రేపటి నుంచి ఆనందయ్య మందు

ABN , First Publish Date - 2021-06-06T08:18:03+05:30 IST

కరోనా మందు పంపిణీని ఈ నెల 7(సోమవారం) నుంచి చేపట్టనున్నట్లు ఆనందయ్య ప్రకటించారు. అన్ని జిల్లాల కలెక్టర్లకు మందుల కిట్లు పంపిణీ చేస్తామన్నారు

రేపటి నుంచి ఆనందయ్య మందు

ముందుగా సర్వేపల్లి ప్రజలకు అందిస్తాం 

ఆ తర్వాత మిగిలిన ప్రాంతాలపై దృష్టి 

మందు కోసం ఎవరూ కృష్ణపట్నం రావద్దు 

అన్ని జిల్లాల కలెక్టర్లకు కిట్లు: ఆనందయ్య 

ఇప్పట్లో ఆన్‌లైన్‌లో విక్రయాలకు వెళ్లట్లేదు 

సామాజిక మాధ్యమాల్లో ప్రచారాలు నమ్మొద్దు 

ఆనందయ్య కుమారుడు శశిధర్‌ స్పష్టీకరణ


నెల్లూరు, జూన్‌ 5(ఆంధ్రజ్యోతి): కరోనా మందు పంపిణీని ఈ నెల 7(సోమవారం) నుంచి చేపట్టనున్నట్లు ఆనందయ్య ప్రకటించారు. అన్ని జిల్లాల కలెక్టర్లకు మందుల కిట్లు పంపిణీ చేస్తామన్నారు. సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌రెడ్డి వెబ్‌సైట్ల ద్వారా కరోనా మందులు అమ్ముకొంటున్నారంటూ మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి చేసిన విమర్శలను, ఆనందయ్య మందు పంపిణీ చేయడం లేదంటూ సామాజిక మాధ్యమాల్లో కొందరు చేస్తున్న ప్రచారాలను ఆయన ఖండించారు. ఈ మేరకు శనివారం సాయంత్రం ఆనందయ్య ఒక వీడియో విడుదల చేశారు. తాను మందు పంపిణీ చేయడం లేదని కొంతమంది చేస్తున్న ప్రచారం అవాస్తవమని, దానిని ఎవరూ నమ్మవద్దని కోరారు. మందుల తయారీ జరుగుతోందని, సోమవారం నుంచి కచ్చితంగా పంపిణీ చేస్తామన్నారు. తొలుత తన సొంత నియోజకవర్గం సర్వేపల్లి పరిధిలోని ప్రతి ఇంటికి మందు పంపిణీ చేసిన తర్వాత ఇతర ప్రాంతాలపై దృష్టి పెట్టాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.


అన్ని జిల్లాల కలెక్టర్లకు కరోనా మందు కిట్ల పంపిణీని కూడా 7నుంచే మొదలు పెడతానన్నారు. మందు కోసం ఎవరూ నేరుగా కృష్ణపట్నం రావద్దని ఆయన విజ్జప్తి చేశారు. మందును అధికార యంత్రాంగం ద్వారా అన్ని జిల్లాలకు పంపుతామని, అధికారుల నేతృత్వంలో పంపిణీ జరుగుతుందని స్పష్టం చేశారు. మందు తయారీ, పంపిణీకి ప్రభుత్వం అనుమతి ఇచ్చిన క్రమంలో సాధ్యమైనంత ఎక్కువమంది ప్రజలకు సేవ చేసే అవకాశం దొరికిందన్నారు. 

Updated Date - 2021-06-06T08:18:03+05:30 IST