Share News

జిల్లాలో నీటి ఎద్దడి ఉండొద్దు

ABN , Publish Date - Mar 10 , 2026 | 12:38 AM

జిల్లాలోని ఏ ఒక్క ఆవాస ప్రాంతంలో తాగునీటి ఎద్దడి తలెత్తవద్దని, అందుకు అనుగుణంగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ అనురాగ్‌జయంతి అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో అధికారులతో నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడారు.

జిల్లాలో నీటి ఎద్దడి ఉండొద్దు

కలెక్టర్‌ అనురాగ్‌జయంతి

యాదాద్రి, మార్చి 9 (ఆంధ్రజ్యోతి): జిల్లాలోని ఏ ఒక్క ఆవాస ప్రాంతంలో తాగునీటి ఎద్దడి తలెత్తవద్దని, అందుకు అనుగుణంగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ అనురాగ్‌జయంతి అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో అధికారులతో నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడారు. మల్లన్నసాగర్‌ నుంచి ఘణ్‌పూర్‌ వరకు తాగునీటి కోసం రూ.210కోట్లతో చేపట్టిన పనులను యుద్ధప్రాతిపదికన పూర్తిచేయాలని కోరారు. వేసవి దృష్ట్యా ముందస్తు కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని, నీటి సరఫరాను క్షేత్రస్థాయిలో నిరంతరం పర్యవేక్షించాలన్నారు. మిషన్‌ భగీరథ ద్వారా అందుబాటులో ఉన్న నీటి వనరులను పూర్తిస్థాయిలో వినియోగించుకోవాలన్నారు. నీటి ఎద్దడి ఏర్పడే అవకాశాలు ఉన్న ఆవాసాలను ముందుగా గుర్తించి ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోవాలన్నారు. చేతి పంపులు, విద్యుత్‌ మోటార్లు పనిచేసేలా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్‌ భాస్కర్‌రావు, మిషన్‌ భగీరథ ఎస్‌ఈ కృష్ణయ్య, ఈఈ కరుణాకర్‌, పబ్లిక్‌ హెల్త్‌ ఎస్‌ఈ వెంకటేశ్వర్లు, హెచ్‌ఎండబ్ల్యూఎ్‌స బీజీ ఎం.శశాంక్‌, తదితరులు పాల్గొన్నారు.

మధ్యాహ్న భోజనాన్ని రుచిచూడాలి

భువనగిరి రూరల్‌: ప్రభుత్వ పాఠశాలల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ గురుకుల పాఠశాలల్లో మధ్యాహ్న భోజనా న్ని ప్రత్యేక అధికారులు రుచిచూడాలని కలెక్టర్‌ అనురా గ్‌జయంతి అన్నారు. ఈ మేరకు సోమవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. జిల్లాలోని 691 ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకం పర్యవేక్షణకు నియమించిన ప్రత్యేక అధికారులు పాఠశాలలను సం దర్శించాలన్నారు. విద్యార్థులతో కలిసి భోజనం చేసి వారి కి వడ్డిస్తున్న భోజనాన్ని రుచి చూసి, ఆహార నాణ్యత, పరిశుభ్రత, మెనూ ప్రకారం అందుతున్నాయో లేదా పరిశీలించాలన్నారు. వంట సరుకులు, కూరగాయలు నాణ్యతతో ఉండాలని, వంట గదులు పరిశుభ్రంగా ఉంచాలని, తాగునీటిని సక్రమంగా అందించాలన్నారు.

కలెక్టర్‌కు ఎమ్మెల్యే కుంభం సన్మానం

భువనగిరి రూరల్‌: జిల్లా కలెక్టర్‌గా బాధ్యతలు తీసుకున్న అనురాగ్‌జయంతిని ఎమ్మెల్యే కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి సోమవారం మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సన్మానించి పుష్పగుచ్ఛం అందజేశారు. ఆయన వెంట మునిసిపల్‌ చైర్మన్‌ తంగేళ్లపల్లి శ్రీవాణి రవికుమార్‌, వైస్‌ చైర్మన్‌ పోతంశెట్టి మంజులవెంకటేశ్వర్లు, పోత్నక్‌ ప్రమోద్‌కుమార్‌, కుక్కదువ్వు సోమయ్య, ఏఎంసీ చైర్‌పర్సన్‌ రేఖ బాబురావు ఉన్నారు.

రోడ్డు సరిహద్దులో ఇళ్లు నిర్మిస్తున్నారు

మోత్కూరు: మోత్కూరు మునిసిపాలిటీ పరిధిలోని బుజిలాపురం గ్రామంలో కొందరు అనుమతి లేకుండా రోడ్డు సరిహద్దును ఆక్రమించి ఇళ్లు నిర్మిస్తున్నారని సోమవారం కలెక్టరేట్‌లో జరిగిన ‘ప్రజావాణి’లో గ్రామ మాజీ సర్పంచ్‌ చేతరాశి వీరస్వామి కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. సర్వేనంబర్‌ 541లో 2.60గుంటల ఇళ్ల స్థలాల భూమి ఉందని,ఆ భూమిని సర్వే చేసి హద్దులు నిర్ణయించారన్నారు. రోడ్డు వెంట ఉన్న భూ యజమానులు సరిహద్దులోకి వెళ్లి అనుమతులు లేకుండా ఇంటిని నిర్మిస్తున్నారని, మునిసిపల్‌ కమిషనర్‌కు ఫిర్యాదు చేయగా సర్వేకు ఫీజు చెల్లించాలని కోరడంతో ఫీజు కూడా చెల్లించానన్నారు. ఈనెల 2న మునిసిపల్‌ కమిషనర్‌, టౌన్‌ప్లానింగ్‌ అధికారి, రెవెన్యూ అధికారులు హద్దులు నిర్ణయిస్తుండగా భూ యజమానులు తనపై దాడికి యత్నించారని దీనిపై విచారణ చేసి న్యాయం చేయాలని కోరారు.

Updated Date - Mar 10 , 2026 | 12:38 AM