హాస్టల్ బువ్వ తిని 55 మంది బాలికలకు అస్వస్థత
ABN , First Publish Date - 2020-02-22T07:37:22+05:30 IST
హాస్టళ్లలో కలుషిత బువ్వ విద్యార్థుల ప్రాణాల మీదకు తెస్తోంది. వరంగల్ అర్బన్ జిల్లా ధర్మసాగర్ మండలం ముప్పారం గ్రామంలోని కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయం హాస్టల్లో...
ధర్మసాగర్లో కలకలం.. తల్లిదండ్రుల ఆగ్రహం
ధర్మసాగర్, ఫిబ్రవరి 21: హాస్టళ్లలో కలుషిత బువ్వ విద్యార్థుల ప్రాణాల మీదకు తెస్తోంది. వరంగల్ అర్బన్ జిల్లా ధర్మసాగర్ మండలం ముప్పారం గ్రామంలోని కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయం హాస్టల్లో కలుషిత ఆహారం తిని 55 మంది విద్యార్థులు, ఓ టీచర్ అస్వస్థతకు గురయ్యారు. వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ధర్మసాగర్ పీహెచ్సీలోనూ కొందరికి చికిత్స అందుతోంది. హాస్టల్లో మొత్తం 248 మంది విద్యార్థులు ఉంటున్నారు. గురువారం రాత్రి 8 గంటలకు భోజనం చేశారు. రాత్రి 12.30 గంటలకు చాలా మంది విద్యార్థులు కడుపునొప్పి, వాంతులు, విరేచనాలతో బాధపడ్డారు. శుక్రవారం ఉదయం 3 గంటలకు ఆస్పత్రికి అంబులెన్సుల్లో తరలించారు. ఎవరి పరిస్థితీ విషమంగా లేదని శుక్రవారం సాయంత్రం వైద్యులు వెల్లడించారు. విద్యార్థుల అస్వస్థతకు కలుషిత ఆహారమే కారణమై ఉంటుందనే ప్రాథమిక అంచనాకు వచ్చారు. అస్వస్థతకు గురైన విద్యార్థులను ఎమ్మెల్యే రాజయ్య, జిల్లా కలెక్టర్ రాజీవ్గాంధీ హన్మంతు, జాయింట్ కలెక్టర్ దయానంద్ ఎంజీఎం పరామర్శించారు. విచారణ చేపట్టనున్నట్లు తెలిపారు. హాస్టల్ సిబ్బంది తీరుపై విద్యార్థుల తల్లిదండ్రులు మండిపడ్డారు.