పనులు ఇలాగైతే ఎలా?
ABN , Publish Date - Jun 23 , 2026 | 12:54 AM
భువనగిరి ఖిల్లా అభివృద్ధి పనుల్లో జాప్యంపై రాష్ట్ర పర్యాటకశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ఆగ్రహం వ్యక్తం చేశారు.
మంత్రి జూపల్లి ఆగ్రహం
ఖిల్లా అభివృద్ధి పనుల జాప్యంపై అధికారులు, కాంట్రాక్టర్లను నిలదీసిన మంత్రి
గాంధీ జయంతి నాటికి పూర్తిచేయాలని ఆదేశం
భువనగిరి టౌన, జూన 22(ఆంధ్రజ్యోతి): భువనగిరి ఖిల్లా అభివృద్ధి పనుల్లో జాప్యంపై రాష్ట్ర పర్యాటకశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ఆగ్రహం వ్యక్తం చేశారు. స్వదేశీ దర్శన 2.0లో మంజూరైన రూ.66కోట్ల వ్యయంతో చేపట్టిన ఖిల్లా అభివృద్ధి పనులను సోమవారం తనిఖీచేసి అధికారులు, కాంట్రాక్టర్లపై అసహనం వ్యక్తం చేశారు. నిబంధనల ప్రకారం రెండు నెలల్లో పనులు పూర్తి కావాల్సి ఉండగా, నేటికీ పూర్తిస్థాయిలో ఎందుకు ప్రారంభించలేదని ప్రశ్నించారు. దీంతో బ్లాస్టిం గ్ అనుమతులు లభించలేదని, ఎనహెచఏ సహకరించడం లేదని వివరించే ప్రయత్నాలు చేస్తుండగా ఎంపీ చామల కిరణ్కుమార్రెడ్డి, ఎమ్మెల్యే అనిల్కుమార్రెడ్డి జోక్యం చేసుకుని తమ దృష్టికి తీసుకువస్తే అనుమతు లు ఇప్పించేవారమన్నారు. దీంతో మంత్రి స్పందిస్తూ పనుల్లో అవాంతరాలను ఎంపీ, ఎమ్మెల్యే, జిల్లా అధికారుల దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించుకోవాలన్నారు. రూ.18కోట్లతో రోప్వే రూ.38కోట్లతో సివిల్ పనులు చేపట్టినట్టు పర్యాటకశాఖ ఎండీ గౌతమి మంత్రికి వివరించారు. దీంతో తొలుత రోప్వే పనులపై సమీక్షించారు. 9 పిల్లర్స్ ద్వారా రెండు మార్గాల్లో ఆరు కేబుల్ కార్లు, గంటకు 300మందికి పైగా పర్యాటకులను ఖిల్లాపైకి, పై నుంచి దిగువకు చేరవేస్తాయని ప్రాజెక్టు ఇంజనీర్ వివరించారు. నిబంధన ప్రకారం అక్టోబరులో ట్రయల్ రన ప్రారంభించాలని ఆదేశించారు. రూ.38కోట్ల సివిల్ పనులకు ఇప్పటి వరకు కేవలం రూ.8కోట్ల విలువైన పనులే ప్రారంభం కావడంపై మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంట్రాక్టర్ చెప్పిన కారణాలపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ 15రోజులకు మళ్లీ వస్తానని, అప్పటి వర కు అన్ని పనులను ప్రారంభించాలని, అక్టోబరు నాటికి పూర్తిచేయాలని ఆదేశించారు. పనులపై నెలవారీ నివేదిక సమర్పించాలన్నారు. నాణ్యత లోపిస్తే కఠిన చర్య లు తీసుకుంటామని హెచ్చరించారు. అభివృద్ధి పనులపై ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం ఏర్పాటు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఆయన వెంట కలెక్టర్ అనురాగ్జయంతి, అదనపు కలెక్టర్ భాస్కర్రావు, వారసత్వశాఖ సంచాలకుడు అర్జునరావు, డీడీ నాగరాజు, టూరిజం ఈఈ అజయ్, డీఈ హనుమంతరెడ్డి, ఏఈ అజయ్, మునిసిపల్ చైర్పర్సన తంగేళ్లపల్లి శ్రీవాణిరవికుమార్, వైస్చైర్మన పోతంశెట్టి మంజులవెంకటేశ్వర్లు, గ్రంథాలయ సంస్థ జిల్లా చైర్మన అవేజ్చిస్తీ, ఆర్డీవో కృష్ణారెడ్డి, మునిసిపల్ కమిషనర్ చంద్రప్రకాశరెడ్డి, తహసీల్దార్ జగనమోహన ఉన్నారు.
