కోవిడ్ తర్వాత... 27% పెరిగిన డి స్మార్ట్ఫోన్ ధరలు
ABN , First Publish Date - 2022-05-25T21:35:50+05:30 IST
రెండేళ్ళ క్రితం... అంటే 2020 లో COVID ప్రారంభమైనప్పటి నుండి స్మార్ట్ఫోన్ ధరలు 27 % పెరిగాయి.
బెంగళూరు : రెండేళ్ళ క్రితం... అంటే 2020 లో COVID ప్రారంభమైనప్పటి నుండి స్మార్ట్ఫోన్ ధరలు 27 % పెరిగాయి. చిప్సెట్లు, కాంపోనెంట్ల కొరత, సరఫరా అంతరాయాలు తదితర పరిణామాల నేపథ్యంలో... కంపెనీలు అన్ని విభాగాల్లో స్మార్ట్ఫోన్ల ధరలను పెంచవలసి వచ్చింది. ఈ ఏడాది(2022) మార్చి త్రైమాసికంలో భారతదేశంలో స్మార్ట్ఫోన్ల సగటు అమ్మకపు ధర రూ. 19 వేలు. రెండేళ్ల క్రితం ఇదే సమయంలో కోవిడ్ కేసులు పెరగడం ప్రారంభమై, లాక్డౌన్ చోటుచేసుకున్న నేపథ్యంలో... ఈ ధర రూ. 15 వేల నుండి భారీగానే పెరిగింది.
ఇంటర్నేషనల్ డేటా కార్పొరేషన్(IDC) డేటా ప్రకారం... భారతదేశంలో స్మార్ట్ఫోన్ల సగటు విక్రయ ధర ఒక సంవత్సరం పాటు క్రమంగా పెరిగిందని, ప్రస్తుతం గరిష్ట స్థాయికి చేరుకుంది. IDC ఇండియా రీసెర్చ్ డైరెక్టర్ నవకేందర్ సింగ్ మాట్లాడుతూ ‘గత రెండేళ్లలో ఈ రంగానికి వ్యతిరేకంగా పలు అంశాలు పనిచేశాయి. ప్రారంభంలో... 2020 జనవరిలో చైనాలో మహమ్మారి ఉద్భవించిన వెంటనే... లాక్డౌన్లు, ఫ్యాక్టరీలను మూసివేయడం వలన సరఫరా కొరత చోటుచేసుకుంది. ఇదే క్రమంలో... విడిభాగాల ధరలు పెరిగాయి.
ఆ తర్వాత... సెమీకండక్టర్ల తీవ్రమైన కొరత చిప్సెట్ల ధరలను చాలా రెట్లు పెంచింది. మొత్తం తయారీ ఖర్చు కనీసం 20 శాతం పెరిగింది. ఈ నేపథ్యంలో ధరలు పెరిగాయి’ అని పేర్కొన్నారు. వాస్తవానికి, Xiaomi, Samsung, Realme, Oppo వంటి ప్రముఖ బ్రాండ్లు తమ మోడళ్ళను తక్కువ ధరల వద్ద లాంచ్ చేసిన వెంటనే వాటి ధరలను పెంచాయి. డేటా ప్రకారం, రూ. 18 వేల కంటే తక్కువ ధరల విభాగంలో రవాణా గతేడాది ఇదే త్రైమాసికంతో పోలిస్తే జనవరి-మార్చిలో ధరలు 16 శాతం తగ్గాయి. కాగా... రూ. 18 వేలు-రేూ. 27 వేల మధ్య శ్రేణి సెగ్మెంట్ మొత్తం స్మార్ట్ఫోన్ మార్కెట్లో తన వాటాను గత ఏడాదిలో 14 శాతం నుంచి 18 శాతానికి పెంచుకుంది. మిడ్-ప్రీమియం సెగ్మెంట్(రూ. 27 వేలు-రూ. 45 వేలు) ఏడాది ప్రాతిపదికన అత్యధికంగా 75 శాతం పెరిగింది.
కాగా... ప్రీమియం సెగ్మెంట్ (రూ. 45 వేల కంటే ఎక్కువ) స్మార్ట్ఫోన్ మార్కెట్లో ఐదు శాతం వాటాను కలిగి ఉంది, ఇక... 60 శాతం షిప్మెంట్లు ఆపిల్(ఐఫోన్) నుండి వస్తున్నాయి. కొనుగోలు చేయగలిగిన కొంతమంది వినియోగదారులు మెరుగైన ఫీచర్లను వెతుక్కుంటూ అప్గ్రేడ్ చేస్తున్నారు.ఇక... ఈ విపరీతమైన ధరల పెంపునకు సంబంధించిన పరిణామాలలో ఒకటి... గత రెండేళ్లలో స్మార్ట్ఫోన్ల సగటు కొనుగోలు చక్రం గణనీయంగా పెరగడం.