ప్రభుత్వ ఉద్యోగాలకు..వయో పరిమితి పెంపు
ABN , Publish Date - May 20 , 2026 | 03:45 AM
రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగ నియామకాల కోసం ఎదురుచూస్తున్న వారికి ప్రభుత్వం కాస్త ఊరట కల్పించింది. ప్రభుత్వ ఉద్యోగాల్లో నియామకాల కోసం ఉన్న గరిష్ఠ వయోపరిమితిని పదేళ్లు పెంచింది.
జనరల్ అభ్యర్థులకు గరిష్ఠ వయోపరిమితి 34 నుంచి 44 ఏళ్లకు పెంచిన సర్కారు
ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ వర్గాలకు 49 ఏళ్లు.. దివ్యాంగులకు 54 ఏళ్లు
ఏడాది పాటు జరిగే నియామకాలకు ఈ పెంపు వర్తింపు
హైదరాబాద్, మే 19 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగ నియామకాల కోసం ఎదురుచూస్తున్న వారికి ప్రభుత్వం కాస్త ఊరట కల్పించింది. ప్రభుత్వ ఉద్యోగాల్లో నియామకాల కోసం ఉన్న గరిష్ఠ వయోపరిమితిని పదేళ్లు పెంచింది. గతంలో పెంచిన వయో పరిమితి గడువు ఈ ఏడాది ఫిబ్రవరిలో ముగిసిన నేపథ్యంలో... తాజాగా మళ్లీ పెంచుతూ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఏడాది పాటు ప్రభుత్వం చేపట్టే ప్రత్యక్ష నియామకాలకు ఈ పెంపు వర్తిస్తుందని తెలిపింది. దీని ప్రకారం జనరల్ అభ్యర్థులకు గరిష్ఠ వయోపరిమితి 34 ఏళ్ల నుంచి 44 ఏళ్లకు పెరుగుతుంది. ‘తెలంగాణ స్టేట్ అండ్ సబార్డినేట్ సర్వీస్ రూల్స్’లోని 12వ నిబంధన ప్రకారం ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ వర్గాలకు 5 ఏళ్లు, దివ్యాంగులకు పదేళ్లు వయోపరిమితి సడలింపు ఉంటుంది. ఈ మేరకు ప్రస్తుతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 49 ఏళ్లు, దివ్యాంగులకు 54 ఏళ్లు గరిష్ఠ వయో పరిమితి వర్తిస్తుంది. పోలీసు, ఎక్సైజ్, అగ్నిమాపక, జైళ్లు, అటవీ శాఖ తదితర యూనిఫాం సర్వీసుల్లోని ఉద్యోగాలకు ఈ వయోపరిమితి పెంపు వర్తించదని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇంతకుముందు రాష్ట్ర ప్రభుత్వం 2024 ఫిబ్రవరి 8న వయోపరిమితిని పెంచింది. ఆ గడువు ఈ ఏడాది ఫిబ్రవరిలో ముగిసింది. మళ్లీ పదేళ్లు పెంచేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్టుగా ఈ నెల 7న ‘ఆంధ్రజ్యోతి’ కథనం ప్రచురించింది. ఇటీవల శాసనసభ, మండలి విప్లు సీఎం రేవంత్ను కలిసి ఉద్యోగాలకు వయో పరిమితిని పెంచాలని కోరారు. ఎమ్మెల్సీలు కోదండరాం, అద్దంకి దయాకర్ కూడా డిప్యూటీ సీఎం భట్టిని కలిసి ఇదే విజ్ఞప్తి చేశారు. ఈ క్రమంలోనే ప్రభుత్వం సానుకూలంగా నిర్ణయం తీసుకుంది.