Budget 2022: నిర్మలమ్మ పద్దులో 10 బిగ్ అనౌన్స్‌మెంట్స్ ఇవే..!

ABN , First Publish Date - 2022-02-01T19:13:05+05:30 IST

కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ 2022-23 సంవత్సరానికి సంబంధించిన కేంద్ర బడ్జెట్‌ను లోక్‌సభలో ప్రవేశపెట్టారు.

Budget 2022: నిర్మలమ్మ పద్దులో 10 బిగ్ అనౌన్స్‌మెంట్స్ ఇవే..!

కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ 2022-23 సంవత్సరానికి సంబంధించిన కేంద్ర బడ్జెట్‌ను లోక్‌సభలో ప్రవేశపెట్టారు. దాదాపు గంటన్నరకు పైగా ఆర్థిక మంత్రి ప్రసంగం సాగింది. ఈ బడ్జెట్‌‌లో తమకు మేలు చేకూర్చే నిర్ణయం వస్తుందని ఎంతో ఆశగా ఎదురు చూసిన వేతన జీవులకు నిరాశే ఎదురైంది. ఆదాయపన్ను మినహాయింపులపై ఎలాంటి ప్రకటనా రాలేదు. 5జీ సేవలు, ఈ-పాస్‌పోర్ట్, క్రిఫ్టో కరెన్సీపై ట్యాక్స్, డిజిటల్ కరెన్సీ మొదలైనవి ఈ బడ్జెట్‌లో కీలక ప్రకటనలుగా నిలిచాయి. 


ఈ బడ్జెట్‌లో 10 కీలకాంశాలు ఏంటంటే.. 


1)డిజిటల్ రూపీతో దేశ ఆర్థిక వ్యవస్థ మరింత మెరుగుపడుతుందని నిర్మలా సీతారామన్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ ఆర్థిక సంవత్సరంలోనే బ్లాక్ చెయిన్ సాంకేతికతతో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డిజిటల్ కరెన్సీకి రూపకల్పన చేస్తున్నట్టు తెలిపారు.


2)క్రిఫ్టో కరెన్సీ లావాదేవీలపై 30 శాతం పన్ను విధిస్తున్నట్టు ఆర్థిక మంత్రి ప్రకటించారు. వర్చువల్, డిజిటల్ ఆస్తులన్నింటికీ ఈ 30 శాతం పన్ను వర్తిస్తుంది.


3)ఐటీ రిటర్న్‌ల దాఖలుకు ఈ బడ్జెట‌్‌లో వెసులుబాటు లభించింది. ఆదాయపన్ను చెల్లింపుల్లో సవరణలకు అప్‌డేట్ చేసుకునే వేసులుబాటును రెండేళ్లకు పెంచారు. రిటర్న్‌లు సమర్పించిన తర్వాత రెండేళ్లలో సవరణలు చేసుకోవచ్చు. పన్ను స్లాబ్‌లలో మాత్రం మార్పు లేదు. 


4)దేశ వ్యాప్తంగా ఈ ఆర్థిక సంవత్సరంలోనే 5జీ మొబైల్ సర్వీస్‌లు అందుబాటులోకి రానున్నట్టు నిర్మలా సీతారామన్ తెలిపారు. 


5)విదేశాలకు ప్రయాణాలు చేసే వారి కోసం కొత్తగా ఈ-పాస్‌పోర్ట్‌ను తీసుకువస్తున్నట్లు నిర్మలా సీతారామన్ వెల్లడించారు. ఈ విధానం వల్ల ప్రయాణికులకు ఎంతో భద్రత, ప్రయోజనాలు చేకూరుతాయని తెలిపారు. ప్రయాణాల సమయంలో ఇమ్మిగ్రేషన్ ప్రక్రియ సులభతరం అయ్యేందుకు ఇది చాలా ఉపయోగపడుతుందని మంత్రి అన్నారు. 


6)ఎలక్ట్రిక్ వాహన రంగానికి కేంద్రం మద్దతు ప్రకటించింది. బ్యాటరీల అభివృద్ధికి, మార్పులకు మరిన్ని ప్రోత్సాహకాలు అందించనున్నట్టు మంత్రి తెలిపారు. 


7)అధునాతన సౌకర్యాలతో 400 వందే భారత్ రైళ్లను వచ్చే మూడేళ్లలో ప్రవేశపెట్టనున్నట్టు నిర్మల వెల్లడించారు. అలాగే వచ్చే మూడేళ్లలో 100 గతిశక్తి టెర్మినల్స్ కూడా అందుబాటులోకి రానున్నాయి. 


8)2022-23 ఆర్థిక సంవత్సరంలో మూలధన వ్యయం35.4 శాతం పెరిగి రూ.7.5 లక్షల కోట్లకు చేరింది. 


9)ఎమ్ఎస్ఎమ్ఈ (మైక్రో, స్మాల్, మీడియం ఎంటర్‌ప్రైజెస్) సెక్టార్‌కు ఊతం ఇచ్చే విధంగా మరిన్ని చర్యలు తీసుకుంటున్నట్టు నిర్మల తెలిపారు. 


10)2022-23 ద్రవ్యలోటు 6.9శాతమని, దానిని 2025-26 నాటికి 4.5 శాతానికి తగ్గించడం తమ లక్ష్యమని ఆర్థిక మంత్రి పేర్కొన్నారు. అలాగే ప్రస్తుత సంవత్సరంలో జీడీపీ వృద్ధి రేటు 9.2 శాతంగా ఉండొచ్చని, 2022- 23 ఆర్థిక సంవత్సరంలో వృద్ధి రేటు 8 - 8.5 ఉండొచ్చని ఆర్థిక సర్వే అంచనా వేసింది. 

Updated Date - 2022-02-01T19:13:05+05:30 IST