యువతకు చేయూత
ABN , Publish Date - Mar 18 , 2026 | 12:23 AM
షెడ్యూల్ కులాల నిరుద్యోగ యు వతకు ఉపాధి కల్పన కోసం రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక అండదండలు అందిస్తోంది. స్వయం ఉపాధి కల్పనకు 2025-26 ఆర్థిక సంవత్సరానికి ఎస్సీ కార్పొరేషన్ ద్వారా రాయితీలపై నిరుద్యోగ యువతీ, యువకులకు ఎలకా్ట్రనిక్ వాహనాలు, వ్యవసాయ పరికరాలు అందజేసేందుకు కార్యాచరణ ను ప్రకటించింది.
రాయితీపై ఎలకా్ట్రనిక్ వాహనాలు
జిల్లాలో ఎస్సీ కార్పొరేషన్ ద్వారా 190 యూనిట్లు
రూ.3.82కోట్ల ఆర్థిక సాయం
యాదాద్రి,మార్చి 17(ఆంధ్రజ్యోతి) : షెడ్యూల్ కులాల నిరుద్యోగ యు వతకు ఉపాధి కల్పన కోసం రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక అండదండలు అందిస్తోంది. స్వయం ఉపాధి కల్పనకు 2025-26 ఆర్థిక సంవత్సరానికి ఎస్సీ కార్పొరేషన్ ద్వారా రాయితీలపై నిరుద్యోగ యువతీ, యువకులకు ఎలకా్ట్రనిక్ వాహనాలు, వ్యవసాయ పరికరాలు అందజేసేందుకు కార్యాచరణ ను ప్రకటించింది. ఎస్సీ కార్పొరేషన్ ద్వారా రాయితీపై ద్విచక్ర (మోటార్ బైక్లు), త్రిచక్ర (ఆటోలు)వాహనాలను, సోలార్ యూనివర్సల్ పంప్ కంట్రోల్ యూనిట్లు అందించేందుకు నిర్ణయించింది. ఈ పథకం కింద బ్యాంక్ల ద్వారా రాయితీలను ఎస్సీ కార్పొరేషన్ అందించనుంది. ఈ మేరకు ఈనెల 24వ తేదీలోగా నిరుద్యోగులు ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకోవాలని ఆహ్వానించింది.
రాయితీ పథకాలకు అర్హులు వీరే..
ఈవీ వాహనాలు, సోలార్ కంట్రోల్ యూనిట్లు రాయితీపై పొందేందుకు తప్పనిసరిగా తెల్లరేషన్కార్డు ఉండాలి. పట్టణ ప్రాంతాల్లో రూ.2లక్షలు, గ్రామీణ ప్రాంతాల్లో రూ.1.50లక్షలలోపు వార్షిక ఆదాయం ఉం డాలి. రవాణా పథకాలకు 21 నుంచి 50 సంవత్సరాల వయసు, వ్యవసాయ ఆధారిత యూనిట్లకు 21-60 సంవత్సరాల మధ్య వయసు ఉండాలి. రవాణా యూ నిట్లకు శాశ్వత డ్రైవింగ్ లైసెన్స్, రెండెకరాల వ్యవసాయభూమి, బోరు బావి ఉన్నట్టు పంచాయతీ కార్యదర్శి తో ధ్రువీకరణ అందజేయాలి. ఈవీ ద్విచక్ర వాహనా ల యూనిట్లను ఊబర్, రాపిడో, జొమాటో, స్విగ్గీ వంటి సేవలు అందిస్తున్న వారికి ప్రాధాన్యం ఉంటుంది.
జిల్లాలో 190 యూనిట్లు, రూ.3.82కోట్ల రాయితీ
జిల్లాలో ఎస్సీ కార్పొరేషన్ 2025-26 కార్యాచరణ పథకంలో 190 యూనిట్లను కేటాయించింది. ఈ యూనిట్లకు రాయితీల కోసం రూ.3.82కోట్లను కేటాయించింది. యువతకు స్వయం ఉపాధి అవకాశాలకు వినియోగించేందుకు ఎలకా్ట్రనిక్ ద్విచక్రవాహనాలు, రవాణా సేవలకు వినియోగించే ఎలకా్ట్రనిక్ ఆటోలతో పాటు వ్యవసాయ రంగంలో వినియోగించే సోలార్ యూనివర్సల్ పంప్ కంట్రోల్ యూనిట్లను పంపిణీ చేయనుంది. ఈవీ టూవీలర్ యూనిట్ విలువ రూ.లక్ష కాగా, అందులో 90శాతం రాయితీ ఉంటుంది. అదే విధంగా త్రీవీలర్ యూనిట్ విలువ రూ.3లక్షలు కాగా, 80శాతం రాయితీ, సోలార్ యూనివర్సల్ కంట్రోల్ యూనిట్ విలువ రూ.3లక్షల నుంచి రూ.7లక్షలు కాగా, ఒక్కోదానికి 60శాతం రాయితీగా ఇవ్వనుంది. జిల్లాలో కేటాయించనున్న 190 యూనిట్లలో 118 ఈవీ బైక్లు, 60 త్రీవీలర్ ఈవీ వాహనాలు, 12 కంట్రోల్ పంప్సెంట్లు ఉన్నాయి. వీటికి ఈనెల 24వ తేదీలోగా అర్హులైన షెడ్యూల్డ్ కులాల నిరుద్యోగ యువతీ, యువకులు ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకోవాల్సి ఉంటుంది.
విధి విధానాలు ఇలా..
రాయితీ పథకాలను రానున్న ఐదేళ్లలో కుటుంబంలో ఒక్కరికి మాత్రమే మంజూరు చేస్తారు. స్వయం ఉపాధి పథకాన్ని మొదటి సారి వినియోగించుకుంటున్న కుటుంబంలోని వ్యక్తులకు ప్రాధాన్యం ఇవ్వనున్నారు. గతంలో దళితబంధు పథకంలో లబ్ధిపొందిన వారు ఈ పథకానికి అర్హులు కాదు. నైపుణ్యం, అనుభవం ఉన్న దరఖాస్తుదారులకు తొలి ప్రాధాన్యం ఇస్తారు. జిల్లాకు కేటాయించిన ఈ యూనిట్లలో దివ్యాంగులకు 5శాతం, మహిళలకు 33.3శాతం ప్రాధాన్యం ఇవ్వనున్నారు. అర్హులైన అభ్యర్థులు దరఖాస్తులను ఈనెల 24వ తేదీలోగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవల్సి ఉంటుంది. ఆన్లైన్లో నమోదుచేసిన దరఖాస్తులను ఆర్జీదారుడు డౌన్లోడ్ చేసుకుని, సంబంధిత ధ్రువ పత్రాలను జత చేసి గ్రామీణ ప్రాంతాల వారు ఎంపీడీవో కార్యాలయంలో, పట్టణ ప్రాంతాల్లో మునిసిపల్ కమిషనర్ కార్యాలయంలో అందించాలి.
జిల్లాకు కేటాయించిన యూనిట్లు, రాయితీ
యూనిట్ పేరు యూనిట్లు విలువ రాయితీ
ఈవీ ద్విచక్రవాహనం 118 రూ.1లక్ష 90శాతం
ఈవీ త్రిచక్రవాహనం 60 రూ.3లక్షలు 80శాతం
సోలార్ యూనివర్సల్
పంప్ కంట్రోల్ 12 రూ.3-7లక్షలు 60శాతం