11 ఏళ్ల భార‌తీయ‌ బాలుడికి.. బ్రిట‌న్‌లో అరుదైన గౌర‌వం!

ABN , First Publish Date - 2021-06-02T17:27:55+05:30 IST

బ్రిట‌న్‌లో 11 ఏళ్ల భార‌తీయ‌ బాలుడికి అరుదైన గౌర‌వం ద‌క్కింది. చిన్న వ‌య‌సులోనే యోగాలో రికార్డులు క్రియేట్ చేస్తున్న‌ ఈశ్వ‌ర్ శ‌ర్మ అనే భార‌త సంత‌తి బాలుడు.. బ్రిట‌న్ ప్ర‌ధాని బోరిస్ జాన్స‌న్ డైలీ పాయింట్స్‌ ఆఫ్ లైట్ అవార్డ్ సొంతం చేసుకున్నాడు.

11 ఏళ్ల భార‌తీయ‌ బాలుడికి.. బ్రిట‌న్‌లో అరుదైన గౌర‌వం!

లండ‌న్‌: బ్రిట‌న్‌లో 11 ఏళ్ల భార‌తీయ‌ బాలుడికి అరుదైన గౌర‌వం ద‌క్కింది. చిన్న వ‌య‌సులోనే యోగాలో రికార్డులు క్రియేట్ చేస్తున్న‌ ఈశ్వ‌ర్ శ‌ర్మ అనే భార‌త సంత‌తి బాలుడు.. బ్రిట‌న్ ప్ర‌ధాని బోరిస్ జాన్స‌న్ డైలీ పాయింట్స్‌ ఆఫ్ లైట్ అవార్డ్ సొంతం చేసుకున్నాడు. ఆగ్నేయ ఇంగ్లాండ్‌లో ఉండే ఈశ్వ‌ర్‌.. క‌రోనా లాక్‌డౌన్ స‌మ‌యంలో వ‌ర్చువ‌ల్‌గా ప్రతిరోజూ 14 దేశాల‌కు చెందిన 40 మంది విద్యార్థుల‌కు యోగా పాఠాలు బోధించాడు. దీంతో ఈశ్వ‌ర్ ప్రతిభ‌ను గుర్తించిన యూకే ప్ర‌భుత్వం మంగ‌ళ‌వారం ప్ర‌ధాని బోరిస్ జాన్స‌న్ డైలీ పాయింట్స్‌ ఆఫ్ లైట్ అవార్డ్‌తో స‌త్క‌రించింది. కెంట్‌లోని సెవెనోక్స్‌లో నివాస‌ముండే ఈశ్వ‌ర్ మూడేళ్ల ప్రాయం నుంచే యోగాపై మ‌క్కువ పెంచుకున్నాడు. ప్ర‌తిరోజు ఉద‌యం తండ్రి యోగ చేయ‌డం గ‌మ‌నించిన ఈ బుడ‌త‌డు.. ఆయ‌న‌ను అనుస‌రించేవాడు. ఇలా చిన్న‌ప్ప‌టి నుంచి యోగాపై ప‌ట్టుసాధించాడు. ఈశ్వ‌ర్‌ ఇప్ప‌టివ‌ర‌కు మూడుసార్లు ప్రపంచ యోగా ఛాంపియన్‌గా నిలిచాడు. 


"లాక్‌డౌన్ స‌మ‌యంలో ప్రపంచవ్యాప్తంగా వందలాది మంది పిల్లలకు మీరు యోగా వ‌ల్ల‌ ఆనందాన్ని ఇచ్చారు. ప్రత్యేక అవసరాలున్న పిల్లలకు మీరు ఆనందించే కార్యాచరణను ఆస్వాదించడానికి, రాణించడానికి ఎలా సహాయం చేశారో వినడానికి నేను ప్రత్యేకంగా ప్రేరణ పొందాను" అని ఈశ్వ‌ర్‌ను ఉద్దేశిస్తూ ప్ర‌ధాని బోరిస్ జాన్స‌న్ అన్నారు. కాగా, యూకే ప్రధాని రోజువారీ పాయింట్స్ ఆఫ్ లైట్ అవార్డు అందుకున్న 1,646వ వ్యక్తి ఈశ్వర్ శర్మ. ఇక ఈ అవార్డు వారు నివసించే ప్రదేశంలో రోజువారీగా అత్యుత్తమమైన వ్యక్తులను గుర్తించడానికి 2014 ఏప్రిల్‌లో మొదట ప్రారంభించబడింది.         

Updated Date - 2021-06-02T17:27:55+05:30 IST