సీఎం రిలీఫ్ ఫండ్కు 16ఏళ్ల క్రికెటర్ విరాళం
ABN , First Publish Date - 2020-03-29T19:54:07+05:30 IST
కోవిడ్-19 మహమ్మారిపై జరుగుతున్న పోరాటంలో 16 సంవత్సరాలు యువ క్రికెటర్ రిచా ఘోష్ తన వొంతు సహాయాన్ని ప్రభుత్వానికి అందించింది.
కోల్కతా: కోవిడ్-19 మహమ్మారిపై జరుగుతున్న పోరాటంలో 16 సంవత్సరాలు యువ క్రికెటర్ రిచా ఘోష్ తన వొంతు సహాయాన్ని ప్రభుత్వానికి అందించింది. పశ్చిమబెంగాళ్ ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ.లక్ష విరాళంగా ఇస్తున్నట్లు రిచా ప్రకటించింది. రిచా తండ్రి మనబెంద్రా ఘోష్ శనివారం ఈ విరాళానికి సంబంధించిన చెక్ను సిలిగురి మెజిస్ట్ర్రేట్ సుమంత్ సహాయ్ ఇంటికి వెళ్లి అందించినట్లు క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ బెంగాల్(సీఏబీ) వెల్లడించింది.
రిచా ఆస్ట్రేలియా వేదికగా జరిగిన టీ-20 ప్రపంచకప్లో టీం ఇండియా తరఫున ఫైనల్తో కలిపి రెండు మ్యాచులు ఆడింది. ఆతిథ్య జట్టుతో జరిగిన ఈ టోర్నీ ఫైనల్లో భారత్ 85 పరుగుల తేడాతో ఓటమిపాలైంది.
అయితే తన విరాళం గురించి రిచా మాట్లాడుతూ.. ‘‘ప్రతీ ఒక్కరు కోవిడ్-19ను ఎదురుకొనేందుకు పోరాటం చేస్తున్నారు. ముఖ్యమంత్రి ఇందుకోసం సహాయం అందించాలని కోరారు. ఓ బాధ్యతగల భారత పౌరురాలిగా నేను నా వొంతు సహాయాన్ని అందించాను’’ అని చెప్పింది. రిచాతో పాటు సీఏబీకి చెందిన 66 మంది అధికారులు రూ.1.5 లక్షలు, 82మంది స్కోరర్లు వాళ్లు రోజువారీ జీతాలను వదులుకొని రూ.77,420లను ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళంగా అందించారు. వీరితో పాటు సీఏబీలో మహమ్మదన్ స్పోర్టింగ్ క్లబ్ ప్రతినిధి తన వొంతు సహాయంగా రూ.2 లక్షలను విరాళంగా అందిస్తున్నట్లు ప్రకటించారు.