Share News

జలకళ

ABN , Publish Date - Aug 06 , 2026 | 12:02 AM

ఈ ఏడాది జూలైలో వర్షా లు ముఖం చాటేయడంతో ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలో కరువు మేఘాలు అలుముకున్నాయి.

జలకళ
కొల్లాపూర్‌ మండలం ఎల్లూరు గ్రామం వద్ద మిషన్‌ భగీరథ వాటర్‌ ట్రీట్‌మెంట్‌ ప్లాంటు

నిండుకుండలా రిజర్వాయర్లు

కొల్లాపూర్‌, ఆగస్టు 5 (ఆంధ్రజ్యోతి) : ఈ ఏడాది జూలైలో వర్షా లు ముఖం చాటేయడంతో ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలో కరువు మేఘాలు అలుముకున్నాయి. సాగునీటి సంగతి దేవుడె రుగు.. కనీసం తాగడానికి నీరు దొరుకుతుందో లేదోనని ప్రజలు, రైతులు తీవ్ర ఆందోళన చెందారు. కానీ ప్రకృతి సహకరించకపోయి నా ఎగువ ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షాలు ఉమ్మడి జిల్లాకు తీపి కబురును అందించాయి. కృష్ణానది పరవళ్లు తొక్కడంతో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్న రిజర్వాయర్లు, చెరువులు, కుంటలు జలకళను సంతరించుకున్నాయి.

ఎల్లూరు రిజర్వాయర్‌కు పోటెత్తిన వరద జలాలు

మహాత్మా గాంధీ ఎత్తిపోతల పథకం ద్వారా నిరంతరం నీటి విడుదల ప్రక్రియ కొనసాగుతోంది. ఎగువ నుంచి వస్తున్న వరద నీటిని ఎల్లూరు రిజర్వాయర్‌, సింగోటం శ్రీవారి సముద్రం, జొన్నల బొగుడ రిజర్వాయర్‌, గుడిపల్లి రిజర్వాయర్‌లకు నీటిని తరలించి, అక్కడ పుష్కలంగా నీటి నిల్వలను ఏర్పాటు చేస్తున్నారు. దీనివల్ల ఈ ఏడాది తాగు, సాగునీటికి ఢోకా ఉండదు. మరో వైపు పాలమూరు - రంగారెడ్డి ప్రాజెక్టు ద్వారా అంజనగిరి రిజర్వాయర్‌కు త్వరలోనే నీటిని నింపే ప్రక్రియ ప్రారంభం చేయనున్నారు. ఇప్పటి కే మోటార్లను డ్రైరన్‌, వెట్‌ రన్‌ నిర్వహించారు. దీంతో కరువు కష్టాలు తప్పుతాయని రైతన్నలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా కొల్లాపూర్‌ మండలంలోని ఎల్లూరు వద్ద ఏర్పాటు చేసిన మిషన్‌ భగీరథ వాటర్‌ ట్రీట్‌మెంట్‌ ప్లాంట్‌ ద్వారా ఉమ్మడి పాలమూరు జిల్లాతో పాటు రంగారెడ్డి, వికారాబాద్‌ జిల్లాల పరిధిలోని గ్రామాలు, మండలాలకు, ఈ పథకం ద్వారా తాగునీరు అందుతోంది.

Updated Date - Aug 06 , 2026 | 12:02 AM