హైదరాబాద్లో ఉబర్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ విస్తరణ
ABN , Publish Date - May 14 , 2026 | 04:21 AM
హైదరాబాద్లో ఉబర్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ను మరింతగా విస్తరిస్తామని ఆ సంస్థ సీఈవో దారా ఖోస్రోషాహి తెలిపారు. అమెరికా వెలుపల ఏర్పాటు చేసిన తొలి కేంద్రం ఇదేనని, ఇక్కడ 600 మంది ఇంజినీర్లు పని...
సీఎం రేవంత్రెడ్డితో భేటీలో ఉబర్ సీఈవో ఖోస్రోషాహి
హైదరాబాద్, మే 13 (ఆంధ్రజ్యోతి): హైదరాబాద్లో ఉబర్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ను మరింతగా విస్తరిస్తామని ఆ సంస్థ సీఈవో దారా ఖోస్రోషాహి తెలిపారు. అమెరికా వెలుపల ఏర్పాటు చేసిన తొలి కేంద్రం ఇదేనని, ఇక్కడ 600 మంది ఇంజినీర్లు పని చేయనున్నట్లు తెలిపారు. జూబ్లీహిల్స్ నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డితో ఖోస్రోషాహి నేతృత్వంలోని ప్రతినిధి బృందం భేటీ అయింది. ఈ సందర్భంగా ఉబర్ వ్యాపార కార్యకలాపాలను సీఎంకు ఖోస్రోషాహి వివరించారు. భారత్ ఫ్యూచర్ సిటీలో ఉబర్ కార్పొరేట్ ఆఫీస్ నిర్మిస్తామని, భవిష్యత్తులో మరింతగా విస్తరిస్తామని తెలిపారు. ఇందుకు తెలంగాణ ప్రభుత్వ సహకారం కావాలని సీఎంను కోరారు. అనంతరం సీఎం రేవంత్ మాట్లాడుతూ దేశంలోని ప్రధాన నగరాల్లో పార్కింగ్ ప్రధాన సమస్యగా మారిందని, మెట్రో స్టేషన్లు దగ్గర పార్కింగ్ సౌకర్యం లేక ఇబ్బందులు తలెత్తుతున్నాయన్నారు. దీనిపై దృష్టి పెట్టాలని, అవకాశం ఉంటే మల్టీలెవల్ పార్కింగ్ కేంద్రాల ఏర్పాటుకు ముందుకు రావాలని సూచించారు. ఈవీ చార్జింగ్ సెంటర్లతో పాటు పార్కింగ్ సెంటర్లు ఏర్పాటు చేస్తే బాగుంటుందని అభిప్రాయపడ్డారు. ఈ సూచనపై తప్పకుండా అధ్యయనం చేస్తామని ఉబర్ ప్రతినిధి బృందం తెలిపింది. 30 వేల ఎకరాల్లో నిర్మించే ఫ్యూచర్ సిటీ ప్రపంచంలోనే ప్రత్యేకమైనదని, ఇప్పటికే పలు సంస్థలు కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయని తెలిపారు. ఈ సందర్భంగా ఫ్యూచర్ సిటీలో ఉబర్ కార్పొరేట్ ఆఫీస్ నిర్మాణానికి ఉబర్ సీఈవో ఖోస్రోషాహి ఆసక్తి చూపించారు.