తెలంగాణ కోసమే తెరాసలో చేరికలు

ABN , First Publish Date - 2021-08-05T08:02:39+05:30 IST

తెలంగాణ రాష్ట్ర సమితిలో వారూ- వీరూ అనే తేడా లేకుండా, ఆ పార్టీ–ఈ పార్టీ అనే భేదం లేకుండా, అనునిత్యం, వివిధస్థాయిలకు చెందిన ప్రజాప్రతినిధులతో సహా...

తెలంగాణ కోసమే తెరాసలో చేరికలు

తెలంగాణ రాష్ట్ర సమితిలో వారూ- వీరూ అనే తేడా లేకుండా, ఆ పార్టీ–ఈ పార్టీ అనే భేదం లేకుండా, అనునిత్యం, వివిధస్థాయిలకు చెందిన ప్రజాప్రతినిధులతో సహా వేలాది మంది రాజకీయ కార్యకర్తలు, వందలమంది ఇతర పార్టీల నాయకులు చేరడం రాజకీయ పునరేకీకరణ ఆవశ్యకత మాత్రమే. ఒక మహోన్నత ఉద్యమ నేపథ్యంలో, ఒక కొత్త రాష్ట్రం ఏర్పడిన నేపథ్యంలో, ఆ రాష్ట్రం బంగారు రాష్ట్రంగా అవతరించాల్సిన ఆవశ్యకత నేపథ్యంలో, ఒక పార్టీ టికెట్ మీద గెలిచి, మరో పార్టీలో చేరడం సమంజసమే. అదేవిధంగా ఒక పార్టీలో చాలా కాలమో, కొంతకాలమో ఉండి అనేకానేక కారణాల వల్ల పార్టీ మారి టీఆర్‌ఎస్‌లో చేరడం కూడా సహజమే, సహేతుకమే. ఇది అనైతికమనే వారికి రాజకీయ పునరేకీకరణ ఆవశ్యకత అంతగా అర్థం కాదు. పార్టీ మారుతున్నవారి దృష్టిలో తాము మరో పార్టీలో చేరుతున్నామనే భావన కన్నా మిన్నగా, ఆ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు రాష్ట్ర ముఖ్యమంత్రిగా, రాష్ట్రాభివృద్ధికి అమలు చేస్తున్న అభివృద్ధి–-సంక్షేమ కార్యక్రమాల పట్ల ఆకర్షితులవడమే ఉంటుంది. గతంలో వారు ప్రాతినిధ్యం వహించిన పార్టీలు ప్రజల అవసరాలకు అనుగుణంగా ప్రతిపక్ష పాత్ర పోషించలేని దుర్గతిలో ఉండడమే వారంతా ఆయా పార్టీలను వదిలి తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరడానికి కారణమనేది నిర్వివాదాంశం.


తెలంగాణను అడ్డుకోవడానికి అడుగడుగునా కుట్రలు జరిగినట్లే, సాధించుకున్న తెలంగాణను అస్థిరపరచడానికి కూడా వరుస కుట్రలు జరిగాయని, వాటన్నింటినీ ఎదుర్కోవడానికి రాజకీయ పునరేకీకరణ అవసరమవుతుందని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు పదే-పదే చెప్తుంటారు. చెన్నారెడ్డి ఆధ్వర్యంలో 1969లో జరిగిన మహోన్నత ఉద్యమం నుంచి 2014 వరకు తెలంగాణ ఏర్పాటుకు వ్యతిరేకంగా కుట్రలు జరిగాయి. ఆ తరువాత కూడా ఇంకా జరుగుతూనే ఉన్నాయి. ఈ ఉద్యమాల నేపథ్యంలో లోతుగా ఆలోచిస్తే, రాజకీయ అవసరాల కోసం ఆషామాషీగా చేరికలు జరగడం లేదని, తెలంగాణ గెలిచి నిలిచేందుకు అనుసరిస్తున్న వ్యూహంలో భాగంగానే పునరేకీకరణ జరుగుతున్నదని స్పష్టంగా అర్థమవుతుంది.


