బాల్య వివాహం చేశారని తల్లిదండ్రులపై ఫిర్యాదు చేసిన బాలిక
ABN , First Publish Date - 2022-05-17T10:37:54+05:30 IST
ఇష్టంలేని పెళ్లి చేశారంటూ స్త్రీ, శిశు సంక్షేమ శాఖ అధికారులను ఆశ్రయించింది ఓ బాలిక.
కౌన్సెలింగ్ ఇచ్చిన పోలీసులు, స్త్రీశిశు సంక్షేమ శాఖ అధికారులు
కేశంపేట, మే 16(ఆంధ్రజ్యోతి): ఇష్టంలేని పెళ్లి చేశారంటూ స్త్రీ, శిశు సంక్షేమ శాఖ అధికారులను ఆశ్రయించింది ఓ బాలిక. దీనిపై స్పందించిన అధికారులు.. బాలిక తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ ఇచ్చారు. అనంతరం బాలికను సఖీ కేంద్రానికి తరలించారు. రంగారెడ్డి జిల్లా కేశంపేట మండలం పాపిరెడ్డిగూడ గ్రామ పంచాయతీ అవాజ్మియా పడకల్ గ్రామానికి చెందిన బాలిక (12)కు ఆమె తల్లిదండ్రులు.. ఫరూఖ్నగర్ మండలం వెల్జర్ల గ్రామానికి చెందిన రవి (30)తో మూడురోజుల క్రితం వివాహం జరింపించారు. ఈ పెళ్లి ఇష్టంలేని బాలిక.. సోమవారం స్త్రీశిశు సంక్షేమ శాఖ అధికారులను ఆశ్రయించింది. తనకు ఇష్టంలేని పెళ్లి చేశారని, రక్షణ కల్పించాలని వేడుకుంది. వెంటనే స్పందించిన అంగన్వాడీ సూపర్వైజర్ విజయలక్ష్మి.. బాలిక ను కేశంపేట పోలీస్స్టేషన్కు తీసుకెళ్లారు. అక్కడకు ఇరు కుటుంబాల సభ్యులను పిలిపించిన పోలీసులు.. కౌన్సెలింగ్ ఇచ్చారు. బాల్యవివాహం చట్టరీత్యా నేరమని చెప్పారు. అనంతరం బాలికను సఖీ కేంద్రానికి తరలించారు.