సీఎంఆర్ బకాయిలు @ 29లక్షల టన్నులు
ABN , First Publish Date - 2020-09-25T08:21:16+05:30 IST
రైతుల నుంచి మద్దతు ధరకు సేకరించిన ధాన్యాన్ని మిల్లింగ్ చేయటానికి మిల్లర్లకు ఇస్తే... సకాలంలో తిరిగి ఇవ్వడం లేదు. ఎఫ్సీఐకి ఇవ్వాల్సిన కస్టమ్ మిల్లింగ్ రైస్ (సీఎంఆర్) కోటాను పూర్తి చేయకుండా జాప్యం చేస్తున్నారు...
- గత రెండు సీజన్లలో లక్ష్యాన్ని చేరని మిల్లర్లు
- వాయిదాలపై వాయిదాలు కోరుతూ జాప్యం
- స్వయంగా రంగంలోకి దిగిన సీఎస్ సోమేశ్
- కలెక్టర్లతో కాన్ఫరెన్స్.. డెడ్లైన్లు ఖరారు
హైదరాబాద్, సెప్టెంబరు 24 (ఆంధ్రజ్యోతి): రైతుల నుంచి మద్దతు ధరకు సేకరించిన ధాన్యాన్ని మిల్లింగ్ చేయటానికి మిల్లర్లకు ఇస్తే... సకాలంలో తిరిగి ఇవ్వడం లేదు. ఎఫ్సీఐకి ఇవ్వాల్సిన కస్టమ్ మిల్లింగ్ రైస్ (సీఎంఆర్) కోటాను పూర్తి చేయకుండా జాప్యం చేస్తున్నారు. నిరుడు వానాకాలం సీజన్కు సంబంధించి 1.81 లక్షల టన్నులు, యాసంగి సీజన్కు సంబంధించి 27.15 లక్షల టన్నులు కలిసి మొత్తం సుమారు 29 లక్షల టన్నుల బియ్యాన్ని రైస్ మిల్లర్లు ప్రభుత్వానికి అప్పగించాల్సి ఉంది. పౌరసరఫరాల అధికారులు పర్యవేక్షిస్తున్నా, కొందరు మిల్లర్లు మొండికేస్తుండటంతో గురువారం సీఎస్ సోమేశ్కుమార్ స్వయంగా రంగంలోకి దిగారు. అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. 2019 వానాకాలం సీజన్కు సంబంధించిన సీఎంఆర్ కోటాను ఈ నెల 30వ తేదీలోగా, ఈ ఏడాది యాసంగి సీజన్కు సంబంధించిన కోటాను వచ్చే నెల 20లోగా పూర్తి చేయాలని నిర్దేశించారు.
సీఎంఆర్ కోటా అప్పగించటానికి ఎదురవుతున్న సమస్యలను పరిష్కరించాలని పౌరసరఫరాలశాఖ కమిషనర్ అనిల్ కుమార్కు సూచించారు. వానాకాలం సీజన్కు సంబంధించిన ధాన్యం కొనుగోళ్లకు పూర్తిస్థాయిలో సన్నద్ధం కావాలని పౌరసరఫరాలు, ఎఫ్సీఐ అధికారులకు దిశానిర్దేశం చేశారు. సీఎంఆర్ కోటా లక్ష్యం పూర్తి చేయటంలో జాప్యం జరగడానికి సబ్సిడీ బియ్యం రీ- సైక్లింగే ప్రధాన కారణమన్న ఆరోపణలున్నాయి. పౌరసరఫరాల సంస్థ నుంచి మిల్లర్లకు వెళ్తున్న ధాన్యాన్ని మిల్లింగ్ చేసి ఇవ్వాల్సిన మిల్లర్లు.. రేషన్ బియ్యాన్ని అక్రమంగా రీసైక్లింగ్ చేస్తూ లక్ష్యాన్ని చేరుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.