న్యూఇయర్ కిక్
ABN , Publish Date - Jan 02 , 2026 | 12:24 AM
జిల్లా అంతటా నూతన సంవత్సర వేడుక లు అంబరాన్నంటాయి. చిన్నా పెద్దా తేడా లేకుండా వేడుకల్లో భాగస్వాములయ్యారు. ఈ వేడుకల కోసం మద్యం విక్రయాలు సాగాయి.
రెండు రోజుల్లో రూ.20 కోట్ల మద్యం విక్రయాలు
డిసెంబరు 30, 31న ఘనంగా వేడుకలు
జిల్లా అంతటా నూతన సంవత్సర వేడుక లు అంబరాన్నంటాయి. చిన్నా పెద్దా తేడా లేకుండా వేడుకల్లో భాగస్వాములయ్యారు. ఈ వేడుకల కోసం మద్యం విక్రయాలు సాగాయి. కొత్త సంవత్సరానికి స్వాగతం పలుకుతూ విందులు, వినోదాలు పెద్దఎత్తున సాగాయి. ఈ క్రమంలో డిసెంబరు 30, 31వ తేదీల్లో కలిపి జిల్లా వ్యాప్తంగా రూ.20 కోట్ల మద్యం విక్రయాలు జరిగాయి. సాధారణం ప్రతి రోజూ రూ.6 కోట్ల వరకు మద్యం విక్రయాలు జరుగుతుండేవి. అయితే న్యూఇయర్ వేడుకల సందర్భంగా సుమారు రూ.10కోట్ల మద్యం విక్రయాలు జరిగాయి.
- (ఆంధ్రజ్యోతి-సూర్యాపేట(కలెక్టరేట్)
జిల్లా వ్యాప్తంగా బుధవారం రాత్రి ఏడు గంటల నుంచే న్యూఇయర్ వేడుకల సందడి కనిపించింది. కొంద రు రిసార్ట్ల్లో మరికొందరు బాంకెట్ హాల్స్, పట్టణ శివారుల్లోని గెస్ట్హౌ్సల లో వేడుకలు నిర్వహించుకున్నారు. విద్యాసంస్థల్లో విద్యార్థుల సంబరాలు ఘనంగా జరిపారు. ఒకరికొకరు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుకున్నారు. కేక్లు కట్ చేసి పంపిణీ చేశారు. పట్టణాల్లో పెద్దఎత్తున బాణాసంచాలు కాల్చి సంబురాలు జరుపుకున్నారు. జిల్లా అంతటా గురువారం ఉదయం నుంచి న్యూఇయర్ జోష్ కనిపించింది. ప్రజలందరు ఉదయాన్నే దేవాలయాలను సందర్శించారు. కొన్నిచోట్ల గు రువారం కూడా సంబురాలు కొనసాగాయి.
రెండు రోజుల్లోనే...
వేడుకల సందర్భంగా జిల్లాలో మద్యం విక్రయాలు పెరిగా యి. నూతన సంవత్సర వేడుకలు అనగానే... ఎక్కువగా మద్యం విక్రయాలపై ప్రత్యేక దృష్టి ఉంటుంది. దీంతో జిల్లాలోని 93 మద్యం దుకాణాలు, 15 బార్ అండ్ రెస్టారెంట్లలో మద్యం విక్రయాలు అర్ధరాత్రి వరకు కొనసాగాయి. డిసెంబరు 30, 31వ తేదీల్లో జిల్లాలో రూ.20కోట్ల మద్యం విక్రయాలు జరిగాయి. అందులో సుమారు 13 వేల బీర్ల కాటన్లు, 10 వేల లిక్కర్ కాటన్లు విక్రయాలు జరిగాయి. సాధారణ రోజుల్లో జిల్లాలో ప్రతి రోజూ సుమారు రూ.6 కోట్ల నుంచి రూ.7కోట్ల వరకు మద్యం విక్రయాలు జరుగుతుంటాయి. నూతన సంవత్సర వేడుకల సందర్భంగా అదనంగా రూ.6 కోట్ల నుంచి 8 కోట్ల వరకు మద్యం విక్రయాలు పెరిగాయి.
విస్తృతంగా తనిఖీలు
నూతన సంవత్సర వేడుకల సందర్భంగా జిల్లాలో ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎస్పీ కొత్తపల్లి నర్సింహ ఆధ్వర్యంలో పోలీసులు పటిష్ఠ బందోబస్తు నిర్వహించారు. ముఖ్యంగా యువత మద్యం తాగి వాహనాలపై తిరుగుతూ ప్రమాదాల బారిన పడే అవకాశాలు ఇవ్వకుండా పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకున్నారు. బుధవారం రాత్రి 10.30 గంటల నుంచే పెట్రోలింగ్ నిర్వహించారు. అంతేకాకుండా డ్రంకెన డ్రైవ్ తనిఖీలు చేపట్టారు. ముఖ్యంగా సూర్యాపేట, కోదాడ, హుజూర్నగర్, నేరేడుచర్ల, తిరుమలగిరి పట్టణాలతో పాటు మండల కేంద్రాల్లో పోలీసులు పెట్రోలింగ్ ముమ్మరంగా చేశారు. దీంతో జిల్లాలో రోడ్డు ప్రమాదాలు జరగకుండా అరికట్టగలిగారు. అదేవిధంగా జిల్లాలో ఎక్కడా డీజేసౌండ్లకు అనుమతులు ఇవ్వలేదు. రహదారులపై కేక్ కటింగ్లను అరికట్టారు. జిల్లా వ్యాప్తంగా పోలీసులు 496 మోటార్ వాహనాల చట్టం ఉల్లంఘన కేసులు, 140 మందిపై డ్రంకెన డ్రైవ్ కేసులు నమోదు చేశారు.
పటిష్టమైన చర్యలు తీసుకున్నాం
నూతన సంవత్సరం వేడుకల సందర్భంగా జిల్లాలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తుగా పటిష్ఠ చర్యలు తీసుకున్నాం. ఎక్కడికక్కడ ర్యాష్ డ్రైవింగ్లను నిలువరించాం. డ్రంకెన డ్రైవ్ తనిఖీలు చేపట్టడంతో చాలా మంది రహదారులపైకి రాకుండా ఇళ్లలోనే వేడుకలు జరుపుకున్నారు. ఇతరులకు ఇబ్బందులు కలిగించే యువతను గుర్తించి కౌన్సిలింగ్ ఇచ్చాం. జిల్లావ్యాప్తంగా పెట్రోలింగ్ను ముమ్మరం చేయడంతో ఎలాంటి ప్రమాదాలు, నేరాలు జరగలేదు.
కొత్తపల్లి నర్సింహ, ఎస్పీ సూర్యాపేట