ధర్మాధికారి ఆదేశాలపై మళ్లీ ప్రతిష్టంభన
ABN , First Publish Date - 2020-04-03T08:55:16+05:30 IST
ధర్మాధికారి ఆదేశాలపై మళ్లీ ప్రతిష్టంభన
ఉద్యోగులను తీసుకోవడానికి తెలంగాణ నిరాకరణ
అత్యవసర ఆదేశాలు కోరుతున్న ఏపీ సంస్థలు
అమరావతి, ఏప్రిల్ 2(ఆంధ్రజ్యోతి): విద్యుత్ ఉద్యోగుల విభజన అంశంలో జస్టిస్ ధర్మాధికారి కమిషన్ ఇచ్చిన ఆదేశాలపై ప్రతిష్టంభన కొనసాగుతోంది. తాజా సమాచారం ప్రకారం ఈ ఆదేశాలు అమలు చేయడానికి తెలంగాణ విద్యుత్ సంస్థలు నిరాకరించాయి. ఈ కమిషన్ ఆదేశాల ప్రకారం 655 మంది ఉద్యోగులను ఆ సంస్థలు తీసుకోవాల్సి ఉంది. కానీ వారిని తీసుకోవడానికి అవి నిరాకరించాయి. లాక్డౌన్ కారణంగా ఈ అంశంపై కమిషన్ తమకు రెండు నెలల సమయం ఇచ్చిందని ఆ సంస్థలు చెబుతున్నట్లు సమాచారం. దీనితో అత్యవసర ఆదేశాలు ఇవ్వాలని ఏపీ విద్యుత్ సంస్థలు ధర్మాధికారి కమిషన్కు లేఖ రాశాయి. ఈ కమిషన్ మార్చి 11వ తేదీన ఇచ్చిన ఆదేశాల ప్రకారం 655 మంది ఉద్యోగుల చొప్పున రెండు రాష్ట్రాల విద్యుత్ సంస్థలు తీసుకోవాల్సి ఉంటుంది. కానీ ఇందులో 584 మంది ఉద్యోగులను తీసుకోవడానికి తెలంగాణ విద్యుత్ సంస్థలు నిరాకరించాయి. దీనితో ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని ఏపీ ట్రాన్స్కో గురువారం ధర్మాధికారి కమిషన్కు లేఖ పంపారు.