దుబాయి కొత్త ఇండియన్ కాన్సుల్ జనరల్గా అమన్ పూరి
ABN , First Publish Date - 2020-07-01T15:40:19+05:30 IST
దుబాయిలోని ఇండియన్ కాన్సులేట్లో కొత్త కాన్సుల్ జనరల్గా అమన్ పూరి నియమితులయ్యారు.
దుబాయి: దుబాయిలోని ఇండియన్ కాన్సులేట్లో కొత్త కాన్సుల్ జనరల్గా అమన్ పూరి నియమితులయ్యారు. విపుల్ స్థానంలో అమన్ పూరి బాధ్యతలు స్వీకరించనున్నారు. కాగా, అమన్ పూరి ప్రస్తుతం బ్రిటన్లోని బర్మింగ్హాంలోని ఇండియన్ కాన్సులేట్ ఇంచార్జిగా విధులు నిర్వహిస్తున్నారు. ఇక ప్రస్తుతం దుబాయిలో ఇండియన్ కాన్సులర్గా విధులు నిర్వహిస్తున్న విపుల్ 2017లో ఈ బాధ్యతలు చేపట్టారు. ఆయన పదవి కాలం ముగియడంతో తన తదుపరి పోస్టింగ్ కోసం ఈ నెల 7న 'వందే భారత్ మిషన్'లో భాగంగా స్వదేశానికి వచ్చే విమానంలో ఢిల్లీకి రానున్నారు. జూలై మధ్యలో ఇండియన్ కాన్సులర్గా పూరి బాధ్యతలు స్వీకరిస్తారని విపుల్ తెలిపారు.
ఇక వృత్తిరీత్యా దంతవైద్యుడైన డాక్టర్ అమన్ పూరీ ఇండియన్ ఫారిన్ సర్వీసులపై ఆసక్తితో 2003లో భారత విదేశాంగ సేవలో సభ్యుడిగా చేరారు. అనంతరం 2005-08లో బ్రస్సెల్స్ కేంద్రంగా ఉన్న యూరోపియన్ యూనియన్, బెల్జియం మరియు లక్సెంబర్గ్లకు భారత మిషన్లో పనిచేశారు. అలాగే 2009-10 మధ్య ఒక ఏడాది పాటు చండీగఢ్లోని పాస్పోర్ట్ కార్యాలయంలో విధులు నిర్వహించారు. ఆ తర్వాత 2010-13 వరకు డిప్యూటీ చీఫ్ ఆఫ్ ప్రోటోకాల్ పదవిలో కొనసాగారు. ఈ పదవిలో ఆయన భారత ప్రధానికి సంబంధించిన విదేశీ సందర్శనలు, రాష్ట్రాల అధిపతులు, ఉపాధ్యాక్షులు మరియు విదేశాంగ మంత్రులు, ప్రభుత్వ పెద్దల స్థాయిలో వచ్చే సందర్శనలను నిర్వహించడం వంటి విధులు నిర్వహించారు. అనంతరం 2013-16 మధ్య కాలంలో ఢిల్లీ పాస్పోర్ట్ కార్యాలయం అధికారిగా కూడా ఉన్నారు. ప్రస్తుతం అమన్ పూరి బర్మింగ్హాంలోని ఇండియన్ కాన్సులేట్ ఇంచార్జిగా విధులు నిర్వహిస్తున్నారు.