Share News

డీజిల్‌ ధరల్లో వ్యత్యాసం

ABN , Publish Date - Apr 27 , 2026 | 12:29 AM

సాధారణంగా డీజిల్‌, పెట్రో విక్రయాలు ఎక్కు వగా రిటైల్‌ అవుట్‌లెట్‌ బంకుల్లో అధికంగా ఉంటాయి. అవికాక పెద్ద ఎత్తున వ్యాపారం చేసే కార్పొరేట్‌ సంస్థలు లారీలు అధికంగా ఉంటే సదరు సంస్థలు, చమురు విక్రయించే సంస్థల నుంచి అనుమతి తీసుకొని, సొంతంగా బంకులను ఏర్పాటు చేసుకుంటాయి.

డీజిల్‌ ధరల్లో వ్యత్యాసం

రిటైల్‌ అవుట్‌ లెట్‌ బంకులో లీటర్‌ ధర రూ 95.39పైసలు

కన్జ్యూమర్‌ బంకుల్లో లీటర్‌ రూ .115

రిటైల్‌ పెట్రోల్‌ పంప్‌లను ఆశ్రయిస్తున్న కార్పొరేట్‌ సంస్థ వాహనాలు

ఇబ్బందులు పడుతున్న సామాన్యులు

(ఆంధ్రజ్యోతి-కోదాడ) :సాధారణంగా డీజిల్‌, పెట్రో విక్రయాలు ఎక్కు వగా రిటైల్‌ అవుట్‌లెట్‌ బంకుల్లో అధికంగా ఉంటాయి. అవికాక పెద్ద ఎత్తున వ్యాపారం చేసే కార్పొరేట్‌ సంస్థలు లారీలు అధికంగా ఉంటే సదరు సంస్థలు, చమురు విక్రయించే సంస్థల నుంచి అనుమతి తీసుకొని, సొంతంగా బంకులను ఏర్పాటు చేసుకుంటాయి. అయితే పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తత పరిస్థితుల నేపథ్యంలో కొంత చమురు సంక్షోభం నెలకొంది. దీంతో ప్రభుత్వం ఆయా బంకులకు విక్రయించే డీజిల్‌ ధర ఇటీవల రూ.15 వరకు పెంచింది. దీంతో కార్పొరేట్‌ సంస్థల యజమాన్యం డీజిల్‌ కోసం రిటైల్‌ అవుట్‌ లెట్‌ బంకులు ఆశ్రయిస్తున్నాయి. ఫలితంగా ప్రైవేటు హనదారులకు(లారీలు,కార్లు,ఆటోలకు) డీజిల్‌ కొరత నెలకొంటుంది. వారు డీజిల్‌ కోసం బంకుల ముందు బారులు తీరాలి లేదా నో స్టాక్‌ బోర్టు చూసి వెళ్లాల్సిన పరిస్థితి. రిటైల్‌ అవుట్‌ లెట్‌ బంకుల్లో ఆదివారం లీటర్‌ డీజిల్‌ ధర రూ.95.39పైసలు ఉండగా, వినియోగదారు(కన్జ్యుమర్‌) బంకుల్లో ధర రూ.115 ఉన్నట్లు సమాచారం. సాధారణంగా 16 టైర్ల లారీ పుల్‌ ట్యాంకు చేస్తే 420 లీటర్ల డీజిల్‌, 14 టైర్ల లారీకి 450 లీటర్ల డీజిల్‌ అవసరం ఉంటుంది. ఆ చొప్పున కన్జ్యూమర్‌ బంకుల్లో 16 టైర్ల లారీకి ఫుల్‌ట్యాంక్‌ చేయాలంటే రూ.48,300 అవ ుతుంది. అదే రిటైల్‌ అవుట్‌లెట్‌ బంకులో రూ 40, 630 అవుతుంది. ఆచొప్పున రూ 8,237లు ఒక్క లారీకి అదనంగా చెల్లించాల్సి వస్తుంది. దీంతో కన్జ్యూమర్‌ బంకు నిర్వహకులు రిటైల్‌ అవుట్‌లెట్‌ బంకులను ఆశ్రయిస్తున్నారు. దీంతో డీజిల్‌ కొరత ఏర్పడుతున్నట్లు సమాచారం గతేడాది ఏప్రిల్‌ 25న చమురు సంస్థల నుంచి ఒక్కొక్క రిటైల్‌ అవుట్‌లెట్‌ బంకుకు రోజుకు 6వేల లీటర్లు వచ్చేది. ప్రస్తుతం అంతే వస్తున్నట్లు సమాచారం. కాగా కన్జ్యూమర్‌ బంకుల నిర్వహకులతోనే డీజిల్‌ కొరత సమస్య నెలకొంటుందని రిటైల్‌ అవుట్‌లెట్‌ బంకు నిర్వాహకులు పేర్కొంటున్నారు. దీంతో ప్రైవేటు వాహనదారులు లారీలు, కార్ల, ఆటోలు, సొంత వాహనదారులు డీజిల్‌ దొరకక ఇబ్బందులు పడాల్సి వస్తుందంటున్నారు. ప్రభు త్వం చొరవ తీసుకొని రిటైల్‌ అవుట్‌లెట్‌ బంకులకు అధికంగా డీజిల్‌ సరఫరా చేసి, కొరత లేకుండా చూడాలని ప్రైవేటు వాహన యజమానులు కోరుతున్నారు.

