దుబాయి వ్యాపారవేత్త దాతృత్వం.. 185 మంది భారత ప్రవాసుల కోసం..
ABN , First Publish Date - 2020-07-04T19:16:53+05:30 IST
దుబాయిలోని ఓ వ్యాపారవేత్త పెద్ద మనసు చాటారు.
యూఏఈ: దుబాయిలోని ఓ వ్యాపారవేత్త పెద్ద మనసు చాటారు. కరోనా నేపథ్యంలో ఉపాధి కోల్పోయి స్వదేశానికి తిరిగి వచ్చేందుకు విమాన చార్టీలు కూడా కట్టుకోలేని దయనీయస్థితిలో ఉన్న 185 భారత ప్రవాసులను తన సొంత ఖర్చులతో ప్రత్యేకంగా ఓ చార్టెడ్ విమానం బుక్ చేసి ఇండియాకు పంపించారు. దుబాయి నుంచి కొచ్చికి వచ్చిన ఈ విమానంలో గర్భిణీలు, వృద్ధులు, హెల్త్ ఎమర్జెన్సీ ఉన్నవారు, చిన్న పిల్లలు ఉన్నారు. ఈ చార్టెడ్ విమానాన్ని J&J మార్కెటింగ్ LLC మేనేజింగ్ డైరెక్టర్ జిజి వర్గీస్ ఏర్పాటు చేశారు. యూఏఈలోని భారత మిషన్లు, స్థానిక మరియు భారత ప్రభుత్వ సంస్థల సహాయంతో ఈ ఫ్లైట్ను ఏర్పాటు చేయడం జరిగింది. విపత్కర పరిస్థితుల్లో ఉన్న తమకు వర్గీస్ చేసిన ఈ సాయం ఎప్పటికీ మర్చిపోలేమని ఈ సందర్భంగా భారత ప్రవాసులు అన్నారు.
ఇదిలా ఉంటే... ఇప్పటివరకు సుమారు 1,30,000 మంది భారతీయ పౌరులు చార్టెడ్, ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న విమానాల ద్వారా యూఏఈ నుంచి స్వదేశానికి చేరుకున్నట్లు సమాచారం. మరోవైపు 'వందే భారత్ మిషన్'లో భాగంగా మూడు విడుతల్లో 5లక్షల మంది ఇండియాకు చేరుకున్నట్లు భారత విదేశాంగ మంత్రిత్వశాఖ శుక్రవారం ప్రకటించిన విషయం తెలిసిందే. మే 7న ప్రారంభమైన ఈ మిషన్ ఇప్పటి వరకు 137 దేశాల నుంచి 5,03,990 మందిని భారత్కు తరలించినట్లు వెల్లడించింది.