పోలీసు రిక్రూట్మెంట్ పరీక్షల తేదీలు ప్రకటించిన బోర్డు
ABN , Publish Date - Sep 18 , 2026 | 06:09 AM
పోలీసు ఉద్యోగాల భర్తీకి నిర్వహించే రాతపరీక్ష తేదీలను పోలీసు రిక్రూట్మెంట్ బోర్డు చైర్మన్ వి.వి. శ్రీనివాసరావు వెల్లడించారు. ఎస్ఐ సివిల్ తత్సమాన పోస్టులకు నవంబర్ 29న, కానిస్టేబుల్ స్థాయి పోస్టులకు డిసెంబర్ 20న పరీక్షలు నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు.
ఎస్ఐ ప్రిలిమ్స్ నవంబర్ 29న
కానిస్టేబుల్ రాత పరీక్ష డిసెంబర్ 20న
పది ఉమ్మడి జిల్లాల్లో రాత పరీక్ష కేంద్రాలు
7,437 పోస్టులకు 5.77లక్షల దరఖాస్తులు
4.29 లక్షల మంది అభ్యర్థులు
ముగిసిన ఆన్లైన్ దరఖాస్తుల ప్రక్రియ
హైదరాబాద్,సెప్టెంబర్17(ఆంధ్రజ్యోతి) పోలీసు ఉద్యోగాల భర్తీకి నిర్వహించే రాతపరీక్ష తేదీలను పోలీసు రిక్రూట్మెంట్ బోర్డు చైర్మన్ వి.వి. శ్రీనివాసరావు వెల్లడించారు. ఎస్ఐ సివిల్ తత్సమాన పోస్టులకు నవంబర్ 29న, కానిస్టేబుల్ స్థాయి పోస్టులకు డిసెంబర్ 20న పరీక్షలు నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. పోలీసు, స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్, అగ్నిమాపక, జైళ్ల శాఖల్లో 7,437 పోస్టుల భర్తీకి సంబంధించి ఈ ఏడాది జూలై 29న నాలుగు నోటిఫికేషన్లు జారీ చేశారు. అభ్యర్థులు ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకునే ప్రక్రియ ముగిసిపోవడంతో పరీక్ష తేదీలను రిక్రూట్మెంట్ బోర్డు ప్రకటించింది. ఎస్ఐ, ఏఎ్సఐ స్థాయి పోస్టులు 298, కానిస్టేబుల్ స్థాయి పోస్టులు 7,139 కాగా, ఇందులో ఐదువేల పోస్టులు పోలీసుశాఖకు సంబంధించినవే. గత నెల 19 నుంచి ఈనెల 16వ తేదీ వరకు ఆన్లైన్ దరఖాస్తులను స్వీకరించారు. 4.29 లక్షల మంది అభ్యర్ధులు 5,77,064 దరఖాస్తులు సమర్పించారని, ఒకే పోస్టుకు దరఖాస్తు చేసిన వారు 68.45శాతం కాగా, రెండు పోస్టులకు దరఖాస్తు చేసిన వారు 28.88శాతం ఉన్నారని పోలీసు రిక్రూట్మెంట్ బోర్డు వివరించింది. మొత్తం దరఖాస్తుల్లో బీసీ అభ్యర్ధులవి అత్యధికంగా 49.19శాతం ఉన్నాయని, ఎస్సీ,ఎస్టీ అభ్యర్ధులవి 43.60శాతం ఉన్నాయని, ఓసీ అభ్యర్ధులు 7.20శాతం, ఇతర రాష్ట్రాల వారు 3.45శాతం ఉన్నారని బోర్డు అధికారులు వివరించారు. మొత్తం దరఖాస్తుల్లో మహిళలవి 1,46,220(25.33 శాతం) ఉన్నాయని, పురుషులవి 4,30,844 (74.66శాతం) అని, ఆధార్ ఫేస్ అఽథెంటికేషన్ను ఇంకా 2.6శాతం మంది పూర్తి చేయలేదని, వారికి ఈనెల 30వ తేదీ వరకు గడువు ఇస్తున్నామని బోర్డు చైర్మన్ శ్రీనివాసరావు తెలిపారు. ఎస్ఐ పరీక్షలను తెలంగాణలోని పది ఉమ్మడి జిల్లా కేంద్రాల్లో నిర్వహిస్తామని, కానిస్టేబుల్ పరీక్షలను పది ఉమ్మడి జిల్లా కేంద్రాలతో పాటు 15 నుంచి 18 కేంద్రాల్లో నిర్వహించే అవకాశం ఉందని వివరించారు.