చంద్రబాబుకు అమిత్‌ షా ఫోన్‌

ABN , First Publish Date - 2021-10-28T08:08:33+05:30 IST

చంద్రబాబుకు అమిత్‌ షా ఫోన్‌

చంద్రబాబుకు అమిత్‌ షా ఫోన్‌

కొద్ది రోజుల్లో టైం ఇస్తానని హామీ


అమరావతి, అక్టోబరు 27(ఆంధ్రజ్యోతి): కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా టీడీపీ అధినేత చంద్రబాబుకు ఫోన్‌ చేశారు. బుధవారం ఉదయం ఆయన ఫోన్‌ చేసి చంద్రబాబుతో మాట్లాడినట్లు టీడీపీ వర్గాలు తెలిపాయి. చంద్రబాబు నాయకత్వంలో ఢిల్లీ వెళ్లిన టీడీపీ ప్రతినిధి బృందం అమిత్‌ షాను కలవాలని ప్రయత్నించిన విషయం తెలిసిందే. ఆయన లభ్యం కాకపోవడంతో మంగళవారం సాయంత్రం టీడీపీ నేతలు తిరిగి వచ్చారు. తిరిగి వచ్చే ముందు హోం కార్యదర్శితో చంద్రబాబు మాట్లాడారు. హోం మంత్రిని కలవాలనుకున్నామని, ఆయన ఎప్పుడు సమయం ఇస్తే అప్పుడు మళ్లీ వచ్చి కలుస్తామని చెప్పారు. దీనికి ప్రతిస్పందనగా అమిత్‌ షా ఫోన్‌ చేసి మాట్లాడినట్లు సమాచారం. ‘‘కశ్మీర్‌ నుంచి మంగళవారం మధ్యాహ్నమే ఢిల్లీకి వచ్చాను. ఆ వెంటనే మంత్రివర్గ సమావేశం ఉండటంతో కలవడం సాధ్యం కాలేదు. కొద్ది రోజుల్లో సమయం ఇస్తాను. మీరు రండి’’ అని ఆయన చంద్రబాబుతో చెప్పారు. కొన్ని ముఖ్యమైన అంశాలు ఉన్నాయని, స్వయంగా కలసి చెప్పాలని అనుకొంటున్నామని, ఎప్పుడు సమయం ఇస్తే అప్పుడు వచ్చి కలుస్తామని చంద్రబాబు అన్నారు. ఈ వారంలో మరోసారి ఢిల్లీ వెళ్లి షాను కలిసే అవకాశం ఉందని టీడీపీ వర్గాలు భావిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ వారంలో జరగాల్సి ఉన్న చంద్రబాబు కుప్పం పర్యటన వాయిదా పడింది. 

Updated Date - 2021-10-28T08:08:33+05:30 IST