వ్యవధి ఉన్నా.. మొక్కు‘బడి’గా
ABN , Publish Date - Mar 18 , 2026 | 12:26 AM
పదో తరగతి పరీక్షల్లో గతానికి భిన్నంగా రోజుల వ్యవధి ఇచ్చారు. పరీక్షల మధ్య వ్యవధిని సద్వినియోగం చేసేలా విద్యార్థులకు పాఠశాలల్లో నే ప్రత్యేక తరగతులు నిర్వహించాలని విద్యాశాఖ ఉత్తర్వులు జారీచేసింది.
పరీక్షల మధ్య రోజుల సమయం
‘పది’ విద్యార్థులకు ప్రత్యేక తరగతులు అంతంతే
ఇంట్లోనే చదువుకుంటున్న విద్యార్థులు
(ఆంధ్రజ్యోతి,నల్లగొండ): పదో తరగతి పరీక్షల్లో గతానికి భిన్నంగా రోజుల వ్యవధి ఇచ్చారు. పరీక్షల మధ్య వ్యవధిని సద్వినియోగం చేసేలా విద్యార్థులకు పాఠశాలల్లో నే ప్రత్యేక తరగతులు నిర్వహించాలని విద్యాశాఖ ఉత్తర్వులు జారీచేసింది. అయి తే పదో తరగతి విద్యార్థులకు పాఠశాలల్లో మాత్రం మొక్కుబడిగా ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నారనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి.
పరీక్షల మధ్య వ్యవధిలో ప్రత్యేక తరగతుల నిర్వహణలో కొందరు హెచ్ఎంలు వైఫల్యం చెందుతున్నారని, ఈ ప్రభావం ఫలితాలపై చూపే అవకాశాలు ఉన్నాయని పలువురు అభిప్రాయపడుతున్నారు. పదో తరగతిలో ఉత్తీర్ణ తా శాతం పెరిగేల ప్రభుత్వం గతంలో ఎన్నడూ లేని విధంగా సీబీఎ్సఈ తరహాలో పరీక్షల మధ్య వ్యవధిని పెంచింది. జిల్లాలో ఈ నెల 14న పరీక్షలు ప్రారంభం కాగా, 18న రెండో పరీక్ష ఉంది. వీటి మధ్య మూడు రోజుల వ్యవధి వచ్చింది. ఆ తరువాత 23న పరీక్ష ఉండగా, వ్యవధి నాలుగు రోజులు, అనంతరం 28న పరీక్ష ఉండగా, నాలుగురోజుల వ్యధి ఉం ది. తిరిగి ఏప్రిల్ 2న జరిగే పరీక్ష ఉండగా, నడుమ నాలుగు రోజులు, 7న పరీక్షకు నాలు గు రోజులు, 13న పరీక్షకు ఐదు రోజులు, ఒక్క రోజు వ్యవధితో 15న పరీక్ష ఉండగా, చివరి పరీక్ష వ్యవధి లేకుండా 16న ముగియనుంది. ఈ వ్యవధి కాలంలో విద్యార్థులను యథావిధి గా పాఠశాలకు రప్పించి సబ్జెకులపై సందేహాల నివృత్తితోపాటు స్లిప్ టెస్ట్లు నిర్వహించాలి. ప్రతి విద్యార్థి ఉత్తీరణ సాధించడంతోపాటు అత్యధిక మార్కుల దిశగా సూచనలు చేయాలన్నది ప్రభుత్వ ప్రణాళిక. అయితే అందుకు భిన్నంగా ప్రభుత్వ పాఠశాలల్లో పర్యవేక్షణ లేక విద్యార్థులు రాక తగ్గింది. దీంతో ప్రభుత్వం విడుదల చేసిన వ్యవధి షెడ్యూల్ను అపహాస్యంపాలవుతోంది. పాఠశాలల్లో వీడ్కోలు సమావేశాలు నిర్వహించి హాల్టికెట్స్ అందజేశాక విద్యార్థులు తిరిగి పాఠశాలకు రావడం లేదు. అయితే ప్రధానోపాధ్యాయులు వారి తల్లిదండ్రులతో చర్చించి పిల్లలు పాఠశాలలకు వచ్చేలా పర్యవేక్షణ చేయాల్సి ఉండగా, ఎవరికి వారే చేతులు దులుపుకుంటున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. ప్రత్యేక తరగతులకు హాజరుకాకుంటే విద్యార్థులు ఇంటి వద్దే ఉంటూ పరీక్షలపై నిర్లిప్తత వచ్చే అవకాశం ఉందని తద్వారా ఫలితాలు తగ్గుతాయనే ఆందోళన వ్యక్తం అవుతోంది. ప్రైవేట్ పాఠశాలలు పకడ్బందీగా స్టడీ అవర్స్ నిర్వహిస్తుండగా, ప్రభుత్వ పాఠశాలల్లో అందుకు భిన్న వాతావరణం నెలకొంది. ఇకనైనా జిల్లా విద్యాశాఖ ప్రత్యేక చర్యలు తీసుకొని విద్యార్థులు పరీక్షల వ్యవధిని సద్వినియోగం చేసుకునేలా చూడాలని విద్యానిపుణులు కోరుతున్నారు. దీనిపై డీఈవో బొల్లారం భిక్షపతిని ‘ఆంధ్రజ్యోతి’ వివరణ కోరగా, జిల్లాలో ప్రత్యేక తరగతులను పటిష్టంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. పరీక్షల మధ్య ఉన్న వ్యవధిలో విద్యార్థులను ఆయా సబ్జెక్టుల్లో వెనకబడకుండా మంచి ఫలితాలు సాధించేలా తీర్చిదిద్దుతున్నామని పేర్కొన్నారు.