ఉమ్మడి జిల్లాలో బంకులు ఇలా..

ఉమ్మడి నల్లగొండ జిల్లాలో రిటైల్‌ పెట్రోల్‌ బంకులు 260 ఉన్నట్లు సమాచారం. అదేవిధంగా ప్రైవే టు బస్సులు(స్కూల్స్‌)కార్లు, ఆటోలు, లారీలు, ట్యాక్సీలు సుమారు 38 వేలు ఉన్నట్లు సమాచారం. 260 బంకుల ద్వారా ఆయా వాహనాలు సుమారు 15.6 లక్షల లీటర్ల డీజిల్‌ వాడుతున్నట్లు తెలుస్తోంది. అలాగే జిల్లాలో ఉన్న ద్విచక్రవాహనాలకు సుమారు 5.5 లక్షల లీటర్ల పెట్రోల్‌ విక్రయిస్తున్నట్లు నిర్వహకులు పేర్కొంటున్నారు. కాగా ఉమ్మడి జిల్లాలో సుమారు 15 కన్జ్యూమర్‌ పె ట్రోల్‌ బంకులు ఉన్నాయి. ఈ బంకులు నిర్వహించే సంస్థలకు దాదాపు 100 నుంచి 500 లారీలు కలిగి ఉన్నట్లు సమాచారం. ఈ వాహనాలు రిటైల్‌ అవుట్‌లెట్‌ పంపులను ఆశ్రయించడంతో రాత్రికి రాత్రే బంకులు ఖాళీ అవుతున్నాయి.

మిర్యాలగూడలో బంకుల్లో నో స్టాక్‌..

మిర్యాలగూడ టౌన్‌ : పశ్చిమాసియాలో ఉద్రిక్తల నేపథ్యంలో చమురు కొరత ఏర్పడు తోందన్న వదంతుల కారణంగా ఆయా బంకుల్లో ట్యాంకులు ఖాళీ అవ్వడంతో నిర్వాహకులు నో స్టాక్‌ బోర్డులు పెడుతున్నారు. మరికొన్ని బంకుల యజమానులు బైక్‌లకు 5 లీటర్లు, కార్లకు 20 లీటర్లు మాత్రమే పోస్తామని బోర్డులు పెడుతున్నారు. అయితే పెట్రోల్‌ కొరత లేనేలేదని, ఒక్కసారిగా వాహనదారులు ఎగబడడంతో స్టాక్‌ వెంటనే అయిపోయిందని ఓ పెట్రోల్‌ బంక్‌ నిర్వాహకుడు తెలిపారు.

ఎక్కువ సప్లయ్‌ చేయాలి: రామినేని శ్రీనివాసరావు, లారీ అసోసియేషన్‌ రాష్ట్ర చైర్మన్‌

ప్రభుత్వం చొరవ తీసుకొని రిటైల్‌ అవుట్‌లెట్‌ బంకులకు డీజిల్‌ సప్లయ్‌ అధికంగా చేసి, ప్రైవేటు వాహనదారులకు ఇబ్బంది లేకుండా చూడాలి. వేసవిలోనే ప్రైవేటు వాహనదారుల వాడకం అధికంగా ఉంటుంది. డీజిల్‌ లేకపోతే వాహనాలు నిలిచిపోతాయి. దీంతో వ్యాపారం దెబ్బతింటోంది. సకాలంలో సరుకు చేరాల్సిన ప్రాంతానికి చేరుకోదు. అదే సమయంలో కన్జ్యూమర్‌ బంకులు నిర్వహించేవారిపై ధర భారం తగ్గించి, రిటైల్‌అవుట్‌ లెట్‌ బంకులపై వాటి ప్రభావం లేకుండా చూడాలి.

ఇబ్బందులు పడుతున్నాం : కన్నెబోయిన రామారావు,వినియోగదారుడు

యాసంగి సీజన్‌ సాగు కోసం వేసవిలోనే పశువులు ఎరువును, ట్రాక్టర్లతో చేలలోకి చేరవేస్తాం. డీజిల్‌ దొరకక పోవడంతో ఇబ్బందులు పడుతున్నాం. అంతేకాక ప్రైవేటుగా ట్రాక్టర్లతో కోతలు, లేదంటే ఇతర పనుల అద్దెల కోసం వెళ్తాం. కావాల్సినంత డీజిల్‌ దొరకకపోవడంతో అద్దె పనులను వదులుకోవాల్సి వస్తుంది. ప్రభు త్వం వినియోగదారుల ఇబ్బందులు దృష్టిలో ఉంచుకొని, డీజిల్‌ కొరత లేకుండా చూడాలి.

Updated Date - Apr 27 , 2026 | 12:29 AM