం విశ్వ మానవాళికి ఆచరణయోగ్యమైనది. జీవహింసను త్యజించవలసిన ఉత్తమ ధర్మంగా వ్యాస భగవానుడు సూచించాడు. మహా భాగవతంలోని సప్తమ స్కంధం.. పదిహేనవ అధ్యాయంలో నారద మహర్షి ధర్మరాజుకు బోధించిన విషయాల్లో ఈ విషయాన్ని ప్రవచించాడు. యజ్ఞకర్మలో మనము పశుబలినిచ్చి హింసకు పాల్పడరాదు. ఈ విధంగా పశుహింస చేసేవాడు నిజంగా ఒక అజ్ఞాని. ఏ ప్రాణినైనా వాక్కుతో, శారీరకంగా, మానసికంగా హింసిచడమనేది మూర్ఖత్వం. ఇది ధర్మకార్యం కాదు. యజ్ఞంలో సమర్పించే హవ్యం పశువు కాదు. పశుప్రాయమైన మన ఇంద్రియలోలత్వము, కామక్రోధాది గుణాలను బలిగా సమర్పించాలి. పశువు అంటే పశుసమానమైన క్రియా కలాపాలు, ఆలోచనలు మొదలైనవి. పశుబలికి అర్థం పశుసమాన క్రియల్ని బలిగా సమర్పిచాలన్న భావం రావాలి. అదే పరమైన ధర్మమని భాగవతం చెబుతోంది. పశుహింసకు పాలుపడే మరో సందర్భం శ్రాద్ధకర్మాదులు. ఆ విషయాన్ని నారదమహర్షి నోట వేదవ్యాసుడు పలికించాడు. ‘‘నిజమైన తత్త్వము తెలిసిన వాడెవడూ శ్రాద్ధకర్మల సందర్భంగా పశుమాంసాన్ని పెట్టరాదు, తానూ భుజించరాదు. మునిజనులు తినే సాత్వికాహారాన్ని మాత్రమే పెట్టాలి. దానితో కలుగు సంతోషము పశుహింస వలన కలుగదు. మునులకు యోగ్యమైన నీవారాది ధాన్యములు, కందమూల ఫలాదులు మొదలైన వాటితో శ్రాద్ధకర్మలు నిర్వహించాలే తప్ప పశుహింస కూడదు’’ అని సూచించాడు.


  • దేవర్షి పితృ భూతేభ్య ఆత్మనే స్వజనాయచశ్రీ
  • అన్నం సంవిభజన్‌ పశ్యే త్సర్వం తత్పురుషాత్మకమ్‌శ్రీశ్రీ

‘‘దేవతలకు, ఋషిగణానికి, పితృదేవతలకు, ఇతర ప్రాణికైనా.. తనకైనా.. ఇటువంటి మునిజనులకు పెట్టే అన్నాన్ని విభాగములు చేసి పెడుతూనే సర్వమూ ఈశ్వర స్వరూపంగా భావించాలి’’ అనేది దీని అర్థం. సృష్టిలో జన్మించిన ప్రతిప్రాణికి జీవించే హక్కు ఉంది. ఏ ప్రాణినీ హింసించే, వధించే హక్కు మరో ప్రాణికి ఉండదు. ముఖ్యంగా మనిషి అనేక విధాలైన కారణాలతో జంతు బలి ఇవ్వడం అమానుషం. అతికిరాతకం. ఆ జ్ఞానాన్ని అందించడమే భాగవతం పరమార్థం. సర్వం దైవమయమన్న శ్రేయోభావనే ముఖ్యం. అదే ఆచరణ యోగ్యం.

- గన్నమరాజు గిరిజామనోమర బాబు

Updated Date - 2020-08-31T07:03:34+05:30 IST