బీ-ఫాంపై ఉత్కంఠ
ABN , Publish Date - Feb 02 , 2026 | 06:24 PM
మునిసిపల్ ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపిక పార్టీల నేతలకు సవాల్గా మారింది. టికెట్ ఆశిస్తూ నామినేషన్లు వేసినవారిలో ఎవరికి బీ-ఫాం వస్తుంద నే అంశంపై ఉత్కంఠ కొనసాగుతుం టే, అవి ఇవ్వలేకపోయేవారికి నచ్చజెప్పేందుకు ప్రధాన నేతలు తంటాలు పడుతున్నారు.
మిర్యాలగూడ, చండూరు కాంగ్రె్సలో పోటాపోటీ
ఆచితూచి వ్యవహరిస్తున్న ఎంపీ, ఎమ్మెల్యేలు
దేవరకొండ, హాలియా, నందికొండలో బుజ్జగిస్తున్న ఎమ్మెల్యేలు
నల్లగొండ బీజేపీలో స్థానాలు మార్చాలని ప్రతిపాదనలు
(ఆంధ్రజ్యోతి ప్రతినిధి,నల్లగొండ) మునిసిపల్ ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపిక పార్టీల నేతలకు సవాల్గా మారింది. టికెట్ ఆశిస్తూ నామినేషన్లు వేసినవారిలో ఎవరికి బీ-ఫాం వస్తుంద నే అంశంపై ఉత్కంఠ కొనసాగుతుం టే, అవి ఇవ్వలేకపోయేవారికి నచ్చజెప్పేందుకు ప్రధాన నేతలు తంటాలు పడుతున్నారు. కొన్ని చోట్ల టికెట్ దక్కనివారు స్వతంత్రులుగా బరిలో దిగేందు కు సిద్ధమవుతుండడంతో, ప్రధాన అభ్యర్థులకు దడ మొదలైంది.
మిర్యాలగూడ, చండూరు, దేవరకొండ, హాలియా మునిసిపాలిటీల్లో కాంగ్రెస్ టికెట్లకు పోటాపోటీ నెలకొనడంతో అభ్యర్థుల ఎంపిక ఎంపీ, ఎమ్మెల్యేలకు ఇబ్బందికరంగా మారింది. మంగళవారం మధ్యాహ్నాని కి ఎన్నికల రిటర్నింగ్ అధికారులకు బీ-ఫాం సమర్పించేందుకు గడువు ఉంది. అప్పట్లోగా బుజ్జగింపులు, నచ్చజెప్పడాలు, తాయిలాల పంపిణీలు పూర్తిచేయకపోతే ప్రధాన అభ్యర్థులు దెబ్బతినే పరిస్థితి క్షేత్రస్థాయిలో కనిపిస్తుండడం చర్చనీయాంశంగా మారింది.
మిర్యాలగూడ, చండూరులో పోటాపోటీ
మిర్యాలగూడ మునిసిపాలిటీలో కాంగ్రెస్ నుంచి అభ్యర్థుల ఎంపికలో ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలకు ఒత్తిడి పెరిగింది. ఇక్కడ ఒక్కో వార్డులో కాంగ్రెస్ టికె ట్ ఆశిస్తూ ఇద్దరు, ముగ్గురు నామినేషన్లు దాఖలు చేయడంతోపాటు, టికెట్ల కోసం ఒకరు ఎంపీని ఆశ్రయిస్తే, మరొకరు ఎమ్మెల్సీని, ఇంకొకరు ఎమ్మెల్యేపై ఒత్తిడి తెస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాం గ్రె్సలో ఉన్నవారికే టికెట్ల కేటాయింపులో ప్రాధాన్యం ఇవ్వాలనే పట్టుదలతో ఎమ్మెల్యే వర్గీయులుంటే, కొత్త, పాత తేడా లేకుండా గెలుపుగుర్రాలకు అవకాశమివ్వాలని మరో వర్గం నాయకులు పట్టుబడుతున్నారు. ఈ పరిస్థితుల్లో పోటాపోటీ నామినేషన్లు దాఖలవడం, ఇక్కడ అభ్యర్థుల ఎంపిక బాధ్యతను ఎంపీ రఘువీర్రెడ్డికి అధిష్ఠానం అప్పగించడంతో ఆయన ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ కలిసి స్థానిక వార్డుల్లో పరిస్థితులు, గెలుపు అవకాశాలను పరిశీలించి, సర్వేలు చేయించి ఎంపికచేస్తామని చెబుతున్నారు. అభ్యర్థులు ఎవరికివారు వెనక్కితగ్గకపోవడంతో ముందుగానే బుజ్జగింపుల కార్యాచరణ మొదలుపెట్టారు. సోమవారం సాయంత్రానికి అభ్యర్థుల ఎంపిక కొలిక్కివస్తుందని భావిస్తున్నారు. చండూరు మునిసిపాలిటీలో కాంగ్రెస్ టికెట్ల కోసం పోటాపోటీ కొనసాగుతోంది. ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి నేటికీ అధికారికంగా అభ్యర్థులను ప్రకటించలేదు. పార్టీ క్యాడర్, సర్వేల ద్వారా ఇక్కడ అభ్యర్థులను ఎంపికచేసి బీ-ఫాం ఇస్తారని, టికెట్ రానివారు ఉపసంహరించుకునేందుకు నచ్చజెప్పాకే ప్రకటన ఉంటుందని చెబుతున్నారు. మరోవైపు బీఆర్ఎస్ సైతం అభ్యర్థులను గుర్తించినా, కాంగ్రెస్ టికెట్లు ప్రకటించాకే ముందుకువెళ్లాలని భావిస్తోంది. దేవరకొండ, నందికొండ, హాలియా మునిసిపాలిటీల్లో టికెట్ల కోసం పోటాపోటీ ఉన్నా ఎమ్మెల్యేలు బాలూనాయక్, జైవీర్రెడ్డి ఇప్పటికే ఆశావహులతో చర్చలు మొదలుపెట్టి టికెట్లు ఇవ్వలేకపోతున్నవారికి నచ్చజెప్పే ప్రయత్నాలు చేస్తున్నారు. అందరినీ ఒప్పించాకే అధికారికంగా బీ-ఫాం అందజేయాలని నిర్ణయించారు.
బీజేపీలో మల్లగుల్లాలు...
నల్లగొండ కార్పొరేషనలో కాంగ్రెస్, బీఆర్ఎస్ మేయర్ అభ్యర్థిత్వాలతో సహా జాబితాలను ఇప్పటికే ప్రకటించడంతో ప్రచారం కూడా మొదలైంది. ఇక్కడ మరో ప్రధాన పార్టీ బీజేపీ, అభ్యర్థుల ఎంపికలో మల్లగుల్లాలు పడి శనివారం రాత్రికి జాబితాను విడుదల చేసింది. అయితే ఆ జాబితాపై పార్టీ, అభ్యర్థుల్లో అసంతృప్తి వెల్లడవడంతో పాటుగా కొన్ని సీట్లను మార్చాలనే ప్రతిపాదనలను నాయకులు, అభ్యర్థులు తెరపైకి తెచ్చారు. రెండు వార్డుల్లో ఏకంగా నామినేషన్లే వేయనివారిని అభ్యర్థులుగా ప్రకటించడంపై ఆందోళన వ్యక్తమైంది. అభ్యర్థులుగా పార్టీ ప్రకటించిన వారిలో సుమారు 10మంది వరకు వారికి పట్టున్న డివిజన్లలో కాకుండా వేరే డివిజన్లలో టికెట్ ఇచ్చారని, వాటిని సరిచేయాలని అధిష్ఠానాన్ని కోరుతున్నారు. ఇంకొందరు వారికి టికెట్ ఇవ్వలేదని, బీ-ఫాం ఇచ్చేనాటికైనా అవకాశం కల్పించాలని కోరుతున్నట్లు తెలిసింది. సీట్ల మార్పిడి కోరుతున్న నాయకులు, టికెట్లు దక్కకపోయినా పోటీచేయాల్సిందేనని భావిస్తున్నవారు వారి ప్రతిపాదనలను పార్టీ జిల్లా అధ్యక్షుడు, ఇతర సీనియర్ నాయకుల దృష్టికి తీసుకువచ్చారు. దీనిపై సోమవారం నిర్ణయం తీసుకుంటారనే ఆశాభావాన్ని వారు వ్యక్తం చేస్తున్నారు.