తెలంగాణ ఉద్యమాన్ని ఎలా ముందుకు తీసుకుపోవాలనే విషయంపై ప్రతి ఒక్కరితో చర్చలు జరిపారు కేసీఆర్. కేవలం జై తెలంగాణ నినాదాలతోనే తెలంగాణ రాదని, చాలా వ్యూహాత్మకంగా, దౌత్యనీతితో ముందుకుపోవాలని వారందరికీ స్పష్టం చేశారు. తెలంగాణ ఉద్యమం ఆంధ్ర ప్రజలకు వ్యతిరేకం కాదని కూడా ఆనాడే స్పష్టం చేశారు. తాను నడిపే ఉద్యమంలో ‘ఆంధ్ర గో బ్యాక్’ నినాదాలు ఉండవన్నారు. ‘మన నీళ్లు, మన నిధులు, మన ఉద్యోగాలు మనకు దక్కడం కోసం తెలంగాణ కావాలి కానీ, ఎవరికో వ్యతిరేకంగా కాదని’ చెప్పారు. అలా తన అభిప్రాయాలను, వ్యూహాలను ఒక్కొక్కరికీ విడమరిచి చెప్పారు. తెలంగాణ సాధన అనేది నిబద్ధత మీద, ఉద్యమం నడిపే తీరుపైన ఆధారపడి ఉంటుందని కూడా వివరించారు. తెలంగాణ సమాజాన్నంతా ఒకవైపుకు తిప్పగలిగితే తెలంగాణ వస్తుందని అన్నారు. చివరకు తెలంగాణ ఉద్యమంపై కెసిఆర్‌కు ఉన్న వ్యూహాన్ని వారందరూ అర్థం చేసుకున్నారు. అప్పటి నుంచి ఆయన వెంటే నడిచారు.


తెలంగాణ ఉద్యమం ఓ రాజకీయ పార్టీగా ముందుకుపోతుండడంతో ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు సహా ఆంధ్రశక్తులు ఉద్యమాన్ని నీరుకార్చేందుకు అనేక ప్రయత్నాలు చేశాయి. కుట్రలు చేశాయి. ఈ కుట్రదారులు ప్రధానంగా నాలుగు పద్ధతులు అవలంభించారు. మొదటిది: విభజించి పాలించు పద్ధతిన తెలంగాణ సమాజాన్ని విడదీయడానికీ, ఐక్యత లేకుండా చేయడానికీ ప్రయత్నించడం; రెండవది: తెలంగాణ ఉద్యమ నాయకత్వ వ్యక్తిత్వ హననం, ప్రజల్లో ఉద్యమ నాయకత్వం పట్ల విశ్వసనీయత లేకుండా చేయడం; మూడవది: మీడియా ద్వారా అబద్ధాలు ప్రచారం చేయడం; చివరగా: ప్రభుత్వ అండతో ఉద్యమాన్ని అణచివేసే చర్యలు చేపట్టడం. ఈ నాలుగు పద్ధతుల ద్వారా తెలంగాణ ఉద్యమాన్ని నీరు గార్చి, స్వరాష్ట్ర ఆకాంక్షను రూపుమాపాలని నిరంతర ప్రయత్నం జరిగినా వెనుకడుగు వేయవద్దని కేసీఆర్ గట్టిగా నిర్ణయించుకున్నారు. ఎన్ని ఇబ్బందులు కలిగినా, నిర్బంధం ఎదురైనా ఉద్యమాన్ని కొనసాగించారు.


2004 ఎన్నికల తర్వాత కేసీఆర్ కేంద్రమంత్రి అయ్యాక ఢిల్లీలో అన్ని రాజకీయ పార్టీల చుట్టూ తిరిగారు. తెలంగాణ ఏర్పడడానికి అనుకూలంగా 36 రాజకీయ పార్టీలను ఒప్పించారు. తెలంగాణ పడుతున్న గోస గురించి, ప్రత్యేక రాష్ట్రం కావాల్సిన అవసరం గురించి సీడీ తయారు చేయించి, ఢిల్లీలో నాయకులందరికీ చూపించారు. అందరికీ తెలంగాణ గోస అర్థమయింది కానీ, తెలంగాణ వస్తుందనే నమ్మకం చాలా మందికి లేకపోయింది. ఎంత చేసినా సరే తెలంగాణ రాదు అనే అపనమ్మకం ఏర్పడడానికి గత అనుభవం కూడా ఓ కారణమే.


1969లో ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమానికి సారథ్యం వహించిన స్వర్గీయ డాక్టర్ మర్రి చెన్నారెడ్డి గొప్ప తెలంగాణ బిడ్ద. ఆయన ఉద్యమాన్ని ఆకాశం ఎత్తుకు లేపారు. ఆనాటి ఆయన ఉద్యమమే మలివిడతగా చేపట్టిన కేసీఆర్ సారథ్యంలోని ఉద్యమానికి స్ఫూర్తినిచ్చిందనాలి. 1970-–1971లో బంగ్లాదేశ్ విమోచన తర్వాత జరిగిన ఎన్నికల్లో దేశమంతా ఇందిరాగాంధీ పార్టీ గెలిచినా తెలంగాణలో మాత్రం చెన్నారెడ్డి నాయకత్వంలోని ప్రజాసమితి, ఆమెకు వ్యతిరేకంగా పోటీ చేసి 11 లోక్‌సభ స్థానాలను గెలుచుకుంది. వీళ్లందరినీ తీసుకుని చెన్నారెడ్డి ఇందిరాగాంధీ దగ్గరకు వెళ్లారు. ఆమె ప్రజల కోరిక మన్నించి, తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలని కోరారు.


