విమానయాన రంగంలోకి మరో సంస్థ.. సేవలకు సిద్ధమవుతున్న Akasa
ABN , First Publish Date - 2022-07-08T01:43:01+05:30 IST
భారత విమానయాన రంగంలోకి మరో ఎయిర్లైన్స్ వచ్చేస్తోంది. భారతకు చెందిన బిలియనీర్ వ్యాపారవేత్త రాకేశ్ ఝున్ఝున్వాలా
న్యూఢిల్లీ: భారత విమానయాన రంగంలోకి మరో ఎయిర్లైన్స్ వచ్చేస్తోంది. భారతకు చెందిన బిలియనీర్ వ్యాపారవేత్త రాకేశ్ ఝున్ఝున్వాలా సారథ్యంలోని ఆకాశ ఎయిర్ (Akasa Air) సేవలకు సిద్ధమవుతోంది. కమర్షియల్ విమానాలు నడిపేందుకు అవసరమైన ఎయిర్ ఆపరేటర్ సర్టిఫికెట్ (AOC)ను డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA), పౌర విమానయాన సంస్థ నుంచి ఆకాశ అందుకుంది.
ఫలితంగా సర్వీసులు ప్రారంభించేందుకు పూర్తిస్థాయి అనుమనులు లభించినట్టు అయింది. ఈ మేరకు ఆకాశ ఎయిర్ ట్వీట్ చేసింది. ఏవోసీ సర్టిఫికెట్ అందుకున్నందుకు సంతోషంగా ఉందని, ఇదో గొప్ప మైలురాయి అని పేర్కొంది. త్వరలోనే ఆపరేషన్స్ ప్రారంభిస్తామని తెలిపింది. కమర్షియల్ విమాన సర్వీసులు ప్రారంభించేందుకు ఏవోసీ అనేది చివరి మెట్టు.
రెండు విమానాలతో సర్వీసులు ప్రారంభిస్తామని, తర్వాత ప్రతి నెలా కొన్నింటిని పెంచుకుంటూ పోతామని ఆకాశ ఎయిర్ తెలిపింది. 2022-23 ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి 18 విమానాలను అందుబాటులోకి తీసుకొస్తామని తెలిపింది. ఆ తర్వాత ప్రతి 12 నెలలకు 12 నుంచి 14 విమానాలను జోడిస్తామని పేర్కొంది. దీంతో వచ్చే ఐదేళ్లలో మొత్తం విమానాల సంఖ్య 72కు పెరుగుతుందని వివరించింది. ఆకాశ ఎయిర్ ఎయిర్లైన్ కోడ్ క్యూపీ (QP), ఈ ఏడాది జూన్ 21న తొలి విమానం 737 మ్యాక్స్ (737 MAX) సీటెల్ నుంచి ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకుంది.