అన్ని రకాల వైద్య సేవలు అందించాలి
ABN , Publish Date - Mar 14 , 2026 | 12:31 AM
ఆస్పత్రికి వచ్చే రోగులకు అన్ని రకాల వైద్య సేవలను అందించాలని కలెక్టర్ అనురాగ్జయంతి వైద్య సిబ్బందికి సూచించారు. శుక్రవారం మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలను ఆయన తనిఖీ చేశారు.
కలెక్టర్ అనురాగ్జయంతి
రాజాపేట, మార్చి 13 (ఆంధ్రజ్యోతి): ఆస్పత్రికి వచ్చే రోగులకు అన్ని రకాల వైద్య సేవలను అందించాలని కలెక్టర్ అనురాగ్జయంతి వైద్య సిబ్బందికి సూచించారు. శుక్రవారం మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలను ఆయన తనిఖీ చేశారు. పీహెచ్సీలో మెడికల్, లేబర్రూం, ల్యాబ్, రికార్డులను పరిశీలించి పలు సూచనలు చేశారు. ఆస్పత్రిలో రోగులకు అందుతున్న సేవలు, ప్రసవాల సంఖ్య తదితర వివరాలను అడిగి తెలుసుకున్నారు. వైద్యులు, సిబ్బంది నిత్యం అందుబాటులో ఉంటూ మెరుగైన సేవలు అందించాలని సూచించారు. గురుకుల పాఠశాలలో డార్మెటరీరూం, మరుగుదొడ్లు, వంట గది, పాఠశాల పరిసరాలను పరిశీలించారు. విద్యార్థులకు అందిస్తున్న భోజనాన్ని తనిఖీ చేశారు. నాణ్యమైన భోజనాన్ని అందించాలని, గుడ్లు, తాజా కూరగాయలతో రుచికరంగా వంట చేయాలన్నారు. అనంతరం పల్లె ప్రకృతి వనం, నర్సరీని పరిశీలించారు. నర్సరీ, ఎవెన్యూ ప్లాంటేషన్లో మొక్కలు ఎండిపోతున్నాయని అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన వెంట తహసీల్దార్ ప్రదీ్పకుమార్, ఎంపీడీవో నాగవేణి, ఆర్ఐ నర్సింహులు, మండల వైద్యాధికారి డాక్టర్ మోజెస్, గురుకుల ప్రిన్సిపాల్ సుధాకర్ ఉన్నారు.
16న ‘ప్రజావాణి’ రద్దు
భువనగిరి రూరల్, మార్చి 13 (ఆంధ్రజ్యోతి): కలెక్టరేట్లో ఈనెల 16న నిర్వహించే ‘ప్రజావాణి’ కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్టు కలెక్టర్ అనురాగ్జయంతి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలో 2027 జనగణన తొలి దశ హౌసింగ్ జాబితాకు సంబంధించి అధికారులకు శిక్షణ కార్యక్రమం ఉన్నందున 16న నిర్వహించే ‘ప్రజావాణి’ని రద్దు చేస్తున్నట్టు తెలిపారు. జిల్లా ప్రజలు ఈ విషయాన్ని గమనించాలని కోరారు.