అమరచింత ఏటీఎంలో..100కు బదులు 500 నోట్లు
ABN , First Publish Date - 2021-05-16T07:55:53+05:30 IST
అది వనపర్తి జిల్లా అమరచింతలోని ఇండియావన్ ఏటీఎం కేంద్రం..! శనివారం ఆ ఏటీఎం కేంద్రానికి జనాలు క్యూకట్టారు.
- ఎగబడి డ్రా చేసిన జనాలు
- రూ. 5.88 లక్షల అదనపు విత్డ్రా
- క్యాష్ ట్రే లోడింగ్లోనే లోపాలు
వనపర్తి, మే 15 (ఆంధ్రజ్యోతి): అది వనపర్తి జిల్లా అమరచింతలోని ఇండియావన్ ఏటీఎం కేంద్రం..! శనివారం ఆ ఏటీఎం కేంద్రానికి జనాలు క్యూకట్టారు. డబ్బు విత్డ్రా చేసుకునేందుకు ఎగబడ్డారు. నోట్ల రద్దు తర్వాత ఏటీఎం కేంద్రాలకు పెరిగినంతగా డిమాండ్ నెలకొంది. అందుకు కారణం.. రూ. 100 నోటు బదులు రూ. 500 రావడమే..! తొలుత ఓ కస్టమర్ రూ. 4 వేలు విత్డ్రా చేసుకోగా.. వంద నోట్ల స్థానం లో ఐదొందల నోట్లు వచ్చాయి. మొత్తం రూ. 20 వేలు చేతికి అందాయి. దాంతో అతడు అవాక్కయ్యాడు. అతని ద్వారా విషయం చుట్టపక్కల ప్రాంతాలకు వ్యాపించిపోయింది. దాంతో.. ఆ ఏటీఎం కేంద్రానికి బ్యాంకు ఖాతాదారుల తాకిడి పెరిగింది. డబ్బులు డ్రా చేసుకోవడానికి జనాలు ఎగబడ్డారు. అటుగా వచ్చిన పెట్రోలింగ్ సిబ్బంది.. విషయాన్ని ఆరా తీశారు. వెంటనే ఏటీఎం కేంద్రానికి తాళం వేయించి, నిర్వాహకులకు సమాచారం అందించారు. ఏటీఎంలో నగదును లోడ్ చేసినప్పుడు.. రూ. 100 నోట్ల ట్రేలో రూ. 500 నోట్లను పొరపాటున పెట్టినట్లు అధికారులు గుర్తించారు. ఇలా మూడు రోజుల్లో రూ. 5.88 లక్షల మేర అతనపు విత్డ్రావల్స్ జరిగినట్లు లెక్క తేల్చారు. అదనంగా డబ్బులు డ్రా అయిన వారు స్వచ్ఛందంగా వెనక్కి ఇవ్వాలని కోరారు. లేనిపక్షంలో పోలీసులకు ఫిర్యాదు చేసి, డబ్బులు రికవరీ చేస్తామని ఏటీఎం ఏజెన్సీ టెక్నికల్ అధికారి ప్రవీణ్కుమార్ హెచ్చరించారు.