స్త్రీనిధి బకాయిలు రూ.10.88 కోట్లు
ABN , Publish Date - Mar 23 , 2026 | 11:10 PM
స్త్రీనిధి రుణాల వసూలులో జిల్లా చాలా వెనుకబడిందని, రికవరీ చేయడంలో అలసత్వం వహించే సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ రిజ్వాన్బాషా షేక్ అన్నారు.
వసూలులో అలసత్వం వహిస్తే కఠిన చర్యలు
జోగుళాంబ గద్వాల జిల్లా కలెక్టర్ రిజ్వాన్బాషా షేక్
గద్వాలన్యూటౌన్, మార్చి 23(ఆంధ్రజ్యోతి): స్త్రీనిధి రుణాల వసూలులో జిల్లా చాలా వెనుకబడిందని, రికవరీ చేయడంలో అలసత్వం వహించే సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ రిజ్వాన్బాషా షేక్ అన్నారు. సోమవారం కలెక్టరేట్లోని సమావేశపు హాలులో నిర్వహించిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ జోగుళాంబ గద్వాల జిల్లాలో 2119 స్వయం సహాయక సంఘాలకు చెందిన 8283 మంది సభ్యులకు స్త్రీనిధి కింద రుణాలు ఇస్తే రూ.10.88 కోట్ల బకాయిలు ఉన్నాయన్నారు. ఎనిమిది మండలాల్లో రూ.కోటి చొప్పున బకాయిలు ఉన్నాయని, 45 రోజుల్లోగా ఇక్కడి సి బ్బంది రూ. 20లక్షలు, మిగిలిన మండలాల వారు రూ.10 లక్షల చొప్పున పెండింగ్ బకాయిలను వసూలు చేయాలని కలెక్టర్ ఆదేశించారు. మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యులు ప్రభుత్వం ఇచ్చే రుణాలను సద్వినియోగం చేసుకోకుండా సొంత ప్రయోజనాలకు వినియోగిస్తే ఉపయోగం లేదన్నారు. ప్రతీ సభ్యురాలు తీసుకున్న రుణాలతో వ్యాపారాలు, వృత్తులు చేసుకొని ఆర్ధికంగా ఎదిగితేనే రుణాలను తిరిగి చెల్లించగలుగుతామన్నారు. సంబంధిత మండలాల ఏపీఎంలు, సీసీలు, వీవోలు రికవరీ యాక్షన్ ప్లాన్ తయారు చేసి స్ర్తీనిధి రుణాల బకాయిలపై ప్రత్యేక కార్యాచరణతో ముందుకెళ్లాలన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్ నర్సింగరావు, స్త్రీనిధి జనరల్ మేనేజర్ రవికుుమార్, రీజినల్ మేనేజర్ సందీప్, డీఆర్డీఏ ఏపీడీ శ్రీనివాస్, ఎల్డీఎం శ్రీనివాసరావు ఉన్నారు.