తుమ్మల పని తీరు ఆదర్శనీయం
ABN , Publish Date - Sep 11 , 2026 | 04:08 AM
వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అందుబాటులో ఉంటారని, ప్రతి ఎమ్మెల్యేకు గౌరవం ఇస్తారని బీజేపీ ఎమ్మెల్యే పైడి రాకేశ్రెడ్డి కితాబు ఇచ్చారు. 40 ఏళ్లుగా వివిధ ప్రభుత్వాల్లో మంత్రిగా పని చేసిన తుమ్మల పని తీరు ఇతరులకు ఆదర్శమని అన్నారు
ఆయనకు ఆదివారం ఫోన్ చేసినా అందుబాటులో ఉంటారు
ప్రతి ఎమ్మెల్యేకూ గౌరవం ఇస్తారు
బీజేపీ ఎమ్మెల్యేలు రాకేశ్ రెడ్డి,పాయల్ శంకర్ కితాబు
హైదరాబాద్, సెప్టెంబర్ 9 (ఆంధ్రజ్యోతి)
ఆదివారం ఫోన్ చేసినా.. వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అందుబాటులో ఉంటారని, ప్రతి ఎమ్మెల్యేకు గౌరవం ఇస్తారని బీజేపీ ఎమ్మెల్యే పైడి రాకేశ్రెడ్డి కితాబు ఇచ్చారు. 40 ఏళ్లుగా వివిధ ప్రభుత్వాల్లో మంత్రిగా పని చేసిన తుమ్మల పని తీరు ఇతరులకు ఆదర్శమని అన్నారు. వ్యవసాయశాఖ మంత్రిగా తుమ్మల బాగా పని చేస్తున్నారని వెల్లడించారు. ఒక సమస్య విషయమై ఫోన్ చేస్తే మళ్లీ 15 నిమిషాల్లో ఫోన్ చేసి ఆరా తీశారని, సమస్య పరిష్కారమయ్యేదాకా చొరవ తీసుకున్నారని గుర్తు చేశారు. ఇతర మంత్రులు, కొత్త ఎమ్మెల్యేలు తుమ్మలను ఆదర్శంగా తీసుకోవాలని బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ అభిప్రాయపడ్డారు. రాష్ట్రం కూడా పీఎం పంటల బీమా పథకంలో చేరాలని, ఇందుకోసం రూ.3వేల కోట్లను చెల్లించాలని కోరారు. 2014తర్వాత రాష్ట్రంలో పాలీహౌస్ పనులకు టెండర్లు వేయడానికి కూడా కాంట్రాక్టర్లు ముందుకు రావడం లేదని గుర్తు చేశారు. రాష్ట్రంలో కూరగాయల సాగును పెంచేందుకు 95శాతం సబ్సిడీతో కోల్డ్ స్టోరేజీలు, గోదాములు నిర్మించాలని ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి సూచించారు.