హైకోర్టులో రాజధాని అంశం.. నవంబర్ 2కి విచారణ వాయిదా
ABN , First Publish Date - 2020-10-12T18:55:49+05:30 IST
రాజధానిపై ఏపీ హైకోర్టులో విచారణ ముగిసింది. తదుపరి విచారణను నవంబర్ 2న ధర్మాసనం వాయిదా వేసింది. అనుబంధ పిటిషన్స్పై దాఖలు చేసిన
అమరావతి: రాజధానిపై ఏపీ హైకోర్టులో విచారణ ముగిసింది. తదుపరి విచారణను నవంబర్ 2న ధర్మాసనం వాయిదా వేసింది. అనుబంధ పిటిషన్స్పై దాఖలు చేసిన అంతర్గత పిటిషన్పై విచారణ పూర్తి అయ్యింది. అనుబంధ పిటిషన్స్ పై తీర్పును రిజర్వ్ చేసింది. వాదనలు వినిపించిన న్యాయవాది గుప్తా.. వైజాగ్లో నిర్మించే గెస్ట్ హౌస్ను రాజధానిలో భాగంగా కడుతున్నారా..? అని ప్రశ్నించారు. విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, కాకినాడలో గెస్ట్ హౌస్లకు సంబంధించిన పూర్తి వివరాలు అఫిడవిట్లో పొందుపర్చలేదని ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. విశాఖపట్నంలో ఎంత విస్తీర్ణంలో, ఎన్ని గదులు నిర్మిస్తారన్నది స్పష్టం చేయలేదన్నారు. ప్రభుత్వ నిర్మాణాలకు తమకెటువంటి అభ్యంతరం లేదుగాని, ప్రభుత్వం నిర్మించబోయే గెస్ట్ హౌస్లు చాలా విశాలమైన ప్రాంతంలో నిర్మాణాలు చేపడుతున్నారన్నారు. దానివల్లే అనుమానాలు రేకెత్తుతున్నాయని చెప్పుకొచ్చారు. తాత్కాలికంగా సీఎం క్యాంప్ ఆఫీస్ ఎక్కడైనా ఏర్పాటు చేసుకోవటానికి తమకు ఎటువంటి అభ్యంతరం లేదని తెలిపారు. రాజధానిలో భాగంగా వైజాగ్లో గెస్ట్ హౌస్ నిర్మాణం చేపట్టడం లేదని కోర్టుకు ప్రభుత్వం తరపున అడ్వొకేట్ జనరల్ తెలిపారు. కాకినాడ, తిరుపతి, విశాఖపట్నంలో అద్దెలు ఎక్కువగా చెల్లించాల్సి వస్తుందన్న కారణంతోనే గెస్ట్ హౌస్ నిర్మాణాలను చేపట్టామని అన్నారు. జనాభా దామాషా ప్రాతిపదికన గెస్ట్ హౌస్ నిర్మాణాలు చేపడుతున్నామని అన్నారు. అవసరం అయితే శని, ఆదివారంలో కూడా వాదనలు వింటామని ధర్మాసనం తెలిపింది.