పోలీస్ కస్టడీకి అఖిలప్రియ వ్యక్తిగత సహాయకులు
ABN , First Publish Date - 2021-01-20T00:41:43+05:30 IST
బోయిన్పల్లి కిడ్నాప్ కేసులో ఇద్దరు నిందితులను పోలీస్ కస్టడీకి సికింద్రాబాద్ కోర్టు అనుమతి ఇచ్చింది. ఈ కేసులో ప్రధాన నిందితురాలైన
హైదరాబాద్: బోయిన్పల్లి కిడ్నాప్ కేసులో ఇద్దరు నిందితులను పోలీస్ కస్టడీకి సికింద్రాబాద్ కోర్టు అనుమతి ఇచ్చింది. ఈ కేసులో ప్రధాన నిందితురాలైన అఖిలప్రియ వ్యక్తిగత సహాయకులైన మల్లికార్జున్ రెడ్డి, సంపత్లను న్యాయస్థానం కస్టడీకి అనుమతిచ్చింది. ఇద్దరు నిందితులను మూడు రోజుల పాటు పోలీసులు కస్టడీలోకి తీసుకుని విచారించనున్నారు. ప్రస్తుతం చంచల్గూడ జైల్లో ఉన్న నిందితులను రేపటి నుంచి ఈనెల 22 వరకు పోలీసులు కస్టడీలోకి తీసుకుని విచారించనున్నారు. రేపు ఉదయం చంచల్గూడ జైల్లో నుంచి బోయిన్పల్లి పోలీసులు కస్టడీలోకి తీసుకోనున్నారు. ఇదిలా ఉంటే ఈ కేసులో తొలుత అఖిలప్రియను కస్టడీలోకి తీసుకున్నారు. ఆమె నుంచి ఎలాంటి సమాచారం రాబట్టలేనట్లు తెలుస్తోంది. దీంతో ఆమె వ్యక్తిగత సహాయకుల నుంచి సమాచారం రాబట్టాలని పోలీసులు భావిస్తున్నట్లు తెలుస్తోంది.
మరోవైపు ఈ కేసులో మరో నిందితుడు, అఖిలప్రియ సోదరుడు జగత్ విఖ్యాత్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. సికింద్రాబాద్ కోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. అలాగే మరోసారి సెషన్స్ కోర్టులో అఖిల ప్రియ కూడా బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. అఖిల ప్రియ బెయిల్ పిటిషన్, జగత్ విఖ్యాత్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్పై రేపు విచారణ జరగనుంది.