ఇందిరాగాంధీ కొందరి సలహా తీసుకున్నారు. ఒక్క కొత్త రాష్ట్రం ఏర్పాటు చేస్తే ఇలాంటి డిమాండ్లు ఎన్నో వస్తాయని, తెలంగాణ ప్రజలు అడిగిందేదైనా ఇవ్వొచ్చు కానీ ప్రత్యేక రాష్ట్రం మాత్రం ఇవ్వొద్దని సలహా ఇచ్చారు వారు. ఎప్పుడైతే తెలంగాణ రాష్ట్రం రావడం లేదని తెలిసిపోయిందో అప్పుడే నాయకత్వాన్ని తిట్టడం మొదలైంది. కొందరు నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరడానికి ప్రయత్నం చేశారు. అందరం కలిసి చేరుదామని చెప్పిన చెన్నారెడ్డి, ఇందిర నుంచి కొన్ని సేఫ్‌గార్డ్స్‌కు అంగీకరించేలా చేసి, కాంగ్రెస్‌లో చేరారు. తెలంగాణ లోని కొందరు చెన్నారెడ్డిని ద్రోహిగా చిత్రీకరించడం వెనుక కూడా ఆంధ్రా వాళ్ల కుట్ర ఉంది. ఆంధ్ర పత్రికల పాత్ర కూడా ఉంది. 


తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తరువాత కూడా దీన్ని అస్థిరపరిచే కుట్ర జరిగింది. తెలంగాణ బతికి బట్ట కట్టదని ప్రచారం జరిగింది. రాష్ట్రపతి పాలన విధించే ప్రయత్నాలు కూడా జరిగాయి. 2014 ఎన్నికల తరువాత టీఆర్‌ఎస్‌తో స్నేహంగా ఉండే మజ్లిస్ పార్టీ ప్రభుత్వానికి పూర్తి మద్దతుగా ఉంటామని ప్రకటించిన దరిమిలా శాసనసభలో పార్టీ బలం 63 నుంచి 70కి చేరింది. అలా ప్రభుత్వానికి అండగా ఉండాలని భావించి చాలా మంది టీఆర్‌ఎస్‌తో కలిసారు. శాసన సభలో సంఖ్య 90కు చేరుకుంది. రాజకీయ స్థిరత్వం పూర్తిగా వచ్చింది. 2018 ఎన్నికల తరువాత కూడా ఇదే జరిగింది. ఇతర పార్టీల నుంచి వచ్చిన వారి చేరికతో పార్టీ–ప్రభుత్వం మరింత బలపడుతున్నది. తెలంగాణ అన్ని రకాల బాగుపడాలి. ఇతర పార్టీల నుంచి వచ్చిన వారిని చిల్లర రాజకీయాల కోసం టీఆర్‌ఎస్‌లో చేర్చుకోవడం లేదు. తెలంగాణ నిలిచి గెలవాలి. ఈ రోజు తెలంగాణ ఉన్న పరిస్థితుల్లో అభివృద్ధిని కాంక్షించే శక్తులన్నీ ఏకమై రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలి. అందుకోసమే పునరేకీకరణ అవసరమైంది. 


2018లో జరిగిన ఎన్నికల్లో ఆశించినట్లే తెలంగాణ రాష్ట్రసమితి అఖండ విజయాన్ని సాధించింది. 88 అసెంబ్లీ స్థానాలను గెలుచుకుంది. మజ్లిస్ పార్టీ తన ఏడు స్థానాలతో తెరాసకు మద్దతు ప్రకటించింది. ఎన్నికలైన వెంటనే ఇండిపెండెంట్లుగా గెలిచిన ఇద్దరు ఎమ్మెల్యేలు తెరాసలో చేరారు. తదనంతరం జరిగిన రాజకీయ పరిణామాల్లో మరో ముగ్గురు వేరే పార్టీవాళ్లు కూడా తెరాసలో చేరారు. అలా.. అలా... చేరికలు కొనసాగాయి. చేరినవారందరూ, చేరబోతున్నవారూ, తమ నియోజకవర్గాలు, రాష్ట్ర అభివృద్ధి కోసం తెరాసలో చేరుతున్నట్లు ప్రకటించారు. ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు అమలుపరుస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాల పట్ల ఆకర్షితులమైనామని ప్రకటించారు. వారు ఆ కారణాన పార్టీ మారితే తప్పేంటి? తెలంగాణలో మరింతగా రాజకీయ సుస్థిరత, ఆర్థిక సుస్థిరత సాధించడం కోసం ఆద్యతన భవిష్యత్‌లో మరికొందరు పార్టీ మారినా, తెరాసలో చేరినా ఆశ్చర్యం లేదేమో!

వనం జ్వాలా నరసింహారావు 

Updated Date - 2021-08-05T08:02:39+05:30 IST