నిలిచిన కమ్యూనిటీ భవన నిర్మాణం
ABN , Publish Date - May 01 , 2026 | 12:28 AM
చౌటుప్పల్ పట్టణంలోని 10వ వార్డు బీసీ కాలనీలో 20 సంవత్సరాల క్రితం చేపట్టిన కమ్యూనిటీ భవన నిర్మాణ పనులు పిల్లర్లకే పరిమితమయ్యాయి.
(ఆంధ్రజ్యోతి-చౌటుప్పల్ టౌన): చౌటుప్పల్ పట్టణంలోని 10వ వార్డు బీసీ కాలనీలో 20 సంవత్సరాల క్రితం చేపట్టిన కమ్యూనిటీ భవన నిర్మాణ పనులు పిల్లర్లకే పరిమితమయ్యాయి. 2006లో అప్పటి మాజీ మంత్రి, భువనగిరి ఎమ్మెల్యే ఎలిమినేటి ఉమామాధవరెడ్డి మంజూరు చేయించిన నిధులతో భవన నిర్మాణ పనులను చేపట్టారు. 2008లో జరిగిన నియోజకవర్గాల పునర్విభజనతో చౌటుప్పల్ మండలాన్ని భువనగిరి అసెంబ్లీ నుంచి తొలగించి మునుగోడు నియోజకవర్గంలో కలపడంతో అభివృద్ధి పనులకు ఆటంకాలు ఏర్పడ్డాయి. ఐదు సంవత్సరాల క్రితం మాజీ కౌన్సిలర్ బొడిగె అరుణాబాలకృష్ణగౌడ్ వినతి మేరకు మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి రూ.5లక్షలను కేటాయించి కొంత మేరకు పనులను చేయించారు. ఆ తరువాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం కమ్యూనిటీ భవనం గురించి పట్టించుకోవడం లేదని కాలనీ వాసులు వాపోతున్నారు.
నిదులు కేటాయించాలి
- కందగట్ల ఆనంద్, 10వ వార్డు
ప్రభుత్వం నిధులు కేటాయించి కమ్యూనిటీ భవన నిర్మాణాన్ని పూర్తి చేయించాలి. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండున్నర సంవత్సరాలు కావస్తున్నా ఈ భవన నిర్మాణం గురించి పట్టించుకోవడం లేదు. ఇప్పటికైనా ప్రభుత్వం తగిన నిధులు కేటాయించి పనులను పూర్తి చేయించాలి.