జగిత్యాలలో ‘అలిశెట్టి’ జయంతి, వర్ధంతి
ABN , First Publish Date - 2022-01-13T00:43:37+05:30 IST
తెలంగాణ అక్షర సూర్యుడిగా గుర్తింపు పొందిన కవి అలిశెట్టి ప్రభాకర్ జయంతి, వర్ధంతిని జగిత్యాలలో పలువురు ప్రజాప్రతినిధులు
జగిత్యాల: తెలంగాణ అక్షర సూర్యుడిగా గుర్తింపు పొందిన కవి అలిశెట్టి ప్రభాకర్ జయంతి, వర్ధంతిని జగిత్యాలలో పలువురు ప్రజాప్రతినిధులు, సాహితీవేత్తలు బుధవారం నిర్వహించారు. జిల్లా కేంద్రంలోని అంగడిబజార్లో ఉన్న అలిశెట్టి విగ్రహం వద్ద అలిశెట్టి ప్రభాకర్ సతీమణి భాగ్యం, కుమారుడు సగ్రాంతో కలిసి మున్సిపల్ చైర్ పర్సన్ బోగ శ్రావణి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అదేవిధంగా భారత్ సురక్షా సమితి ఆధ్వర్యంలో జగిత్యాలలోని తహసీల్ చౌరస్తాలో అలిశెట్టి ప్రభాకర్ జయంతి, వర్ధంతి నిర్వహించారు. ఈ సందర్బంగా మున్సిపల్ చైర్పర్సన్ శ్రావణి మాట్లాడుతూ ప్రభాకర్ సాహిత్యం సమాజహితాన్ని కోరిందని అన్నారు. సమాజ రుగ్మతలు రూపుమాపడానికి అతని అక్షరాలు దోహదం చేశాయని పేర్కొన్నారు. జననం, మరణం ఒకే రోజు కావడం ఇది మహానుభావులకే చెందుతుందని శ్రావణి తెలిపారు.