చిన్న సారు.. పెద్ద సంపాదన

ABN , First Publish Date - 2021-04-17T09:07:22+05:30 IST

కట్టలు కట్టలుగా కరెన్సీ నోట్లు! కళ్లు జిగేల్‌ మనిపించే బంగారు నగలు! భారీగా వెండి సామగ్రి! ఇంకా... మూడు జిల్లాల పరిధిలో స్థిరాస్తులు! ఇదంతా ఏ బడా అధికారి సంపాదనో కాదు!

చిన్న సారు.. పెద్ద సంపాదన

పంచాయతీ కార్యదర్శిపై ఏసీబీ గురి

ఇంట్లో రూ.35 లక్షల నగదు లభ్యం

భారీగా నగలు, వెండి సామగ్రి కూడా

మూడు జిల్లాల్లో ప్లాట్లు, పొలాలు


రణస్థలం, ఏప్రిల్‌ 16: కట్టలు కట్టలుగా కరెన్సీ నోట్లు! కళ్లు జిగేల్‌ మనిపించే బంగారు నగలు! భారీగా వెండి సామగ్రి! ఇంకా...   మూడు జిల్లాల పరిధిలో స్థిరాస్తులు! ఇదంతా ఏ బడా అధికారి సంపాదనో కాదు! ఒక గ్రామ పంచాయతీ కార్యదర్శి ఇన్ని ఆస్తులు పోగేసుకున్నారు! ఇవన్నీ చూసి ఏసీబీ అధికారులే నోళ్లు వెళ్లబెట్టారు. అగురు వెంకటరావు శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలం పైడిభీమవరం గ్రామపంచాయతీ కార్యదర్శిగా పని చేస్తున్నారు.


రణస్థలం మండలం ఎక్స్‌టెన్షన్‌ ఆఫీసర్‌గా కూడా అదనపు విధులు నిర్వహిస్తున్నారు. పిల్లల చదువుల కోసం కుటుంబంతో కలిసి విశాఖలో నివసిస్తున్నారు. ఆయన అక్రమార్జన, ఆస్తులకు సంబంధించి ఫిర్యాదులు రావడంతో... శుక్రవారం ఏసీబీ అధికారులు ఏకకాలంలో మూడు చోట్ల సోదాలు నిర్వహించారు. పైడిభీమవరం సచివాలయంతోపాటు, వెంకటరావు స్వగ్రామమైన వంగర మండలం అరసాడ, విశాఖపట్నం ద్వారకానగర్‌లోని ఇంటిలో సోదాలు జరిపారు. ఆయన కార్యాలయంలో ఎలాంటి నగదు, ఆస్తుల పత్రాలు దొరకలేదు. స్వగ్రామంలో వెంకటరావు సోదరుడి నివాసంలో కొన్ని భూములకు సంబంధించిన పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. కానీ... అసలు విషయమంతా విశాఖపట్నంనివాసంలో బయటపడింది. అక్కడ వెంకటరావు అద్దెకు ఉంటున్న ఇంట్లో కళ్లు చెదిరే స్థాయిలో నగదు, నగలు కనుగొన్నారు. ఏకంగా రూ.35,67,100 నగదు లభించింది.


కట్టలు కట్టలుగా ఐదొందల రూపాయల నోట్లు బయటపడ్డాయి. ఇంకా... రూ.17.65 లక్షల విలువ చేసే బంగారం, 2.2 కిలోల వెండి కూడా గుర్తించారు. వెంకటరావు, ఆయన కుటుంబ సభ్యుల పేరిట విజయనగరంలో ఒక ఇల్లు, ఆరు ప్లాట్లు, రెండు చోట్ల వ్యవసాయ భూములు... విశాఖపట్నంలో మూడు ఇంటి స్థలాలు, శ్రీకాకుళంలో ఒక ఇంటి స్థలం, పొలాలు ఉన్నట్లు గుర్తించినట్లు ఏసీబీ అధికారులు ఒక ప్రకటన విడుదల చేశారు. మొత్తం 1.38 కోట్ల విలువైన అక్రమ ఆస్తులు ఉన్నట్లు గుర్తించినట్లు తెలిపారు. వెంకటరావును అరెస్టు చేసి కోర్టు ముందు హాజరుపరిచారు. పైడిభీమవరం పంచాయతీ కార్యదర్శి వెంకటరావు సమీప బంధువు ఒకరు కేంద్రమంత్రి వద్ద ఓఎ్‌సడీగా చేస్తున్నారు. ఆయనకు బినామీగా వెంకటరావు వ్యవహరిస్తున్నట్లు ఆరోపణలు వచ్చాయి. దీంతో ఏసీబీ అధికారులు ఈ తనిఖీలు చేస్తున్నట్లు తెలుస్తోంది.  

Updated Date - 2021-04-17T09:07:22+05:30 IST