సంపూర్ణ శాకంబరీగా అమ్మవారు
ABN , First Publish Date - 2020-07-06T11:21:31+05:30 IST
వరంగల్ భద్రకాళి దేవస్థానంలో శాకంబరీ ఉత్సవాలు ఆదివారంతో ముగిశాయి.
270 కిలోల కూరగాయలతో అలంకరణ
భద్రకాళి ఆలయంలో ముగిసిన ఉత్సవాలు
వరంగల్ కల్చరల్, జూలై 5: వరంగల్ భద్రకాళి దేవస్థానంలో శాకంబరీ ఉత్సవాలు ఆదివారంతో ముగిశాయి. పదిహేనో రోజున ఆశాఢ శుద్ధ పౌర్ణమి రోజున అమ్మవారిని శాకంబరీగా అలంకరించి పూజారాధనలు చేశారు. వందలాది మంది భక్తులు ఉదయమే ఆలయానికి చేరుకొని అమ్మవారి దర్శనం కోసం బారులు తీరారు. ఉదయం 8 గంటలకు అమ్మవారి దర్శనానికి అనుమతించారు. ఆలయ ప్రాంగణంలో శానిటైజర్ను ఏర్పాటు చేశారు. కరోనా నేపథ్యంలో చిన్న పిల్లలను ఆలయంలోనికి అనుమతించలేదు.
గతంలో మాదిరిగా కాకుండా వ్యవసాయ క్షేత్రానికి వెళ్ళి సేకరించిన కూరగాయలతో అమ్మవారిని అలంకరించారు. 270 కిలోల కూరగాయాలతో హైదరాబాద్కు చెందిన హరికృష్ణ, స్మిత దంపతులు అమ్మవారి విగ్రహాన్ని అలంకరించారు. పశ్చిమ ఎమ్మెల్యే, చీఫ్విప్ దాస్యం వినయ్భాస్కర్ దంపతులు అమ్మవారిని దర్శించుకొని పూజలు చేశారు.