టూరిజం సర్క్యూట్గా అభివృద్ధి
పర్యాటకానికి జిల్లా అనువైన ప్రాంతమని టూరిజంశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. సోమవారం ఖిల్లా అభివృద్ధి పనుల తనిఖీ అనంతరం విలేకరులతో మాట్లాడారు. యాదాద్రి, కొలనుపాక, భువనగిరి ఖిల్లా, స్వర్ణగిరి, బస్వాపురం ప్రాజెక్టును కలుపుతూ టూరిజం సర్క్యూట్గా అభివృద్ధి చేసే ఆలోచనలో ప్రభుత్వం ఉందన్నారు. కాగా, మంత్రి జూపల్లి పర్యటనతో బైపాస్ రోడ్డుపై కొద్దిసేపు ట్రాఫిక్ ఇక్కట్లు ఎదురయ్యాయి. రోప్వే బేస్ క్యాంపులో పనులు పరిశీలించి పక్కనే ఉన్న ఓ హోటల్లోకి మంత్రి వెళ్లడంతో కొన్ని నిమిషాల పాటు పోలీసులు ట్రాఫిక్ను నిలిపివేశారు. దీంతో పెద్ద సంఖ్యలో వాహనాలు బైపాస్ రోడ్డుపై నిలిచాయి. మం త్రి వెళ్లాక ట్రాఫిక్ను పోలీసులు క్రమబద్ధీకరించారు.
కొలనుపాకను స్టార్ట్ టెంపుల్ సిటీగా తీర్చిదిద్దుతాం
ఆలేరు రూరల్: కొలనుపాకను పర్యాటక కేంద్రం గా, స్మార్ట్ టెంపుల్ సిటీగా తీర్చిదిద్దుతామని పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. సోమవారం కొలనుపాకలోని చండికాంబ సహిత స్వయంభు సోమేశ్వరాలయాన్ని ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య, రాష్ట్ర మహిళా సంక్షేమ శాఖ చైర్మన బండ్రు శోభారాణితో కలిసి దర్శించుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, రూ.5కోట్లతో కొలనుపాకను, సోమేశ్వరాలయాన్ని స్మార్ట్ టెంపుల్గా అభివృద్ధి చేస్తామన్నారు. ఆయన వెంట అధికారులతోపాటు టీపీసీసీ ప్రధాన కార్యదర్శి జనగాం ఉపేందర్రెడ్డి, మార్కెట్ చైర్మన ఐనాల చైతన్య, సర్పంచ బోదరబోయిన యాకమ్మ, ఉపసర్పంచ గొట్టం విజయేందర్రెడ్డి, గంధమల్ల రాజు, మోత్కూరి అయిలయ్య, ఆరె ప్రశాంత, తదితరులు ఉన్నారు.
ఫణిగిరి బౌద్ధక్షేత్రం అభివృద్ధికి రూ.5కోట్లు
మోత్కూరు: సూర్యాపేట జిల్లా ఫణిగిరి బౌద్ధక్షేత్రం అభివృద్ధికి రూ.5కోట్లు మంజూరు చేస్తున్నట్టు పర్యాటకశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రకటించారు. సోమవారం ఎమ్మెల్యే మందుల సామేలుతో కలిసి ఫణిగిరి బౌద్ధ మ్యూజియంలోని బుద్ధుడి కాలం నాటి విగ్రహాలు, పాదాలు, నాణేలు, అశోకుడి శాసనాలను తిలకించారు. రూ.1.60కోట్ల నిధులతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు, రూ.23లక్షలతో చేపట్టనున్న గాజులబండ బౌద్ధక్షేత్ర అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఎమ్మెల్యే సామేలు మాట్లాడుతూ ఫణిగిరి, గాజులబండ బౌద్ధక్షేత్రాల అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలని కోరారు.